ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు. ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం రూపొందించబడింది. కానీ సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులను సింగరేణి క్వార్టర్ ఖాళీ చేస్తేనే గ్రాట్యుటీ చెల్లిస్తామని తిరకాసు పెడుతున్నది. అద్దె ప్రాతిపదికన ఇతరులకు క్వార్టర్లను కేటాయిస్తున్న యాజమాన్యం రిటైర్డ్ కార్మికులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నది.
కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రతకోసం రూపొందించబడిందే సామాజిక భద్రత చట్టం. ఇది 1972 ఆగస్ట్ 21న పార్లమెంటులో ఆమోదించబడి సెప్టెంబర్ 16 నుండి గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972గా అమలవుతున్నది. మరల సవరించబడి రూ.10 లక్షల చెల్లింపు పరిమితి నుంచి రూ.20 లక్షల చెల్లింపు పరిమితితో 2018 మార్చి 29 నుంచి అమలవుతున్నది. కార్మికులు గ్రాట్యుటీని పొందాలంటే కనీస సర్వీస్ 5 సంవత్సరాలుండాలి. 5వ ఏడాది సర్వీస్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారు కూడా అర్హులవుతారు. ఉద్యోగ విరమణ సమయంలో పొందిన వేతనాన్ని 30 సంవత్సరాల సర్వీస్ వరకు ఏడాదికి సగం నెల వేతనాన్ని, 30 సంవత్సరాల తర్వాత చేసిన సర్వీస్కు సంవత్సరానికి నెల వేతనాన్ని లెక్కించి గ్రాట్యుటీగా రూ.20 లక్షల పరిమితికి లోబడి చెల్లిస్తారు. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972, సెక్షన్ 7 ప్రకారం యాజమాన్యం గ్రాట్యుటీని చెల్లించడానికి కార్మికుడి నుంచి దరఖాస్తును తీసుకోవాలి. అలాగే గ్రాట్యుటీని లెక్కించి ఉద్యోగికి, నియంత్రణ అధికారికి నోటీస్ ఇచ్చి 30 రోజుల్లోపు చెల్లించాలి.
నిర్ణీత పరిమితి లోపు చెల్లించడంలో విఫలమైతే సాధారణ వడ్డీని చెల్లించాలి. సెక్షన్ 13 ప్రకారం ఉద్యోగికి చెల్లింపచేసే గ్రాట్యుటీ నుంచి ఎటువంటి మినహాయింపులకు సంబంధించిన కోర్టు ఆర్డర్స్ గానీ, డిక్రీని గానీ అటాచ్ చేయరాదు. మధ్యప్రదేశ్ హైకోర్టు 2018లో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మేనేజర్ ప్రయాగ్ మోదీ కేసులో గ్రాట్యుటీ చెల్లింపును ఇష్టానుసారంగా నిలిపి వేసే అనియంత్రిత అధికారం యాజమాన్యానికి లేదని తీర్పు చెప్పింది. 1996లో ట్రావెన్ కోర్ ైప్లెవుడ్ ఇండస్ట్రీస్ వర్సెస్ రీజనల్ జాయింట్ లేబర్ కమిషనర్ ఆఫ్ కేరళ కేసులో యజమాని భూమిని ఉద్యోగి వదిలిపెట్టనందున గ్రాట్యుటీ చెల్లింపును నిలిపివేయరాదని సూచించారు. సెక్షన్ 4(6) ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపును తిరస్కరించడానికి ఉద్యోగి నివాస కార్పొరేట్ ఆస్తికి ముడిపెట్టడం తగిన కారణం కాదని చెప్పింది.
కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లకు సంబంధించిన ‘జాయింట్ బైపార్టీయేట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ’(జేబీసీసీఐ)కూడా గ్రాట్యుటీ చెల్లింపుచట్టం 1972 ప్రకారంగా రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యుటీని చెల్లించాలని ఒప్పందం చేశాయి. క్వార్టర్ ఖాళీకి గ్రాట్యుటీ చెల్లింపునకు ముడిపెట్టరాదని సూచించింది. నెంబర్. సీఐఎల్/సి–5బి/జేబీసీసీఐ/09 తేది 16/01/2019 సర్క్యులర్ ను కూడా జారీ చేసింది.
