KTR | లోకసభలో దద్దరిల్లే గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని.. ఆయనను పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. అలంపూర్ తాలూక బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓడినా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు 39 స్థానాల్లో గెలిచామన్నారు. 14 స్థానాల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా చేసిన వారంతా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని.. ప్రస్తుత మన నాయకుడు నడవలేని స్థితిలో ఉన్నారన్నారు. కవితను నరేంద్ర మోదీ తీసుకుపోయాడని.. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికార పార్టీలోకి వెళ్తున్నారన్నారు. కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్కు అండగా ఉంటామని బీఆర్ఎస్లోకి వచ్చారన్నారు.
కేసీఆర్ వెయ్యి గురుకుల పాఠశాలలను కేటాయిస్తే అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ఆయనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం సినిమాల్లో పార్ట్-1, పార్ట్-2లుగా వస్తున్నాయని.. అలాగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అన్నాడని.. మోసగాడు పార్ట్-2 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినందుకు ఆగస్టు15 న మళ్లీ రుణమాఫీ అంటున్నాడని విమర్శించారు. నిజాయితీ గల మోసగాడు రేవంత్రెడ్డి అన్నారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కాడని.. లంకె బిందెలు అనుకోని ఖాళీ బిందెలు అంటున్నాడన్నారు. మహబూబ్నగర్లో ప్రచారానికి వచ్చినప్పుడు సీఎంగా పని చేసిన కేసీఆర్ను నానా బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మగాడివైతే రుణమాఫీ చేసి.. 46లక్షల ఆసరా పింఛన్లు, వంద రోజుల్లోనే చెప్పిన మాటలను మగాడివైతే చేయాలని సవాల్ విసిరారు. దేవుళ్ల సాక్షిగా సీఎం అబద్ధాలు చెబుతున్నాడన్నారు.
నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని.. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. కేసీఆర్ పదేళ్లు ఉన్నప్పుడు సాగునీరు, రైతుబంధు, 24 గంటల కరెంట్కు ఇబ్బంది లేదని.. కానీ, ఇప్పడు ఒక్కరికొక్కరు రైతుబంధు పడ్డాయా? అని ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం 30వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిందని.. 100 రోజుల్లోనే ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కృష్ణా జలాల్లో మా నీటి వాటా చెప్పాలని మొత్తుకున్న పట్టించుకోని ప్రధాని మోదీ పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు ఏమిచేయని అసమర్థ ప్రధాని అని విమర్శించారు. ఇండ్లు కట్టిస్తామని.. 15లక్షలు పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారని గుర్తు చేశారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని.. ఇంటింటికి అక్షింతలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. గతం గతః.. భవిష్యత్తు ఆలోచించు కొని ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కులం లేదు.. మతం లేదు.. తెలంగాణ గొంతుక ఉండాలంటే బీఆర్ఎస్ని ఆదరించాలని కేటీఆర్ కోరారు.