తమిళనాడులో ఏ మాత్రం సందు దొరికినా కాలు మోపాలని బీజేపీ తెగ ఆరాటపడుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో అదేపనిగా చక్కర్లు కొడుతున్నారు. తమిళ తంబిలను దువ్వేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం అంశాన్ని కేంద్ర సర్కారు బయటకు తీయడం గమనార్హం. ఇచ్చంపల్లి ఎత్తు పెంచి తమిళనాడుకు నీళ్లను తరలించే లివర్ లింకు గురించి పార్లమెంటు ఎన్నికల పోరు ఊపందుకున్న సమయంలో నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) అనే కేంద్ర సంస్థ చేస్తున్న హడావుడిని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి అయినా తమిళనాడుకు నీళ్లు అందిస్తామనే ధోరణిలో ఆ సంస్థ మాట్లాడటం అనుమానాలకు తావిస్తున్నది.
గోదావరి-కావేరీ అనుసంధానానికి ఛత్తీస్గఢ్ వాడుకోకుండా వదిలేస్తున్న 148 టీఎంసీల నీటిని వాడుకుంటామని కేంద్రం అంటున్నది. గోదావరి నుంచి కృష్ణా బేసిన్లోని శ్రీశైలానికి, అటునుంచి తమిళనాడులోని కావేరీ బేసిన్కు నీళ్లను తరలించే ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నట్టు కేంద్రం సంకేతాలిస్తున్నది. దీనివల్ల అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చంపల్లి నిర్మాణం వల్ల బరాజ్ ఎగువన ఉండే తెలంగాణ ప్రాజెక్టులు ముంపునకు గురవుతాయి. దిగువన ఉండే ప్రాజెక్టులకు నీళ్లందవు.
అన్నిటికన్నా కీలకమైన అంశం మేడిగడ్డ బరాజ్ భవిష్యత్తు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వని కేంద్రం తెలంగాణకు కొత్తజీవం పోసిన మేడిగడ్డ బరాజ్ను పండబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నది. మేడిగడ్డ మరమ్మతులపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక రాకముందే.. అది నిరర్థకమైతే ఇచ్చంపల్లి డ్యాం ఎత్తు పెంచి ఇటు తెలంగాణకు, అటు తమిళనాడుకు నీళ్లు తరలిస్తామని కేంద్రం అనడం కచ్చితంగా పెద్ద కుట్రేనని చెప్పాలి. దీనివల్ల తెలంగాణకు ముంపు సమస్య తలెత్తడమే కాకుండా నీటి హక్కులూ ప్రమాదంలో పడతాయి. ఇది భావావేశాలతో కూడుకున్న అంశం. దీని వెనుకనున్న అసలు ఉద్దేశాలు ఏమిటో విడిగా చెప్పాల్సిన పనిలేదు.
తమిళనాడుకు నీటిని ఎలాగైనా తరలించుకుపోతామని హంగామా చేయడాన్ని ఎలా చూడాలి? జాతీయపార్టీలు రైల్వేల వంటి ప్రజాసేవా విభాగాలను స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్టులు, నదీజలాలు ఆ కోవలోకే వచ్చిచేరాయన్న మాట. నదుల అనుసంధానంలో పరీవాహక ప్రాంతాల అవసరాలు, హక్కుల పరిరక్షణ తప్పనిసరి. అంతర్జాతీయ సంప్రదాయాలూ ఇదే చెప్తున్నాయి. ప్రాజెక్టులు కట్టి ఉంటే వాటి మేరకు నీటి హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నదుల అనుసంధానం పేరు మీద ఇచ్చంపల్లిని ప్రతిపాదించి తెలంగాణ నీటి భరోసాను ప్రమాదంలో వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కండ్లల్లో వత్తులు వేసుకొని కాళేశ్వరం కట్టించిన కేసీఆర్ అధికారంలో లేకపోవడమే ఈ బరితెగింపునకు కారణమని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీ నేతగా కేసీఆర్ తపన వేరేగా ఉంటుంది. ఆ సోయి లేని ఢిల్లీపార్టీలకు అధికారం అప్పగిస్తే అంతిమంగా నష్టపోయేది మన రాష్ట్రం, మన ప్రజలే. ఇచ్చంపల్లి ప్రతిపాదనే ఇందుకు నిదర్శనం.