వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లుంది బీజేపీ నాయకుల తీరు. తెలంగాణపై వీళ్లకు ప్రేమ లేదు. కానీ ఇక్కడ సీట్లు కావాలి. ఇక్కడి ప్రజల సమస్యలేమీ వారికి పట్టవు. కానీ అధికారం ఇవ్వమని ప్రజలను కోరతారు. తాము అధికారంలో ఉన్న యూపీలో భూగర్భ జలాల క్యాన్సర్ బాధితుల సమస్యను తీర్చరు కానీ మునుగోడు ప్రజలపై కల్లబొల్లి హామీలు గుప్పిస్తుంటారు. ప్రజలు తమను నమ్మడం లేదన్న విషయం బీజేపీ నాయకులు తెలుసుకోవాలి.
తెలంగాణ విషయంలో మోదీ సర్కారుది మొదటి నుంచీ వ్యతిరేక భావనే. తల్లిని చంపి పిల్లను బతికించారంటూ ఏపీ పునర్విభజనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పి బీజేపీ నేతలు మాట తప్పారు. ఇలాంటి బీజేపీని సోయి కలిగిన తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు? వీళ్లు తెలంగాణకు పచ్చి వ్యతిరేకులని, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం పైసా ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరని తేట తెల్లమైంది.
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై యుద్ధం చేస్తామని అప్పుడెప్పుడో నడ్డా గట్టి హామీనిచ్చారు. ఆ హామీ అమలు కాకపోవడంతో ప్రజలు ఇటీవల నడ్డా ఫ్లెక్సీకి సమాధి కట్టారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్లో ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 8.2 ఎకరాలు కేటాయించి తమ చిత్త శుద్ధిని చాటితే కేంద్రం మాత్రం తన హామీని నెరవేర్చలేదు. ఈ సెంటర్కు కేటాయించిన నిధులను గుజరాత్కు తరలించారా అని ప్రజలకు అనుమానం వస్తున్నది. ఫ్లోరైడ్ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రిని నెలకొల్పుతామన్న హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదు. మరిప్పుడు బీజేపీ నాయకులు ఏ ముుఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ముునుగోడు ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ పాటికే కమలం రెక్కలు సగం కమిలిపోయాయి. తమ బల నిరూపణ కోసం మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ నాయకుల కుయుక్తులను తెలంగాణ సమాజం మురీ ముఖ్యంగా మునుగోడు ప్రజలు సరిగానే అర్థం చేసుకున్నారు. వీళ్ల కొంగ జపాలను పసిగట్టి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
మిషన్ భగీరథ నీళ్ళ పుణ్యమా అని ఈ తరం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని మునుగోడులోని ఓ తల్లి నాకు చెప్పింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 మండలాలు ఫ్లోరైడ్ బారిన పడ్డాయి. కానీ ఈ ఎనిమిదేండ్లలో ఫ్లోరైడ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఫ్లోరైడ్ వల్ల దివ్యాంగులైన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.3016 పింఛను అందిస్తున్నది. ఫ్లోరైడ్ పోరు యాత్రలో భాగంగా కేసీఆర్ 2003లో మర్రిగూడ సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికీ నల్లాతో రక్షిత మంచి నీరు సరఫరా చేస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక 9 జూన్ 2015న చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ నిర్మాణానికి కేసీఆర్ పునాది వేశారు. 2017 చివర్లో ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు సరఫరా చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. డిండి ఎత్తిపోతల పథకంలో పలు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. గొట్టి ముక్కల రిజర్వాయర్ పనులు 80 శాతం, శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల నిర్మాణం 40 శాతం పూర్తి చేసింది. ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే ఉమ్మడి జిల్లాలో భూగర్భ జల మట్టం పెరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బట్లపల్లిలో రూ.440 కోట్ల ఖర్చుతో 90 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి ప్లాంటును నిర్మించింది. అక్కడి నుంచి నాంపల్లి, చండూరు, మునుగోడు మండలాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి వల్ల ఇప్పుడు ఎవరూ ఫ్లోరైడ్తో బాధ పడటం లేదు. కార్యదక్షత ఉంటే ఎలాంటి సమస్యతోనైనా యుద్ధం చేసి గెలవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది.
బుడి బుడి అడుగులు వేసే బడి పిల్లాడు మొదలుకొని ఊత కర్ర ముసలవ్వ వరకు తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ నాయకులు తెలంగాణ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో తెలిసిపోయింది. బీజేపీ మాటలు మాత్రమే చెబుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది చేసి చూపిస్తున్నదని తెలుసుకున్నారు. తెలంగాణకు కేంద్రం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులూ ఇవ్వడం లేదని గ్రహించారు. బీజేపీ నాయకులవి భావోద్వేగాల నాటకాలు తప్ప తమ జీవితాలను మార్చే శక్తి వారికి లేదని తెలుసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం… ఎందు కోసమని ఇప్పుడు బీజేపీ నాయకులను వారు ప్రశ్నిస్తున్నారు.
– అస్కాని మారుతీ సాగర్
90107 56666
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్)