‘దోస్త్ మేరా దోస్త్ .. తూహీ మేరా ప్యార్..’ ఎగ్జిక్యూటివ్ చైర్లో కూర్చొని అదానీ చిద్విలాసంగా పాట పాడుతుండటం అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. అదానీ వ్యవహారాలపై హిడెన్బర్గ్ బయటపెట్టిన కుంభకోణం, అనంతర పరిణామాలపై బ్లూమ్బర్గ్ నివేదికపై పార్లమెంట్ అట్టుడుకుతున్నది. విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్, ఆప్ సభ్యులు నిలదీస్తుంటే, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే అదానీని కడిగేస్తున్నారు.
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటలు పడుతున్నాయి. అదానీ మాత్రం మోదీ ముఖ కవళికలు చూస్తూ పాట పాడుతున్నాడు. ‘ఇలాంటి పరిస్థితిలోనూ ఇలా ఎలా ఉండగలుగుతున్నారు సార్’ అని అడగాలని నోటివరకు వచ్చినా వాళ్లు అడిగే సాహసం చేయలేదు. ‘మిస్టర్ వర్మ ఇటు రండి’ అని పిలవగానే ఓ అధికారి ‘యస్ సార్’ అంటూ పరిగెత్తుకొచ్చాడు. ‘ఇలాంటి టైంలో డోక్లా తింటే భలే ఉంటుందయ్యా, అందరికీ తెప్పించు’ అని అదానీ ఆదేశించాడు. పార్లమెంట్లో అందరూ నిలదీయడం చూసి బాస్కు ఏమన్నా అయిందా ఏమిటీ అని మనసులోనే అనుమానపడుతూ ప్రశ్నార్థకంగా చూశాడు.
వర్మ మనసులోని సందేహాన్ని గ్రహించిన అదానీ, ‘చూడు వర్మ నువ్వు ఎక్కడ చదువుకున్నావ్? అమెరికాలో ఎంబీఏ చేశావ్ అంతే కదా? మరి నేను డిగ్రీ కాలేజీలో చేరి, మనకు చదువు వంటబట్టదని మూడు నెలలకే వెనక్కి వచ్చేశాను. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ల్లో చదివితే మీలా ఒకరి వద్ద ఉద్యోగం చేయాల్సి వచ్చేది. డిగ్రీ మధ్యలోనే.. కాదు, కాదు. మధ్యలోనే కాదు, ప్రారంభంలోనే ఆపేశాను కాబట్టి మీలాంటి వందల మందిని ఉద్యోగంలో తీసుకున్నాను. నాకేమన్నా అయిందా? అని అనుమానిస్తున్నావ్ కదా? ఏమీ కాలేదు, ఏమీ కాదు కూడా అంటూ మళ్ళీ ‘దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్’ అంటూ అదానీ పాటలో మునిగిపోయాడు. వర్మా డోక్లాతో పాటు, కచోరి, సమోసా పంపించు.. డోర్ బయట ఈడీ, సీబీఐ అధికారులు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. ‘వారిని లోపలికి పంపించు’ అని అదానీ చెప్పి, టీవీ చూడటంలో మునిగిపోయాడు.
జేఏసీ ఏర్పాటుచేసి కుంభకోణంపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా అరుస్తున్నారు. ఆప్ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. రాహుల్గాంధీ అదానీ వ్యవహారంలో మోదీపై నిప్పులు చెరిగారు, చెలరేగిపోయారు. పప్పు అనుకుంటే చెమటలు పట్టిస్తున్నాడని మల్లిఖార్జున ఖర్గే పక్కనున్న సభ్యుడితో ఏదో చెప్తున్నాడు. ఇంతలో ఓ అధికారి నుంచి ఓ కాగితం బీజేపీ సభ్యుడి చేతిలోకి వచ్చింది. ఆ సభ్యుడు పరిగెత్తుకుంటూ ఆ కాగితాన్ని మంత్రి చేతిలో పెట్టాడు. మంత్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ కాగితాన్ని ప్రధాన మంత్రి చేతిలో పెట్టాడు. సభలో ఇది చూస్తున్న వారు ఆ కాగితంలో ఏదో కీలక విషయం ఉన్నదనే నిర్ణయానికి వచ్చారు. అందరిలో ఒకటే టెన్షన్. ఏమై ఉంటుంది?
