CM KCR | భారతదేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం దశాబ్దాల తరబడి అనేక సవాళ్లతో పోరాడుతున్నది. తక్కువ పంట దిగుబడి, వాతావరణ మార్పులు, సరిపోని మౌలిక సదుపాయాలు ఈ రంగాన్ని పీడిస్తున్నాయి. ఫలితంగా రైతు కష్టాలు తద్వారా దేశ ఆర్థికవృద్ధికి ఆటంకమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అవలంబించిన రైతు సంక్షేమ, సాంకేతిక విధానాలు రైతులకు భరోసా ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాయి. తద్వారా తెలంగాణ రాష్ట్రం అతిపిన్న వయస్సులో దేశానికే ఆదర్శంగా నిలిచింది.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో రైతుల సాధికారత కోసం కేసీఆర్ వ్యవసాయరంగంలో రైతుల కోసం తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో అనేక రైతు అనుకూల విధానాలను అమలుచేశారు. వ్యవసాయరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కూడిన కార్యక్రమాలు తెలంగాణ గ్రామీణ స్థితిగతులను మార్చుతూ వ్యవసాయంరంగంలో ఉద్యోగ, ఉపాధి ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ఆర్థికంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు మార్చడానికి దోహదపడింది. తెలంగాణలో కేసీఆర్ అమలుచేసిన వ్యవసాయ రైతు విధానాలు దేశం మొత్తం అమలుచేస్తే అతి తక్కువ సమయంలో దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి పథంలో పయనించగలుగుతుంది.
రైతుబంధు పథకం రైతులకు పెట్టుబడి సాయం అందించే విప్లవాత్మక కార్యక్రమం. ప్రపంచంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదు. ఈ పథకం కింద విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను భరించడానికి రైతులకు ప్రభుత్వం ఆర్థికసహాయం అందిస్తుంది. ఈ పథకం పంట ఉత్పత్తిని పెంచడమే కాదు, పంట పనితీరుతో సంబంధం లేకుండా రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందేలా చేస్తున్నది. రైతుబంధు పథకం రైతుల కష్టాలను, అప్పులభారాన్ని తగ్గించి, చివరికి రైతులు ఆర్థికవ్యవస్థకు సహకారాన్నందించేలా చేస్తున్నది.
కేసీఆర్ గొప్ప ఆలోచనల్లోంచి పుట్టిన మరో బృహత్తర పథకం రైతు బీమా. రైతుకు అకాల మరణం సంభవించినప్పుడు ఆయన కుటుంబానికి ఆర్థికభద్రతను కలిగించే రైతు బీమా కార్యక్రమం రైతుకు భరోసాను కల్పించింది. ఈ పథకం కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పథకంతో ఉచిత బీమా రైతులకు ఎనలేని భరోసాను కల్పించింది. రైతుకు, రైతు కుటుంబానికి అనుకోని పరిస్థితులు ఎదురైతే పెద్దదిక్కు అయి నిలబడింది. కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడింది. రైతులు ఆర్థికంగా పురోగమించడానికి భరోసానిస్తున్న ఒక మహత్తర పథకం ఈ రైతు బీమా. ఈ పథకం రైతుల పేదరికాన్ని తగ్గించడానికి, వ్యవసాయాన్ని మరింత స్థిరమైన, లాభదాయకమైన వృత్తిగా మార్చడానికి ఒక భరోసా కల్పిస్తున్నది.
దేశంలో వ్యవసాయ ఉత్పాదకతకు ఒక ప్రధాన అడ్డంకి అని నమ్మదగినది నీటిపారుదల సౌకర్యాల కొరత. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తించి సమగ్ర నీటిపారుదల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే మిషన్కు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం.
