కరోనా.. కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. అనేకానేక సందేహాలను ఉసిగొల్పుతున్నది. రెండు డోసుల టీకా పూర్తయినవారికి బూస్టర్ తప్పనిసరా? ఇప్పటికే బూస్టర్ తీసుకున్న వాళ్ల సంగతి? అదనపు బూస్టర్కు వెళ్లాల్సిందేనా? వెళ్లినా.. ఇంజెక్షన్ టీకా, ముక్కు టీకా? ఏది మేలు, ఎంత మేలు?.. ఇలాంటి అనేకానేక సందేహాలకు నిపుణుల సమాధానం..
బూస్టర్.. ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి. అయితే, దేశవ్యాప్తంగా 28 శాతం మంది మాత్రమే బూస్టర్ తీసుకున్నారు. తెలంగాణలోనే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 50 శాతం ప్రజలు బూస్టర్ డోస్ తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం అందిస్తున్న టీకా వుహాన్ బేస్డ్ కావడం వల్ల ఒమిక్రాన్పై పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశాలు తక్కువని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచీ వైద్య రంగంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. డెల్టా వేరియెంట్ సమయంలో తయారుచేసిన టీకాలు అప్పటి సవాళ్లను సమర్థంగానే అడ్డుకున్నాయి. అయితే, ఐదో వేరియెంట్ అయిన ఒమిక్రాన్లో మళ్లీ వివిధ ఉపకారకాలు ఉత్పన్నం కావడంతో.. గతంలో తయారైన టీకాలు ఒమిక్రాన్ ఉపకారకాలపై ఆశించిన స్థాయిలో పనిచేయవని అంటున్నారు. కాబట్టి, ఒమిక్రాన్ బేస్డ్ టీకాలు తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఆ నాలుగు వేరియెంట్లూ..
రెండున్నరేండ్ల క్రితం వచ్చిన వేరియెంట్ల ఆధారంగా తయారుచేసిన వ్యాక్సిన్లన్నీ వుహాన్ ఆధారిత టీకాలే. ఇప్పటివరకు ప్రధానంగా ఐదు రకాల కరోనా వేరియెంట్లు వచ్చాయి. అందులో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా మొదటి నాలుగు. ఐదోది ఒమిక్రాన్. అయితే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వచ్చిన సమయంలో.. అంటే మొదటి రెండు దశల్లో కరోనా టీకా అందు బాటులో లేదు. అందుకే, అపార ప్రాణనష్టం జరిగింది. అత్యధికంగా దవాఖాన పాలయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే వుహాన్ ఆధారిత టీకాలు వచ్చాయి. కొవాగ్జిన్, కొవీషీల్డ్, ఫైజర్ ఆ కోవకు చెందినవే. వీటిని
ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. వుహాన్ ఆధారిత టీకాలకు తీవ్రమైన జబ్బును తగ్గించే శక్తి ఉంటుంది. అది కూడా ఆరు నెలల వరకు మాత్రమే. ఆ తరువాత దాని శక్తి 95 శాతం నుంచి 60 శాతానికి పడిపోతుంది.
టీకావల్ల ఉత్పత్తి అయిన ఈ రోగ నిరోధకతను ‘వ్యాక్సిన్ ఇమ్యూనిటీ’గా పరిగణిస్తారు. టీకా తీసుకోవడానికి ముందు కానీ, తీసుకున్న తరువాత కానీ రోగి ఇన్ఫెక్షన్కు గురైతే శరీరంలో సహజమైన ఇమ్యూనిటీ ఉత్పన్నం అవుతుంది. దీన్ని ‘హైబ్రీడ్ ఇమ్యూనిటీ’గా పరిగణిస్తారు. ఒమిక్రాన్లో బీఏ.1, బీఏ.2, ఎక్స్బీబీ, బీక్యూ.1, బీక్యూ.2.. ఇలా అనేక ఉపకారకాలు పుట్టుకొచ్చాయి. తాజాగా బీఎఫ్.7 కలకలం రేపుతున్నది. కానీ, ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత ప్రమాదకారి కానేకాదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వుహాన్ ఆధారిత వ్యాక్సిన్లు ఒమిక్రాన్పై సమర్థంగా పనిచేయడం లేదని తెలుస్తున్నది. కారణం ఈ వ్యాక్సిన్లలో ఐజీజీ, ఐజీఎం యాంటీ బాడీస్ మాత్రమే ఉంటాయి. వీటిని తీసుకున్న ఆరు నెలల తరువాత.. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లను అడ్డుకునే శక్తి 6 శాతం మాత్రమే ఉంటుంది. అదే బూస్టర్ డోస్ తీసుకున్న 14 రోజులకు.. తీవ్రమైన జబ్బును ఎదుర్కొనే శక్తి 90 శాతం, ఇన్ఫెక్షన్ను అడ్డుకునే శక్తి 40 శాతం పెరుగుతుంది. ఈ సత్తువ మరింత అధికం కావాలంటే.. నాజల్ డ్రాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ముక్కు ద్వారా తీసుకునే టీకా వల్ల ఇన్ఫెక్షన్ను అడ్డుకునే బలం 60 శాతానికి పైగా పెరుగుతుందని చెబుతున్నారు.
