నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను పొలిమేర అవతలికి పారదోలుతామంటూ ‘జై తెలంగాణ’ అని నినదిస్తున్నరు. వివక్ష నాడు ఆంధ్రా రూపంలో వస్తే .. నేడు కేంద్రం రూపంలో వస్తున్నది. వివక్ష ఏ రూపంలో ఉన్నా తిప్పికొట్టడమే తెలంగాణ ప్రజల లక్ష్యం. అందుకే ‘ఈంట్ కా జవాబ్ పత్తర్ సే’ అంటున్నది తెలంగాణ సమాజం.
ధ్ర పాలకుడు పోయిండు, కేంద్రపోడు వచ్చిండు గంతే.. తెలంగాణపై వివక్ష అలాగే కొనసాగుతున్నది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు కాకముందే మల్లో అలజడి మొదలైంది బీజేపీ రూపంలో. వివక్ష నుంచి, విచ్ఛిన్నకర శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకున్నం.. కుట్ర బాజీల నుంచి తెలంగాణ జాతిని రక్షించుకున్నం.. స్వయం పాలనను చేతబట్టి అభివృద్ధిపథాన స్వరాష్ట్రమై ముందడుగు వేస్తున్నాం. కానీ నాటి వివక్ష తడి ఆరకముందే మరో విద్వేషపు కమురు వాసన తెలంగాణ నేలన పొగసూరుతున్నది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చురేపి అలజడి సృష్టించి ఆగం చేయాలని చూస్తున్నది.
ఈ కుట్రలను తిప్పి కొట్టేందుకు యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగున్నది. ఆకలినైనా భరిస్తం గానీ, ఆత్మగౌరవాన్ని వదులుకోం. తెలంగాణ ఏకాత్మ వొకటి హృదయాల్లో రింగన బురుగై తిరుగుతూ చైతన్యాన్ని మేలుకొల్పుతున్నది. అణచివేతను ఏనాడూ సహించని తెలంగాణ సమాజం తన త్యాగాల పునాదులను తిరిగి పెకిలించుకొని వస్తున్నది. అవహేళనను దహించేందుకు నిప్పురవ్వలను తిరిగి రాజేస్తున్నది. గంగా జమునీ తహ్జీబ్ను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టేందుకు తెలంగాణ సమాజం మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమైంది. ఎనిమిదేండ్లుగా స్వయంపాలన చల్లని నీడన సేదతీరుతున్న తెలంగాణ మరోసారి ఉలిక్కిపడుతున్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఐతదా మీతోని అనే అవహేళనలనూ బద్దలుకొట్టి, దేశానికి ఆదర్శమై తెలంగాణ పురోగమిస్తున్న శుభ సందర్భంలో.. మరో విషపు గాలి తెలంగాణను కాషాయ కేంద్రమై కమ్ముకుంటున్నది. ఈ సమయంలో తెలంగాణను విచ్ఛిన్నం చేసే ఏ కుట్రనైనా ససేమిరా సహించబోమని నాటి ఉద్యమ స్ఫూర్తి తిరిగి రాజుకుంటున్నది. ‘ఏడికైతే గాడికాయే..’ అని నాటి ఉద్యమ తెగువను తిరిగి ఎక్కడికక్కడ ప్రోది చేసుకుంటున్నది. సాధు గోవు కూడా ఆత్మరక్షణ కోసం పులిగా మారి చీల్చి చెండాడేందుకు సిద్ధమవుతున్నది.
ఎక్కడికక్కడ జర్నలిస్టులు, తెలంగాణవాదులు గళం విప్పడం ఇప్పుడిప్పుడే మొదలైంది. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో వేలు పెడుతూ, తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థనే చులకన చేస్తూ, గాయాల నుంచి కోలుకుంటున్న తెలంగాణ హృదయాలను మెలిపెడుతూ కేంద్ర మంత్రుల పేరుతో, పరాయి ముఖ్యమంత్రుల ముసుగులో, ప్రతిపక్షం పేరుతో, గవర్నర్ సాకుతో తెలంగాణలో అలజడి రేపేందుకు కాషాయ దళం కుట్రలు చేస్తున్నది. కేంద్ర పాలకుల ఏజెంట్లను తరిమికొట్టేందుకు తెలంగాణ మరో పోరాటానికి సిద్ధమైంది. ఏజెంట్ కుతంత్రాలను రాజభవన్ సాక్షిగా నిన్న ఒక తెలంగాణ జర్నలిస్టు నిలదీసి చరిత్ర పునరావృతానికి శంఖారావం ఊదిండు. అది జరిగి 24 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి ముసుగులో ఓ పరాయి రాష్ట్ర విచ్ఛిన్నకర శక్తి కుట్రలను నిలువరించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు తెలంగాణ బిడ్డ, విఘ్నాలను తొలగించే వినాయకుని సాక్షిగా. ఖబడ్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఇక నుంచి… ‘ఈంట్కా జవాబ్ పత్తర్ సే మిలేగా’.. ఇది తెలంగాణ చరిత్ర నిరూపించిన సత్యం.
– సహస్ర