తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించి దానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు టాటా చెప్పి గవర్నమెంట్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా మెరుగుపడుతూ గత మూడేండ్లలో గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో చేరే వారి సంఖ్య కూడా తగ్గిందని వార్షిక విద్యా నివేదిక (అసర్-2021)లో వెల్లడైంది.
దేశ వ్యాప్తంగా 25 రాష్ర్టాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 5-16 ఏండ్ల మధ్య వయసున్న 75,234 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించగా అందులో పలు కీలక అంశా లు బయటకి వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నవారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉం డటం విశేషం. దీనివెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి చేపట్టిన అనేక పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. కుల, మత భేదా ల్లేకుండా అన్నివర్గాల వారికి, 18 ఏండ్లు పైబడిన పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో పెళ్లి కానుకగా రూ1,00,116 ఇస్తున్నది. దీని ద్వారా బాల్య వివాహాలు చాలావరకు తగ్గాయి. తల్లిదండ్రులు తమ సొంత గ్రామంలోనే వ్యవసాయం లేదా స్వయం ఉపాధి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా పిల్లల డ్రాపౌట్ల సంఖ్య చాలావరకు తగ్గింది. గత పాలకుల హయాం లో విద్యావ్యవస్థ దయనీయమైన స్థితిలో ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం బడులకు మెరుగులు దిద్ది రాష్ట్రంలో బాలబాలికలందరూ విద్య నభ్యసించే విధంగా సదుపాయాలు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం గురుకులాలు తీసుకువచ్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తున్నది. దీని ఫలితంగా విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెరిగింది. 2018లో 56.4 శాతం మంది విద్యార్థులు సర్కార్ బడులలో చేరగా, 2021లో 60 శాతం మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు.
శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. చిన్న పిల్లలకు శారీరక, మానసిక వికాసాన్ని కలిగించేలా అంగన్వాడీల ద్వారా నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నది. నేడు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ రాష్ర్టానికి పేరు తీసుకువస్తున్నారు. ప్రైవేటు ట్యూషన్లు చెప్పించుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నది. బీహార్లో 73.5 శాతం, ఒడిశాలో 66.2 శాతం విద్యార్థులు ట్యూషన్కు వెళ్తుండగా తెలంగాణలో 9.6 శాతం మంది విద్యార్థులే ట్యూషన్కు వెళ్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల కారణంగా పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. దేశవ్యాప్తంగా 67.7 శాతం మంది విద్యార్థులు స్మార్ట్ఫోన్లు కలిగి ఉండగా తెలంగాణలో జాతీయ సగటు కన్నా 12 శాతం అధికంగా 79.3 శాతం మంది విద్యార్థులు స్మార్ట్ఫోన్లు కలిగి ఉండ టం విశేషం. కరోనా జాగ్రత్తలు తీసుకోవటంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ముందువరుసలో ఉన్నది. 95.1 శాతం బడులలో శానిటైజేషన్ చేపట్టగా, 92.8 శాతం పాఠశాలల్లో నీటి వసతి, 91.7 శాతం స్కూళ్లలో హ్యాండ్వాష్ సబ్బులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది.
మిద్దె సురేష్
టీఆర్ఎస్వీ నాయకులు