కామారెడ్డి టౌన్, జూన్ 29: రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 4,778 కోట్లతో వార్షిక రుణప్రణాళికను రూపొందించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో మంగళ వారం జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ శరత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరానికి గాను రూ. 4,778 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో ప్రాధాన్యతా రంగాలకు రూ.4,373 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.3,776 కోట్లు కేటాయించగా, అందులో పంట రుణాలకు రూ.2,428 కోట్లు, వ్యవసాయ మౌలిక వసతులకు రూ.156 కోట్లు కేటాయించారు. దీర్ఘకాలిక రుణాల కింద రూ.534 కోట్లు కేటాయిస్తూ, అందులో అనుబంధ రంగాలకు రూ.198 కోట్లుగా నిర్ధారించారు. ఎంఎస్ఎంఈ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ.463 కోట్లు, విద్యారంగానికి రూ.32 కోట్లు, హౌసింగ్ రంగానికి రూ.95 కోట్ల కేటాయింపులు చేశారు.
వందశాతం టార్గెట్ పూర్తిచేయాలి: కలెక్టర్
సమావేశం అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు ప్రకటించిన వార్షిక రుణప్రణాళికను వందశాతం సాధించాలని సూచించారు. అన్నదాతకు మేలు చేయాలని, వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులకు సకాలంలో రుణాలను అందించి వారి ఆర్థిక తోడ్పాటుకు కృషిచేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు సమన్వయంతో జూలై నెలలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేయించడం, తిరిగి కొత్త రుణాలు అందించడంలో క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. రైతులు తీసుకున్న రుణాలను ఏడాదిలో తిరిగి చెల్లిస్తే 4 శాతం (పావలా) వడ్డీ మాత్రమే వర్తిసుందనే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జూలై 15 లోగా 50 శాతం పంట రుణాల రెన్యువల్ పూర్తిచేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభు త్వం రైతుల ఆర్థిక వికాసానికి వెన్నుదన్నుగా ఇస్తున్న రైతుబంధు పెట్టుబడి సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించి లబ్ధిదారులతో సమావేశమై రుణాలు, సబ్సిడీపై బ్యాంకు ప్రతినిధుల సహకారంతో అవగాహన కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు. గత సంవత్సరం 2020-21లో సాధించిన ప్రగతిని సమీక్షిస్తూ, పంట రుణాల కింద రూ.2,267 కోట్లకు గాను 1,525 కోట్ల రుణాలను అందజేసి 67 శాతం టార్గెట్ను మాత్రమే చేరుకున్నట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది వంద శాతం సాధించాలని బ్యాంకర్లు, అధికారులకు సూచించారు.
స్వయం సహాయక సంఘాల రుణాలకు సంబంధించి రూ. 466 కోట్లకు గాను రూ.478 కోట్ల చెల్లింపులతో 102 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. మెప్మా గ్రూపులకు సంబంధించి రూ.27.70 కోట్ల లక్ష్యానికి రూ. 28.20 కోట్లు సాధించడం అభినందనీయమని అన్నారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని 4,901 మంది వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతను అందించి దేశంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్రెడ్డి, నాబార్డు డీడీ నగేశ్, కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసరావు, ఎస్బీఐ ఏజీఎం పల్లంరాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వాణి, ఎన్డీసీసీబీ జనరల్ మేనేజర్ లింబాద్రి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, మెప్మా పీడీ శ్రీధర్రెడ్డి, ఏపీడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.