జనాభాలో చైనాను అధిగమించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పటి వరకూ భారత్ను ప్రపంచం గుర్తించింది. ఇక మీదట, అత్యధిక జనాభా ఉన్న దేశంగా కూడా గుర్తించనుంది. మరో 30 ఏండ్లపాటు ఈ హోదా మన చెంతనే ఉంటుంది. ఎందుకంటే, రానున్న మూడు దశాబ్దాలపాటు భారత జనాభా పెరుగుతూనే ఉంటుందని, గరిష్ఠంగా 165 కోట్లకు చేరుకున్న తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని పలు అంచనాలు చెప్తున్నాయి. ప్రస్తుత భారత జనాభా 142 కోట్ల 80 లక్షలు. అసలు విశేషమేమిటంటే, దీంట్లో సగం మంది అంటే దాదాపు 72 కోట్ల మంది 30 ఏండ్ల లోపు వారు. ఇది అమెరికా జనాభాకు (34 కోట్లు) రెండింతలపైనే. ఇంతటి యువశక్తి ప్రపంచంలో మరో దేశం వద్దా లేదు.
యువత శక్తిసామర్థ్యాలను ఉత్పాదకత వైపు మళ్లిస్తే భారతదేశం పొరుగున ఉన్న చైనానే కాదు, అగ్రరాజ్యం అమెరికాను కూడా ఆర్థికంగా అధిగమించి ప్రపంచ సూపర్ పవర్ కాగలదు. ప్రస్తుతం మన దేశంలో ఏటా సగటున 1.2 కోట్ల మంది ఉద్యోగాల కోసం జాబ్ మార్కెట్లోకి కొత్తగా వస్తున్నారు. వీరికి తగిన పని కల్పించి, దేశ సంపదను పెంపొందించటంపై, ఆ సంపదను ప్రజలందరికీ పంచటంపై కేంద్రంలోని పాలకులు దృష్టి పెట్టటం తక్షణావసరం. వ్యవసాయం ఆధునీకరణ, పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని ఆర్థికవేత్తలు భారత్కు సూచిస్తున్నారు. ఇదే సమయంలో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నారు.
తగ్గుతున్న జన సంఖ్యతో, వృద్ధ జనాభాతో మునుపటంత వేగంగా పురోగమించలేని స్థితికి చైనా చేరుకుంటున్నది. చైనా 1980లలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత యువశక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని, ప్రపంచ తయారీ కేంద్రంగా వర్ధిల్లింది. ఎగుమతులపై ఆధారపడి అమెరికానే ఢీకొట్టే స్థాయికి చేరుకున్నది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్ వంటి ఇతర తూర్పు ఆసియా దేశాలు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. ఇప్పుడు భారత్కు ఆ అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఉత్పాదక రంగంలోకి మహిళలను తీసుకురావటం ద్వారా దీనిని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మన దేశ కార్మికశక్తిలో మహిళల వాటా 20 శాతమే. ఇది అఫ్ఘానిస్థాన్కన్నా కాస్త మెరుగు మాత్రమే. చైనాలో 44.8 శాతం వాటాతో మహిళలు, పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. ఆ దేశం సాధించిన ఆర్థిక ఘన విజయాలకు ఇదీ ఒక ముఖ్యమైన కారణం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అనే అనుకూలత కూడా భారత్కు కలిసి వచ్చే అంశం. మత రాజకీయాలతో మధ్యయుగాలకు వెళ్లాలా? అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని ప్రపంచానికి దిక్సూచిగా మారాలా? ఇదీ ఇప్పుడు భారత్ ముందు నిలిచిన ప్రశ్న.