సింగరేణి యాజమాన్యం కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడానికి తాజాగా సర్క్యులర్ను జారీ చేసింది. నెంబర్.సీఆర్పీ/పిఇఆర్/డబ్ల్యూ ఇఎల్/2023/3197 తేది 09/8/2023 గల నిబంధనలను డైరెక్టర్ పర్సనల్, అడ్మినిస్ట్రేట్ అండ్ వెల్ఫేర్ పేరుతో ఆదేశించింది. 30 నుంచి 35 ఏండ్లు కష్టించి పనిచేసి రిటైర్ అయిన కార్మికులను కనీసం 6 నెలలు కూడా సంస్థ క్వార్టర్లలో నివాసం ఉండనీయడం లేదు. ఒక వేళ నివాసం ఉండదలిస్తే అనుమతి తీసుకుని నెలకు రూ.5 వేల కిరాయిని చెల్లించాలని షరతులు పెట్టింది. సరే! కిరాయి చెల్లింపునకు కార్మికులెవరూ వ్యతిరేకం కాదు. 6 నెలలు కాదు ఏడా ది అద్దెనైన అడ్వాన్స్గా చెల్లించడానికి రిటైర్డ్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కానీ సింగరేణి యాజమాన్యం చేస్తున్నదేమిటి? రిటైర్డ్ అయిన కార్మికులకు చట్టం ప్రకారం రూ.20 లక్షల పరిమితితో కూడిన గ్రాట్యుటీని చెల్లించకుండా దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నది. రిటైర్డ్ డబ్బులతో ఇల్లు నిర్మించుకునే కలలకు కళ్ళెం వేస్తున్నది. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ లోన్ సౌకర్యం ఉన్న ది. కానీ సింగరేణి కార్మికులకు గుంట భూమి, సరళంగా హౌస్లోన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో సింగరేణి కార్మికులు రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులతో ఇండ్లు నిర్మించుకోవడం పరిపాటి.
సింగరేణి జనరల్ మేనేజర్(సివిల్) సీ.హెచ్.రమేశ్బాబు చెప్పిన లెక్కల ప్రకారంగా సింగరేణి వ్యాప్తంగా 49,000 నివాస క్వార్టర్లు ఉన్నాయి. జైపూర్, సత్తుపల్లి, భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన 1,478 క్వార్టర్లు అదనం. కానీ కార్మికులు 42,733 మంది మా త్రమే ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా అద్దె చెల్లింపు, లీజ్ ప్రతిపాదికన వివిధ రంగాల ఉద్యోగులకు దాదాపు 3 వేల క్వార్టర్లను సింగరేణి కేటాయించింది. అయినప్పటికీ కూడా ఇంకా వేల క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి. రిటైర్డ్ కార్మికులకు కూడా అద్దె చెల్లింపు ప్రాతిపదికన క్వార్టర్లను కేటాయించే అవకాశం ఉన్నది. కానీ అధికారులు ఇతరులకు అద్దెకు ఇస్తున్నారే, కానీ రిటైర్డ్ కార్మికులకు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
సింగరేణి కార్మికులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో 44 రోజులు సమ్మె చేసి రాష్ట్ర ఏర్పాటులో పాలుపంచుకున్నారు. దానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్ని వేళల్లో సింగరేణి కార్మికులకు అండగా ఉం టానని భరోసా ఇచ్చారు. ప్రస్తుత రిటైర్డ్ కార్మికుల విషయంలోనూ జోక్యం చేసుకొని యాజమాన్యం సాగిస్తున్న సాచివేత చర్యలను నిలువరింపజేయాలని కోరుకుంటున్నారు. సింగరేణి క్వార్టర్లను ఇతరులకు కేటాయించినట్లుగానే రిటైర్డ్ కార్మికులకు కూడా కేటాయించాలని కోరుకుంటున్నారు.