టర్కీలో భూకంపంతో 20 వేల మంది పోయారు , రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం సాగుతూనే ఉన్నది. చైనా, అమెరికా భూ భాగంలో గూఢచర్యం కోసం ఏవో బెలూన్లు వదిలారు. అలాంటివే ఇండియా భూ భాగం మీద కూడా వదిలారు. ఏదో ప్రళయం ముంచుకొచ్చేట్టు ఉన్నదని అంతా ప్రధాని వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రధాని మాట్లాడేందుకు లేవగానే ఏదో కీలక అంశమే అయి ఉంటుందని రాహుల్గాంధీ మాట్లాడటం ఆపేసి కూర్చున్నాడు. ప్రధాని మోదీ తన చేతిలోని కాగితాన్ని మరోసారి చదువుతుంటే బీఆర్ఎస్ ఎంపీలు అదానీపై తాము సంధించిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ లేవగానే సభలో గుండుసూది కిందపడ్డా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది.
మోదీ గొంతు సవరించుకొని అదానీ గురించి పది ప్రశ్నలడిగారు. మీకు చెమటలు పట్టేట్టుగా నేను ఒకే ప్రశ్న అడుగుతాను దమ్ముంటే సమాధానం చెప్పాలని, నాటకీయంగా కొద్దిసేపు మౌనంగా ఉండి.. రాహుల్ గాంధీ ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదు, దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రశ్న?అదానీ కుంభకోణానికి నెహ్రూ ఇంటి పేరుకు సంబంధం ఏమిటి?
అని అన్ని పార్టీల వారు విస్తుపోయారు. రాహుల్ నెహ్రూ అనే ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదు. అమిత్ షా నుంచి ఏవో సంకేతాలు వెలువడగానే బీజేపీ సభ్యులు లేసి ‘మోదీ… మోదీ’ అని అరవసాగారు. ‘మోదీ దేవుడన్నా’ అని సభలో ఎవరో తెలుగులో అన్నారు. అంతా బండివైపు చూశారు. ‘బక్వాస్ బంద్ కరో’ అని బీఆర్ఎస్ ఎంపీలు అరవసాగారు.
సభలో తతంగాన్ని చూస్తూ అదానీ పడి పడి నవ్వసాగాడు. డోక్లా, కచోరి తీసుకువచ్చిన వర్మకు ఇదంతా అర్థం కావడం లేదు. కచోరీలు చాలా బాగున్నాయని మర్యాదల్లో అదానీకి తిరుగులేదని ఈడీ, సీబీఐ అధికారులు అభినందించారు. వర్మ ముఖంలోని ప్రశ్నలను చదువుకున్న అదానీ చూడు వర్మ నిన్ను పంపి ఈడీ, సీబీఐ అధికారులకు కచోరీ తెప్పించడం కాదు, వాళ్లనే పంపి కచోరీ తెప్పించుకొనే కెపాసిటీ నాది. ఆంధ్రాలో ఓడరేవు మన చేతికి రావాలన్నా…
దేశంలోని విమానాశ్రయాలన్ని మన గుప్పిట్లోకి వచ్చాయంటే ఎలా అనుకున్నవ్? ముందు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయి. మనం అలా చూస్తూ ఉండాలి. దాడుల తర్వాత ఓడరేవులు, విమానాశ్రయాలు మన పెరట్లో పడిపోతాయి. ఇవన్నీ ఎలా సాధ్యమనుకుంటున్నావు? ‘దోస్త్ మేరా దోస్త్’ అని అదానీ నవ్వాడు.‘అర్థమైంది సార్ అదానీయే ఇండియా … ఇండియానే అదానీ అని’ వర్మ బదులిచ్చాడు. కాదు వర్మ… ఇంకా నీకు అర్థం కాలేదు. బయటివాళ్ల కోసం అదానీయే ఇండియా అని చెప్పాలి.
అసలు సంగతి అదానీయే మోదీ. మోదీనే అదానీ. కాబట్టే మనకు ఏదైనా సాధ్యమే. అంటే ‘బీజేపీ ఉన్నంతవరకు మీకు తిరుగు లేదు సార్’ అని వర్మ అన్నీ అర్థమైనట్టు మాట్లాడాడు. ‘కాదు మోదీ ఉన్నంత వరకు’ అని అదానీ గట్టిగా నవ్వాడు. ఎందుకంటే అదానీయే మోదీ.. మోదీనే అదానీ.
బుద్దా మురళి