న్యూఢిల్లీ, ఆగస్టు 1: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన నెలకుగాను రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 15.4 శాతం అధికంగా. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలు కావడం ఇది రెండోసారి కావడం విశేషం. జూన్ నెలకుగాను రూ.1.95 లక్షల కోట్లు వసూలయ్యాయి. అమ్మకాలు, దిగుమతుల ద్వారా సమకూరే ఆదాయం, దేశీయ వినియోగం నిలకడగా ఉండటం వల్లనే జీఎస్టీ వసూళ్లలో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొంది. జూలై నెలలో వసూలైన జీఎస్టీలో దేశీయంగా రూ.1.44 లక్షల కోట్లు వసూలవగా, దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్నుతో రూ.66,511 కోట్ల నిధులు సమకూరాయి.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జీఎస్టీ వసూలయ్యాయి. జూలై నెలకుగాను రూ.5,819 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని సాధించింది. అలాగే రాష్ట్ర చరిత్రలో ఒకే నెలలో ఇంతటి స్థాయిలో వసూలవడం కూడా ఇదే తొలిసారి. హర్యాన తర్వాత అత్యధికంగా వసూలైనది ఇక్కడే. దీంతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో రెండంకెల వృద్ధి నమోదైంది.
దేశవ్యాప్తంగా ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవడాన్ని ప్రతిబింబిస్తున్నది. పలు రాష్ర్టాల పన్ను వసూళ్లు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం కూడా కలిసొచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి ప్రధాన తయారీ రాష్ర్టాల్లో వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
– ఎంఎస్ మణి, డెలాయిట్ ఇండియా పార్టనర్
జీఎస్టీ రాబడి వృద్ధిలో అధికభాగం దిగుమతుల ద్వారానే సమకూరుతున్నది. అయితే, ఈ దిగుమతులు తుది సరుకులా లేక ముడిసరుకులా అనే విషయంపై లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అలాగే, అధిక పరిమాణాల కన్నా కేవలం రూపాయి బలహీనపడట వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.
-అభిశేక్ జైన్, కేపీఎంజీ ఇండైరెక్ట్ ట్యాక్స్ హెడ్,