రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయనే భయంతో డయాబెటిస్ రోగులు పండ్లు తినడానికి సందేహిస్తారు. ఇది కొంతవరకే నిజం. పండ్లలోని ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, అత్యవసర పోషకాలు మన ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి చేసే మేలు అపారం! అయితే, పండ్లలో ఫ్రక్టోస్ అనే సహజమైన చక్కెర ఉంటుంది కాబట్టి, ఏ పండ్లు తింటే రక్తంలో చక్కెర పెరగదో, ఎంత మోతాదులో తినడం సురక్షితమో కూడా తెలుసుకుని ఉండాలి. ఈ విషయంలో డైటీషియన్ల సలహా తీసుకుంటే మంచిది. మధుమేహం ఉన్నవాళ్లు యాపిల్, జామ, నారింజ, పొప్పడి, కర్బూజ (మెలన్స్)… ఈ ఐదు రకాల పండ్లు నిరభ్యంతరంగా తినొచ్చు. వీటిలో కొవ్వు, కెలోరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. పైగా ఫోలేట్, విటమిన్-సి, పొటాషియం, డైటరీ ఫైబర్ లాంటి పోషకాలకు ఇవి నిలయాలు.
పొటాషియం శరీరంలో రక్తపోటు నియంత్రణలో సహకరిస్తుంది. ఇక విటమిన్ సి శరీరంలో కణజాలం పెరుగుదలకు, మరమ్మతుకు, గాయాలు మానడానికి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి హామీ ఇస్తుంది. నిమ్మజాతి పండ్లు, యాపిల్, కర్బూజ (మెలన్స్), పొప్పడి పండ్ల నుంచి విటమిన్-బి9లో ఉండే ఫోలేట్ లభిస్తుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
అయితే, పండ్లరసాల కంటే తాజా పండ్లే మంచివి. జూస్తో పోలిస్తే పండ్లలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఆహారం తేలికగా అరగడానికి అవసరమయ్యే డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మల విసర్జన సాఫీగా సాగుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండేలా చేస్తుంది. అంటే గుండె రోగాల ముప్పు తగ్గుతుంది. కాబట్టి, జ్యూస్ జోలికి పోకుండా పండ్లనే తినడం ఉత్తమం.
తినకూడని పండ్లు
డయాబెటిస్ రోగులు తినకూడని పండ్ల్లూ కొన్ని ఉన్నాయి. అవి… మామిడి, పనస, అరటి, చికూ, ద్రాక్ష. వీటిని తక్కువ పరిమాణంలో ఎప్పుడో ఒకసారి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.