కేంద్రం రూపాయి ఇయ్యకున్నా 73 లక్షల ఎకరాలకు పైగా భూమికి నీటిని అందించి, బీడు భూములను సారవంతమైన సాగుభూములుగా మార్చగలిగారంటే ఆయనకు ఎంతటి దూరదృష్టి ఉన్నదో తెలుసుకోవాలి. నీటి లభ్యతతో, నమ్మకమైన నీటి పంపిణీ వ్యవస్థతో రైతులు ధైర్యంగా పండించాలనుకున్న పంటలు పండిస్తున్నారు. దిగుబడిని పెంచుకుంటున్నారు. రైతుల ఆర్థికవృద్ధికి నీటి పారుదల మౌలిక సదుపాయాలపై కేసీఆర్ పెట్టుబడులు గణనీయంగా దోహదపడ్డాయి. తద్వారా వ్యవసాయ దిగుబడులు పెరిగి రాష్ట్ర, దేశ ఆర్థికానికి ఆసరాగా నిలిచారు రైతన్నలు.
కేసీఆర్ పంటల వైవిధ్య ప్రతిపాదకుడు, రైతులు వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలను దాటి కాష్ క్రాప్స్, ఉద్యాన పంటలు, పూల పెంపకం వంటి అధిక విలువైన పంటల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. వైవిధ్య పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, నష్టాలను తగ్గించడం, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం లాంటి లక్ష్యాలను తెలంగాణ వ్యవసాయరంగం సాధించగలిగింది. వైవిధ్యభరితమైన వ్యవసాయం దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతి ఆధారిత వ్యవసాయ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా భారత ఆర్థికవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో, రైతులను నేరుగా మార్కెట్లతో అనుసంధానం చేయడం, రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందేలా చూడటం వంటి కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఇది రైతులకు ఆదాయాన్ని అందించడమే కాకుండా, వ్యవసాయ మార్కెట్ మొత్తం సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇలాంటి మార్కెట్-అనుబంధ కార్యక్రమాలు గ్రామీణ ఆదాయాలను పెంచుతున్నాయి, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నాయి. వ్యవసాయ దిగుబడులు పెంచడం ద్వారా ఆర్థికవ్యవస్థను బలపరుస్తాయి.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులను ఉపయోగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడం ద్వారా, సుస్థిరతకు మద్దతునివ్వడమే కాకుండా దేశీయ విజ్ఞానాన్ని సంరక్షిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రపంచ ధోరణులకు అనుగుణంగా ఉంటుంది. ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకొని భారతదేశ ఆర్థికవృద్ధికి దోహదమవుతుంది.
కేసీఆర్ రైతు అనుకూల విధానాలు తెలంగాణ రైతులను ఏ విధంగానైతే ధనికులను చేస్తూ రాష్ట్ర ఆర్థికానికి సింహభాగంగా రూపాంతరం చెందుతున్నదో భారత ఆర్థికవ్యవస్థకు వ్యవసాయం దోహదపడే అవకాశాలున్నాయి. జనాభాలో గణనీయమైన భాగానికి జీవనోపాధిని కల్పిస్తున్న వ్యవసాయం భారతదేశంలో అతిపెద్ద కర్మాగారం. ఎప్పుడైతే ఉపాధి పెరుగుతుందో ఆదాయంతో పాటు ప్రజల ఖర్చు సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా దేశ స్థూల దేశీయోత్పత్తికి వ్యవసాయం దోహదం చేస్తుంది. అంతేకాదు ఆహారభద్రత, ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, అగ్రిబిజినెస్ రంగంలో వ్యవసాయ అవకాశాలను అందిస్తుంది. ఈ రంగాలు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తాయి. గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేసుకుంటూ దేశ ఆర్థికవ్యవస్థకు దోహదం చేస్తాయి. కేసీఆర్ సృష్టించి ఆచరించిన రైతు సంక్షేమ, అభివృద్ధి విధానాలను దేశం మొత్తం గనక అమలుచేస్తే అతి తక్కువ సమయంలో దేశం ఆహార సూచీలో ఎగబాకి గ్రామీణ, పట్టణ ఆర్థికాలను బలపరుస్తూ దేశ ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ పరిశ్రమలను స్థాపిస్తూ తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరపరుస్తుంది.