వాషింగ్టన్: భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు(Nuclear Warheads) ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. దీంట్లో అదనంగా కొత్త క్షిపణుల కోసం 30 వార్హెడ్స్ ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ డేటా, కమర్షియల్ శాటిలైట్ ఇమేజ్లు, ఓపెన్ సోర్స్ల ద్వారా ఆ అంచనా వేసినట్లు ఎఫ్ఏఎస్ వెల్లడించింది. భారత్ వద్ద ఉన్న అణ్వస్త్ర సామర్థ్యం, వ్యూహం ప్రకారం .. ఆ దేశం ఇప్పటికే 190 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉత్పత్తి చేసినట్లు అంచనా వేస్తున్నామని ఎఫ్ఏఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ తెలిపారు. ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ 2026 టైటిల్తో అణ్వస్త్రాలపై ఓ రిపోర్టును బుధవారం రిలీజ్ చేశారు.
ఆపరేషనల్ లాంచింగ్ కోసం భారత్ అమ్ములపొదిలో 160 న్యూక్లియర్ వార్హెడ్స్ ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాయని, కొత్తగా తయారీ అవుతున్న క్షిపణుల కోసం అదనంగా మరికొన్ని వార్హెడ్స్ ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. ఇండియా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని నిరాంతరాయంగా ఆధునీకరిస్తున్నట్లు ఆ ఆర్టికల్లో పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో కొత్తగా వెపన్ సిస్టమ్స్ వచ్చినట్లు తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్, ల్యాండ్ డెలివరీ, సీ బేస్డ్ సిస్టమ్స్కు తగిన రీతిలో అణ్వాయుధాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.