LPG Price Hike | వంటగ్యాస్ ధర (LPG Price Hike) పెంపుపై తెలంగాణవ్యాప్తంగా రెండోరోజు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రధాని మోదీ (Narendra Modi), బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. ‘బీజేపీ హటావో.. దేశ్కో బచావో’ అనే నినాదాలతో రాష్ట్రంలోని రహదారుల కూడళ్లు దద్దరిల్లాయి. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి విపరీతంగా వంటగ్యాస్ ధరలు పెంచి.. పూర్వం నాటి కట్టెల పొయ్యికి తీసుకెళ్తుండటాన్ని నిరసిస్తూ నడిరోడ్లపై వంటావార్పులు చేపట్టి.. తమ ఉసురు తగులుతుందంటూ ఆడబిడ్డలు శాపనార్థాలు పెట్టారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లలో 13 సార్లు గ్యాస్ ధరలు పెంచడంపై మండిపడ్డారు. ధరలు తగ్గించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం మహాధర్నా, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిరసన ప్రదేశంలోనే సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్ పోస్టు ఫ్లకార్డును చూపుతున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో వరంగల్ హైవేపై చేపట్టిన నిరసనలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్రావు, చిత్రంలో మంత్రి మల్లారెడ్డి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నమంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, కార్పొరేటర్లు తదితరులు
రంగారెడ్డి జిల్లా మీర్పేటలో నెత్తిపై కట్టెలు మోస్తూ నిరసన తెలుపుతున్న మంత్రి సబితారెడ్డి
యాదగిరిగుట్టలో గ్యాస్ సిలిండర్కు పూల దండ వేసి మొక్కుతున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ టౌన్లో గురువారం జరిగిన ఆందోళనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్గౌడ్