Summer | అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వాతావరణంలో మితిమీరిన తేమ కిడ్నీలకు చేటు చేస్తాయి. ఆరోగ్యవంతులైనా సరే ఎండాకాలం సూర్యుడి నుంచి తమను తాము కాపాడుకోవాలి. శరీరంలోని నీరు చెమట రూపంలో అధికంగా బయటికి పోతుంది కాబట్టి, డీహైడ్రేషన్ ముప్పు పొంచి ఉంటుంది. దీంతో కిడ్నీ సమస్యలూ తలెత్తుతాయి. ఇప్పటికే మూత్రపిండ వ్యాధులు ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండకాలం చెమట కారణంగా శరీరం ఎక్కువ మొత్తంలో నీళ్లను కోల్పోతుంది. అలా డీహైడ్రేషన్కు ఆస్కారం ఎక్కువ. కిడ్నీలో రాళ్లకు డీహైడ్రేషన్ కూడా ఓ కారణం. ఎండకాలంలో మాంసాహారం లాంటి ప్రొటీన్లు ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాళ్లలో కూడా కిడ్నీల్లో రాళ్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి, మాంసాహారులు తగిన మోతాదులో నీళ్లు తాగాలి. ఇక ఫాస్ట్ఫుడ్స్లో ఉప్పు, ప్రొటీన్లు, చక్కెరలు ఎక్కువ. ఇవి రాళ్ల ముప్పు పెంచుతాయి. అందువల్ల కిడ్నీల ఆరోగ్యానికి హామీ ఇచ్చే ఆహార పదార్థాల మీదే దృష్టిపెట్టాలి. పెద్దలు రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. బయటికి వెళ్తున్నప్పుడు నీళ్ల బాటిల్ వెంట తీసుకువెళ్లాలి. మూత్రాన్ని ఉగ్గబట్టుకోకూడదు. దీనివల్ల మూత్రం సాంద్రత ఎక్కువై రాళ్లు వృద్ధి చెందుతాయి.
ఎండకాలం చెమట ఎక్కువగా పట్టడం వల్ల బీపీ కూడా పడిపోతుంది. కాబట్టి డాక్టరును సంప్రదించి రక్తపోటు పెంచే మందులు వెంట ఉంచుకుంటే మంచిది. వివిధ రుగ్మతలతో డైయూరిటిక్ ఔషధాలు తీసుకునే వారిలో మూత్ర విసర్జన సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారు డాక్టర్ను సంప్రదించి తగిన మోతాదులోనే ఆ ఔషధాన్ని సిఫారసు చేయమని అడగాలి.