క్యాన్సర్ను ఒకప్పుడు తలరాతగా భావించేవారు. ఆ తర్వాత కాలంలో జన్యువులే ఇందుకు ముఖ్యకారణం అనుకున్నారు. కానీ ఇప్పుడు… క్యాన్సర్ రావాలా వద్దా అన్నది మన చేతిలో కూడా ఉంటుందని గుర్తిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాలైన ఆహారంతో ఈ ప్రాణాంతక వ్యాధిని వీలైనంత దూరం పెట్టవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. వాటిలో కొన్ని సూచనలు…
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్స్, అవిసె గింజల్లాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారకాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
ఆకు కూరలు, తాజా పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ను దూరంగా ఉంచుతాయి.
ద్రాక్ష, బొప్పాయి, క్యాబేజ్… ఇలా ఆకుపచ్చ రంగులో ఉండే కాయలు, పండ్లను తీసుకోవడం సమతుల ఆహారానికి సూచన. ఈ తరహా సంపూర్ణ ఆహారం క్యాన్సర్ను నిరోధిస్తుంది.
యోగర్ట్, పెరుగు, మజ్జిగ మన జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. దానివల్ల జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మాంసంలో పీచు పదార్థం తక్కువగానూ,కొవ్వు శాతం ఎక్కువగానూ ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేయడంలో కొన్ని క్యాన్సర్ కారక రసాయనాలు కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి మాంసం వాడకాన్ని కాస్త తగ్గించుకుంటే మేలని నిపుణుల మాట.
ఉల్లి, అల్లం, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు… లాంటి పదార్థాలకు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. అలాంటివాటిని ఆహారంలో భాగంగా మార్చుకోవాలి. వీటితో పాటుగా ఎక్కువ నీరు, ఎత్తుకు తగిన బరువు కొనసాగించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ దరికి రాదు.