ముంబై : నిన్న మొన్నటి వరకూ కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరైన దేశ వాణిజ్య రాజధాని ముంబైని ఇప్పుడు డెంగ్యూ పీడిస్తోంది. గత నెలలో కొవిడ్-19 కేసుల కంటే అధికంగా మలేరియా, డెంగ్యూతో బాధపడే రోగులు నగరంలోని పలు దవాఖానల్లో అడ్మిట్ అయ్యారు.
గత ఏడాది ముంబైలో 129 డెంగ్యూ కేసులు మూడు మరణాలు నమోదవగా ఈ ఏడాది ఇప్పటివరకూ 305 డెంగ్యూ కేసులు ముంబైలో వెలుగుచూశాయని అధికారులు తెలిపారు. వీటిలో 144 కేసులు కేవలం ఆగస్ట్లోనే నమోదవగా సెప్టెంబర్లో ఇప్పటివరకూ 85 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయని బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నివేదిక వెల్లడించింది. ఇటీవల కరోనా వైరస్ కేసుల కంటే అధికంగా డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక యూపీలోనూ డెంగ్యూ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఫిరోజాబాద్లో డెంగ్యూతో బాధపడుతూ 60 మంది చిన్నారులు మృత్యువాతన పడగా 465 మంది పిల్లలు జిల్లా బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగరాజ్, ఆగ్రా జిల్లాల్లో వరుసగా 97, 35 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి.