Salt | బర్మింగ్హామ్: మధుమేహం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది. భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లమందికి పైగా మధుమేహ రోగులున్నారు. వచ్చే 5 ఏండ్లలో ఈ సంఖ్య 23 కోట్లు దాటుతుందని ఇటీవలే ఓ సర్వే తేల్చింది. మధుమేహం ఎందుకు వస్తుందన్న అంశంపై ఇప్పటివరకు సరైన అవగాహన లేదు. తీపి పదార్థాలు అధికంగా తినటం వల్ల మధుమేహం వస్తుందన్న అపోహలోనే చాలామంది ఉన్నారు. మధుమేహం రావటానికి తీపి పదార్థాలు ఒక కారణం మాత్రమే కానీ.. పూర్తిగా అవే కారణం కాదని పరిశోధకులు తేల్చారు. అయితే, తాజాగా వెల్లడైన ఓ సర్వే మధుమేహ కారణాలపై కొత్త సూత్రీకరణలకు దారి తీస్తున్నది. మధుమేహం రావటానికి ప్రధాన కారణాల్లో ఉప్పుది కీలక పాత్ర అని టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. దాదాపు 12 ఏండ్లపాటు 4 లక్షల మందిపై అధ్యయనం చేసి మరీ ఈ ఫలితాలను వెల్లడించారు.
ప్రతి ఇంటిలోనూ ఉప్పు వాడటం తప్పనిసరి. వంటల్లో వేయటంతోపాటు చాలామంది భోజనం చేసేటప్పుడు మరికొంత ఉప్పును ఆహారంలో చల్లుకొంటుంటారు. డైనింగ్ టేబుల్స్ ఉన్న ఇంట్లో అయితే.. దానిపై ఉప్పు డబ్బా ఉండటం తప్పనిసరి. ఈ అలవాటే ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నదని టులేన్ వర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. యూకే బయోబ్యాంక్ స్టడీ సంస్థ నుంచి 4 లక్షల మంది పౌరుల ఆరోగ్య వివరాలను తీసుకొని వీరు విశ్లేషించారు. ఈ 4 లక్షల మందిలో 12 ఏండ్లలో 13 వేల మంది డయాబెటిక్ బారిన పడ్డారు. ఇందుకు వారి ఆహారంలో అధికంగా ఉప్పును తీసుకోవటమే కారణమని పరిశోధకులు చెప్తున్నారు. బ్రిటన్లో ఒక వ్యక్తి సగటున రోజుకు 8 గ్రాముల (2 టేబుల్ స్పూన్లు) ఉప్పు తింటున్నాడు. దానిని 6 గ్రాములకు తగ్గించేందుకు అక్కడి ఆరోగ్య శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. రోజూ మనం తీసుకొనే ఉప్పులో 1 గ్రాము తగ్గించినా డయాబెటిక్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఈ పరిశోధకులు చెప్తున్నారు. అయితే, ఉప్పు నేరుగా మధుమేహ వ్యాధికి ఎలా కారణమవుతుందన్న విషయం మాత్రం తేలలేదని చెప్పారు.
మనిషి శరీరంలో అన్ని వ్యవస్థలు సవ్యంగా జరిగేలా చూసేది క్లోమం (పాంక్రియాస్). క్లోమం విడుదల చేసే హార్మోన్ ఇన్సులిన్.. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీవకణాలు చక్కెరలను (గ్లూకోజ్) పీల్చుకొనేందుకు సహాయపడేది ఇన్సులిన్. ఉప్పు అధికంగా తినటం వల్ల అది ఈ హార్మోన్ ఇన్సులిన్ను బలహీనపరుస్తున్నదని ఈ పరిశోధనలో తేలింది. మూత్రంలో సోడియం అధికంగా బయటకు వెళ్లేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం అధికమని గుర్తించారు. ఇలా సోడియం అధికంగా బయటకు వెళ్లేవారిలో ఇన్సులిన్ శక్తి తక్కువగా ఉంటుందని, అది మధుమేహానికి దారితీస్తున్నదని వెల్లడించారు.
ప్రాసెస్డ్ ఫుడ్ (షాపుల్లో తినటానికి సిద్ధంగా లభించే ఆహారం) వల్ల మనకు తెలియకుండా అధిక స్థాయిలో ఉప్పు తింటున్నామని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఇంట్లో వండుకొనే వంటల్లో ఉప్పును అవసరం మేరకే వేసుకోవటం అందరికీ అలవాటే. బయట దొరికే ప్రాసెస్డ్ ఆహారంలో మాత్రం స్థాయికి మించి ఉప్పు ఉంటుంది. అది ఎక్కువకాలం నిల్వ ఉండటానికి ఉప్పును అధికంగా కలుపుతారు. ఆ ఆహారం తరుచూ తినేవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నదని పేర్కొన్నారు.