నాజల్ వ్యాక్సిన్ ఉత్తమం
ప్రస్తుతం ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ వల్ల ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ మాత్రమే వస్తాయి. రక్తంలో వైరస్ కలిసినప్పుడే ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. శరీర ఉపరితలంపై ఉన్న వైరస్పై సమర్థంగా పనిచేయలేవు. ప్రస్తుతం ఊపందుకుంటున్న ఒమిక్రాన్
ఆధారిత కారకాలు ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’నే దెబ్బతీస్తాయి. అంటే, ఈ కారకాలు రక్తంలో కలవడం తక్కువ. అందువల్ల, ఇంజెక్షన్ రూపంలో తీసుకునే టీకాలు ఒమిక్రాన్ వేరియెంట్పై అంతగా ప్రభావం చూపలేవని తెలుస్తున్నది. అదే ముక్కు ద్వారా తీసుకునే నాజల్ టీకాలో ఐజీజీ, ఐజీఎంతో పాటు ఐజీఏ యాంటిబాడీస్ కూడా వస్తాయి.
సాధారణంగా వైరస్ ముక్కు ద్వారానే శరీరంలో ప్రవేశిస్తుంది. ముక్కులో ఉండే ఐజీఏ యాంటిబాడీస్ వైరస్ను ముక్కు దగ్గరే అడ్డుకుంటాయి. దీనివల్ల వైరస్ సోకే అవకాశాలు అతి తక్కువని చెప్పవచ్చు. కాబట్టే, ఇప్పటి వరకూ బూస్టర్ డోస్ తీసుకోనివారు నాజల్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, మన దగ్గర వుహాన్ ఆధారిత బీబీ154 అనే నాజల్ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. వయో ధికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో బూస్టర్ తీసుకోనివారు 50 శాతానికి పైగా ఉన్నారు. వాళ్లంతా తక్షణం మూడో డోస్గా బూస్టర్ తీసుకోవాలి. అదీ నాజల్ టీకా అయితే మరింత మేలు.
మార్గదర్శకాలు లేవు
మనదేశంలో నాలుగో డోస్.. అంటే రెండో బూస్టర్ తీసుకోవడంపై ఎలాంటి మార్గదర్శకాలూ లేవు. కానీ, నాలుగో డోస్ (రెండో బూస్టర్) ఇవ్వాల్సి వస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, హైరిస్క్ ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కాకపోతే, మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా బూస్టర్ దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 194 దేశాలలో.. 54 దేశాల వరకూ మొదటి రెండు డోసుల దశలోనే ఉండటం గమనార్హం. భారత్ సహా మరో 59 దేశాలు మొదటి బూస్టర్ దశలో, 80 దేశాలు రెండో బూస్టర్ దశలో ఉన్నాయి. దశ ఏదైనా సరే.. మహమ్మారి పూర్తిగా వదిలిపోనంత కాలం తగిన జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ తప్పనిసరి. సామాజిక దూరమూ తప్పనిసరే.
…?మహేశ్వర్రావు బండారి
పరిశోధనల స్థాయిలోనే
ప్రస్తుతం కలకలం రేపుతున్న బీఎఫ్.7 వేరియెంట్, దాని తరువాత రాబోయే వేరియెంట్లను ఒమిక్రాన్ ఆధారిత వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకోగలవు. కాకపోతే, ఈ తరహా వ్యాక్సిన్లు ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు ఒమిక్రాన్ ఆధారిత టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఫైజర్ కంపెనీకి, మరొకటి మోడ్రనా కంపెనీకి చెందినవి. మరో 10 రకాల ఒమిక్రాన్ ఆధారిత వ్యాక్సిన్లు పూర్తి రూపాన్ని సంతరించుకోలేదు. అందులో భారత్ బయోటెక్కు చెందిన టీకా కూడా ఉంది. ఇది ప్రీ క్లినికల్ ట్రయల్ దశలో ఉంది.
డాక్టర్ కిరణ్ మాదాల క్రిటికల్ కేర్ విభాగాధిపతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్