ఈ ఏడాది భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎండల్లో బయటికి వెళ్లేవాళ్లు… ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటాయి. ఈ నెల చివరి నాటికి, వచ్చే మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. పెరుగుతున్న ఎండల వల్ల వడదెబ్బ బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నది. పిల్లలకు పరీక్షలు పూర్తయి ఈ వారమే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఎంత ఎండగా ఉన్నా పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తుంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఎండ తీవ్రత వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటినుంచి కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Summer | దాదాపు పరీక్షలన్నీ ముగియడంతో పిల్లలు బయట ఎండలో ఆడుకోవడం సహజం. అయితే పొద్దున్నుంచే ఎండ తీవ్రంగా ఉంటున్నది. దీంతో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో ఆడటం, తిరగడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, హెపటైటిస్ తదితర సమస్యల బారిన పడే అవకాశాలుంటాయి. అంతేకాకుండా పిల్లల్లో ‘హీట్ రెగ్యులేషన్ సిస్టమ్’ తక్కువ స్థాయిలో పనిచేయడం, వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటం వల్ల పిల్లలు పెద్దలతో పోల్చితే త్వరగా వడదెబ్బకు గురయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. వడదెబ్బకు గురైన వెంటనే చిన్నారులు డీహైడ్రేషన్ బారిన పడతారు. అంటే శరీరంలోని నీరు ఆవిరైపోతుందన్నమాట. ఎక్కువగా ఎండలో తిరగడం మాత్రమే కాకుండా వడగాలులు, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. పిల్లలు ఎండలో తిరగడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు వాతావరణంలోని ఉష్ణోగత్రకు ఆవిరైపోతాయి. దీంతో వాళ్లు త్వరగా నీరసించి పోతారు. కాబట్టి వేసవిలో పిల్లలను సాధ్యమైనంత వరకు ఎండల్లో బయటికి వెళ్లనీయకపోవడమే ఉత్తమం. ఎండాకాలంలో ఎక్కువ శాతం ద్రవ పదార్థాలు ఇవ్వాలి. బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి. ఒకవేళ బిడ్డలను బయటికి పంపాల్సి వస్తే ఎండ తగలకుండా తలకు టోపి, గొడుగు తప్పనిసరిగా వాడాలి. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేయాలి. తెలుపు రంగువైతే మరీ మంచిది. ఎండాకాలంలో పిల్లలను నూనె పదార్థాలు, జంక్ ఫుడ్కు దూరంగా ఉంచాలి. కలుషితమైన నీరు, కలుషిత ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పై లక్షణాలు కనిపించిన పిల్లలను వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. దీనికిముందు డీహైడ్రేషన్కు గురైన పిల్లలకు ఓఆర్ఎస్ ద్రవాన్ని కొద్దికొద్దిగా తాగించాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే ఇంట్లో కాచి,
చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు చెక్కరను కలిపి ఆ ద్రవాన్ని తాగించాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీళ్లు తాగించడం మంచిది. వాంతులు, విరేచనాలు నియంత్రణ లోకి రాకపోతే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి.
ఐదేండ్ల లోపు చిన్నారులు చాలా సున్నితంగా ఉంటారు. తీవ్రమైన సూర్యరశ్మిని వారు తట్టుకోలేరు. ఎండలో చిన్నపిల్లలను బయట తిప్పడం వల్ల డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాంతులు, విరేచనాలు ఏర్పడి వెంటనే డీహైడ్రేషన్కు గురవుతారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బయటికి తీసుకువెళ్లాలి. పిల్లలకు కాటన్ దుస్తులు వేయాలి. వేసవిలో ఇంటినుంచి బయటికి వెళ్లకపోయినా పిల్లలు ఎండవేడి, వడగాలుల వల్ల డయేరియా, డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పిల్లలను ఉంచే గదులు చల్లగా ఉండేలా జాగ్రత్తపడాలి.
వాంతులు, విరేచనాలు
వేసవిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులను అత్యవసరమైతే తప్ప పగటి వేళల్లో బయటికి తీసుకురావద్దు. ఎండ తీవ్రత చిన్నపిల్లలు, గర్భిణులపై ఎక్కువగా ఉంటుంది. త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉన్న కారణంగా వీరికి తరచూ నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు తాగించాలి. ముఖ్యంగా గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కూల్డ్రింక్స్ వంటివి కాకుండా ప్రకృతి సహజమైన కొబ్బరినీళ్లు, చెరుకు రసం, తాజా పండ్లరసాలు తీసుకోవడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు వంటివి అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం తల్లీబిడ్డలకు ప్రమాదకరం.
సాధారణంగా 40 డిగ్రీలు ఆపై ఉష్ణోగ్రతల వల్ల వడగాలులు వీస్తుంటాయి. వీటివల్ల శరీరంపై స్వేదరంధ్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి, చెమట బయటికి రాకుండా ఉండిపోతుంది. దీంతో శరీరంలో వేడి తీవ్రమై మనిషి అస్వస్థతకు గురవడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఎండ అధికంగా ఉండే సమయంలో బయటికి రావొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తే శరీరంపై సూర్యకిరణాలు పడకుండా జాగ్రత్తపడాలి. ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి నీరు తాగాలి. నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు. వడదెబ్బకు గురైనవారిని, ఎండలో తిరిగి మూర్ఛపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. ముఖంపై మంచినీరు చల్లి, స్పృహ వచ్చిన తరువాత నెమ్మదిగా చల్లటి మంచినీరు తాగించాలి. ఐస్ ముక్కలతో చంకలు, గజ్జల్లో తుడవడం వల్ల శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తాగించాలి. ఎండలో వెళ్లేవారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేదా మజ్జిగ, అంబలి వంటివి వెంట ఉంచుకోవడం మంచిది.