హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కంటివెలుగు పథకానికి రూపలక్ప న చేశారు. 2018లో నిర్వహించిన కంటి పరీక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. దీనికి కొనసాగింపుగా ‘కంటివెలుగు-రెండో విడత’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం వేదికగా లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాతి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి శిబిరాలు ప్రారంభం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 1500 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. కావాల్సిన పరికరాలన్నీ సిద్ధం చేసింది. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా కంటి పరీక్షలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో కంటి వెలుగు పరీక్షల సంఖ్య కోటిన్నర దాటింది. 100 రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో అధికారుల కృషి ఫలితంగా కేవలం 80 రోజుల్లోనే కోటిన్నర మార్కును అందుకున్నారు. రికార్డు సృష్టించారు. కోటిన్నర మందిలో 25.60 శాతం మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 39 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ట్యాబ్లెట్లు ఇచ్చారు. కంటివెలుగు శిబిరాలు పట్టణ ప్రాంతాల్లో దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 3,788 వార్డుల్లో శిబిరాలు నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 3,443 పట్టణ వార్డుల్లో శిబిరాలు పూర్తయ్యాయి. మరో 281 వార్డుల్లో పురోగతిలో ఉన్నాయి. అంటే లక్ష్యంలో 99 శాతం పూర్తయినట్టే. గ్రామాల్లోనూ సుమారు 95 శాతం పూర్తయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 12,763 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించున్నారు. ఇప్పటివరకు 11,634 గ్రామాల్లో పూర్తికాగా, 592 గ్రామాల్లో తుదిదశలో ఉన్నాయి.