డెహ్రాడూన్ : కాంగ్రెస్, అవినీతి రెండూ పర్యాయపదాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు నిలువెల్లా స్వార్ధంతో నిండిపోయారని మండిపడ్డారు. విపక్ష ప్రభుత్వాల హయాంలో చీకటి ఒప్పందాలతో అవినీతిని ప్రోత్సహించడం చూశామని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నేతల్లో అధికార దాహం అధికమని, వారు అధికారం కోసం రెండు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటలకు దిగుతారని అన్నారు. విపక్ష పార్టీలకు పరస్పర విశ్వాసం లేదని ధ్వజమెత్తారు. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన నేపధ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఉత్తరాఖండ్ మంత్రి హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని ఆయన కాషాయ పార్టీని వీడి త్వరలో హస్తం గూటికి చేరతారని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
తన నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆయన కేబినెట్ భేటీ నుంచి బయటకు రావడంతో అసంతృప్త నేత కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. హరక్ సింగ్ రావత్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో గర్వాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2017లో ఆయన బీజేపీలో చేరారు.