దానిమ్మ చెట్లకు పాలిథిన్ కవర్ల తొడుగు
మాస్కులా ఏర్పాటు చేసిన ఓరైతు
అంకిరావుపల్లిలో 8ఎకరాల్లో దానిమ్మ సాగు
ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలు
కొల్లాపూర్, జూన్13: మహమ్మారి కరోనా వైరస్ బారినుంచి ప్రాణ రక్షణ పొందుటకు ప్రజలు రక్షణగా మాస్కులను పెట్టుకున్నట్లే.. గాలులు, అకాల వర్షం నుంచి రక్షణ పొందేలా దానిమ్మ చెట్లకు, కాయలకు కవర్లు తొడిగి రక్షణ పొందుతున్నారు ఇద్దరు రైతులు. పాలిథిన్ కవర్లతో చేపట్టిన రక్షణ చర్యలతో రైతుల ఐడియా అదుర్స్ అంటున్నారు. అటుగా వెళ్లే వారందరినీ దానిమ్మతోటలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామానికి చెందిన రైతులు విద్యాసాగర్రెడ్డి, లక్ష్మారెడ్డి ఏడాదిన్నర కిందట 8ఎకరాల విస్తీర్ణంలో ఎకరానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి వెచ్చించి దానిమ్మ తోటలను సాగు చేశారు. వర్షాలకు, ఎండలకు పువ్వులు, పిందెలు, కాయలు రాలిపోవడం, కాయలకు నల్లమచ్చలు ఏర్పడంతో నష్టాలను చవిచూశారు. కాయలపై మచ్చలు ఏర్పడడం మూలంగా హైదరాబాద్, బెంగుళూర్ ఫ్రూట్స్ మార్కెట్లో దానిమ్మ పండ్లకు ధరలు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.
ఒక్క ఐడియా..
నష్టాలు రావడంతో తోటలను తొలగించాలన్న ఆలోచనకు రైతులు వచ్చారు. ఇంతలో విద్యాసాగర్రెడ్డి ఉన్నత విద్యావంతుడు కావడంతో యూట్యూబ్లో దానిమ్మ తోటల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సలహాలను గూర్చి ఓ ఉద్యానవన శాస్త్రవేత చేసిన సూచనలను అన్వయించారు. మహారాష్ట్రలో ఎక్కువగా దానిమ్మతోటలకు రక్షణగా బ్రోకవర్స్ వాడుతుండడంతో వేల రూపాయలు వెచ్చించి మహారాష్ట్ర నుంచి వాటిని తెప్పించారు. అయితే విద్యాసాగర్రెడ్డి తోటలో చెట్ల చుట్టూ బ్రోకవర్లు చుట్టగా..రైతు లక్ష్మారెడ్డి తోటలో చెట్లకు ఒక్కొక్క దానిమ్మ చెట్టుకు సుమారు 30వరకు పాలిథిన్ కవర్ మాస్కులను రక్షణ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు పిందె దశలో ఉండడంతో సదరు రైతులు పంట దిగుబడిపై ఆశతో ఉన్నారు.
యూట్యూబ్లో చూసిన..
రూ.8లక్షల పెట్టుబడితో ఎనిమిది ఎకరాల పొలంలో దానిమ్మతోటను సాగు చేసిన. కాయలపై మచ్చలు వచ్చి మార్కెట్లో డిమాండ్ పలుకలేదు. రూ.లక్ష మాత్రమే చేతికి వచ్చింది. దీంతో తోటలను తీసేయాలనుకున్న. యూట్యూబ్లో దానిమ్మ సాగుపై ఓ శాస్త్రవేత్త చేసిన సూచనలను ఫాలో అయ్యాను. మహారాష్ట్ర నుంచి ఇటీవలే బ్రోకవర్స్ తెప్పించి ప్రతి చెట్టుకు కట్టించిన. ఇప్పుడు తోటపై ఆశలుకలుగుతున్నాయి.
విద్యాసాగర్రెడ్డి, రైతు అంకిరావుపల్లి