ఎనిమిదేండ్లు ఎంత స్వల్పకాలం. ఒక వ్యక్తి జీవితంలోనే ఈ వ్యవధి ఎంతో చిన్నది. అటువంటిది ఒక రాష్ట్ర చరిత్రలో..! ఈ స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. మూడుదశలుగా ఈ ప్రస్థానాన్ని తీసుకోవచ్చు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు.. ఆ తర్వాత కొత్త రాష్ర్టాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటిచేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విధంగా తొలిదశ సవాలును ఎదుర్కొని నిలిచింది తెలంగాణ.
సాధించుకున్న తెలంగాణను సగర్వంగా తలెత్తుకునేలా చేయటం రెండో దశ. వలస పాలకుల ఆరు దశాబ్దాల పాలనలో సకల రంగాలూ కునారిల్లిన తెలంగాణను సంపూర్ణంగా పునర్నిర్మించే బృహత్తర కృషి ఈ ఎనిమిదేండ్లలో చోటు చేసుకుంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది. సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే, ప్రారంభించటానికి దశాబ్దాలు పట్టేది. కానీ, కేసీఆర్ సారథ్యంలో కాళేశ్వరం వంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేవలం మూడేండ్లలో పూర్తయ్యింది. రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీ, నిరంతర ఉచిత కరెంటుతో వ్యవసాయ విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువైంది. ధాన్యరాశులు పొంగిపొర్లాయి. దీనికితోడు, కులవృత్తులకు ప్రభుత్వం అండగా నిలబడటంతో గ్రామీణ ప్రాంతాలు సౌభాగ్యసీమలయ్యాయి. అద్భుతమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాల కల్పన కారణంగా పారిశ్రామిక రంగంలో యావత్ దేశమే ఆశ్చర్యపోయే ఘనతలను సాధించింది. విద్య, వైద్యం, సంక్షేమం, శాంతిభద్రతలు, ఆర్థికాభివృద్ధి.. ఏ రంగం తీసుకున్నా పసికూన తెలంగాణ దిగ్గజ రాష్ర్టాలను అధిగమించి అగ్రగామిగా నిలిచింది.
ఇక ప్రస్తుత దశ. తెలంగాణ మోడల్ను యావత్ దేశానికి విస్తరింపజేసే దశ ఇది. రైతుబంధు, మిషన్ భగీరథ వంటి మన పథకాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వేరే పేర్లతో అమలు చేస్తున్నది. తెలంగాణ పథకాలు ఎన్నో రాష్ర్టాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇంతటితో సరిపోదు. నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు మన దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ-షా పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసధోరణులను విడిచిపెట్టి నవ్యమార్గాన అభివృద్ధి చెందటం తక్షణ అవసరం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూపకల్పన చేస్తున్నారు. ఎనిమిదేండ్ల వయసున్న తెలంగాణ.. దేశాన్ని నిలబెడితే అంతకన్నా గర్వకారణం ఏముంటుంది!