Vajrasana | భోజనం ముగిసిన కొద్దిసేపటికే పొట్ట బరువుగా అనిపించడం, ఉబ్బరం, అలసట వంటి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఈ అసౌకర్యం నిద్రపైనా ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో వెంటనే మందులు తీసుకోవడం లేదా పడుకోవడం కంటే ఒక సులభమైన సహజ మార్గం ఉంది. అదే వజ్రాసనం లేదా థండర్బోల్ట్ పోజ్. వజ్రాసనం భోజనం తర్వాత జీర్ణక్రియకు సహాయపడే సులభ యోగా ఆసనమని యోగా నిపుణులు చెబుతున్నారు. వజ్రాసనం ప్రత్యేకత ఏమిటంటే, ఇది భోజనం చేసిన వెంటనే చేయగలిగే అరుదైన యోగా ఆసనాలలో ఒకటి. భారతీయ సంప్రదాయంలో శతాబ్దాలుగా దీన్ని జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. పరిశోధనల ప్రకారం యోగా అభ్యాసం చేసే వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చలనం, జీవనశైలి అలవాట్లను అనుసరిస్తారు.
ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలో జీర్ణక్రియ అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీని వలన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఉబ్బరం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వెన్ను కండరాలు బలపడటానికి ఇది సహాయపడుతుంది. కొంతవరకు సయాటికా నొప్పి తగ్గించడంలో కూడా ఉపశమనం ఇస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్-2 డయాబెటిస్ లక్షణాల నియంత్రణలో కూడా ఇది కొంత ఉపయోగకరమని పరిశోధనలు చెబుతున్నాయి. వజ్రాసనం చేయడం చాలా సులభం. ముందుగా నేలపై మోకాళ్లపై కూర్చోవాలి. మోకాళ్లు కలిపి ఉంచి, పాదాలపై పిరుదులను వుంచాలి. వెన్నుని నిటారుగా ఉంచి, భుజాలను రిలాక్స్ చేయాలి. చేతులను తొడలపై ఉంచి, కళ్లను మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. భోజనం తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉండటం మంచిది. కొత్తవారు మొదట 2-3 నిమిషాల నుంచి ప్రారంభించి, క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.
ఈ ఆసనం చేసిన కొద్దిసేపటికే పొట్ట తేలికగా అనిపించడం మొదలవుతుంది. దీన్ని రోజువారీ అలవాటుగా మార్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, ఆమ్లత్వం, అజీర్ణ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇది మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. అయితే తీవ్రమైన మోకాళ్ల నొప్పి, కాళ్ల గాయాలు లేదా కీళ్ల సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. అవసరమైతే కాళ్ల మధ్య కుషన్ ఉపయోగించడం ద్వారా సౌకర్యంగా చేసుకోవచ్చు. దీన్ని దీర్ఘకాలిక జీర్ణ సమస్యలకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. తరచూ ఇబ్బందులు ఎదురైతే వైద్యులను సంప్రదించడం అవసరం. ఇక వజ్రాసనం అసలు ప్రయోజనం దీన్ని క్రమం తప్పకుండా వేయడంలోనే ఉంది. భోజనం తర్వాత వెంటనే పడుకోవడం లేదా మొబైల్ వాడటం కంటే, కొన్ని నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చిన్న అలవాటు అయినా, పెద్ద మార్పును తీసుకువస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.