దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పడుతూ.. లేస్తూ.. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 404.53 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 78,499.17 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 187.05 పాయింట్లు లేదా 0.76 శాతం అందుకొని 24,570.65 దగ్గర స్థిరపడింది. ఈ నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణా, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఈ వారం కీలకమని మెజారిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
అలాగే ఏప్రిల్-జూన్ ఆర్థిక ఫలితాలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం సైతం ప్రధానమే. కాగా, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ షేర్లలో సెల్లింగ్ ప్రెషర్కు అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,700-24,900 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.