భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. సైజులో చిన్నగా కనిపించే నువ్వుల్లో మన శరీరానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో నువ్వులు ఒకటిగా ఉన్నది. ఈ క్రమంలో నిత్యం గుప్పెడు నువ్వులు తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నిత్యం గుప్పెడు (30 గ్రాములు) నువ్వులను తినడం వల్ల మనకు 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ మనల్ని చుట్టుముట్టకుండా కాపాడుతాయి.
నువ్వుల్లో శరీరానికి అతి ముఖ్యమైన ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ వంటి ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండి ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత నుంచి త్వరగా బయటపడేస్తాయి.
నువ్వుల్లో డైటరీ ప్రొటీన్తో పాటు నాణ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రొటీన్ డైట్ పాటించే వారికి ఇది బెస్ట్ ఫుడ్.
నువ్వులను నిత్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నువ్వులు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా నిరోధించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే వీటివల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.
నువ్వుల్లో ఉండే మెగ్నీషియం మధుమేహాన్ని నివారిస్తాయని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది హైపర్సెన్సిటిఇటీ మధుమేహం ఉన్నవారికి శరీరంలోకి ప్లాస్మా గ్లూకోజ్ను తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
హైబీపీ సమస్య ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే మంచిది. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.
నువ్వుల నూనెను రాసుకుంటే ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయన్న సంగతి తెలిసిందే. అయితే నువ్వులను తిన్నా నొప్పులను తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఇక నువ్వులను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్లు బి1, బి3, బి6లు అందుతాయి.
నువ్వులను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే ప్రయోజనం కలుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నువ్వులను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే సెలీనియం, కాపర్, జింక్లు థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వారిలో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. దీంతోపాటు హార్మోన్లు కూడా సమతుల్యంగా పనిచేస్తాయి.
నువ్వుల్లో ఉండే జింక్ చర్మతత్వాన్ని కాపాడే కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చర్మంపై నల్లటి వలయాలు, ముడతలు రాకుండా నివారిస్తుంది.
వీటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు మనలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలోని థయామిన్, ట్రిప్టోఫాన్ వంటివి మనశ్శాంతిని పెంచే విటమిన్లు సెరోటోనిన్ ఉత్పత్తికి సాయపడి మనకు ఒత్తిడిని తగ్గిస్తాయి.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దంతాలపై మరకలు తొలిగిస్తుంది.
రేడియేషన్ వల్ల కలిగే డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది.
కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.
కీళ్లనొప్పులకు చెక్ పెట్టొచ్చు.
ఆస్తమాతో బాధపడుతున్న వారు నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో నువ్వులను తింటే ఆస్తమాను సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవచ్చు.
నువ్వులను వేయించి తీసుకోవచ్చు. లేదా అల్పాహారం, భోజనంలోనూ, బెల్లంతో చేసిన లడ్డూల రూపంలో, పెరుగు, సలాడ్లు, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా నువ్వులతో మనకు పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.