కామారెడ్డి టౌన్, మార్చి 29 : కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అత్యధికంగా మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ఏ డిపోలో లేని విధంగా అధిక సంఖ్యలో సేవలు అందిస్తున్నారు. డిపోలో 139 బస్సులకు గాను 275 మంది కండక్టర్లు ఉన్నారు. ఇందులో 91 మంది మహిళా కండక్టర్లే.. వీరికి డే డ్యూటీ మాత్రమే అధికారులు కేటాయిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ప్రయాణికులకు సేవలు అందజేస్తున్నారు.
ఆదర్శంగా మహిళా కండక్టర్లు..
కామారెడ్డి డిపోలో మహిళా కండక్టర్లు విధులు నిర్వహించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తూ సత్తా చాటుతున్నారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు విధి నిర్వహణలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.
నాలుగు జిల్లాల కూడలిగా కామారెడ్డి..
కామారెడ్డి నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లా బస్సు రూట్లు ఉన్నాయి. ఈ రూట్లలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుతుంటారు. కామారెడ్డి డిపో పరిధిలో ఎక్కువగా పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. ఈ రూట్లలో మహిళా కండక్టర్లు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు.
మహిళల కోసం ప్రత్యేక వసతులు..
మహిళా కండక్టర్ల కోసం రెస్ట్ రూమ్ ఉంది. 91 మంది మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. డిపోలో పల్లెవెలుగు బస్సులు అధికంగా ఉన్నాయి. వీరికి డే డ్యూటీ మాత్రమే కేటాయిస్తున్నాం.
-ఆనంద్, మేనేజర్,కామారెడ్డి ఆర్టీసీ డిపో
ఇవీ కూడా చదవండి..
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!