రైతుల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. అకాల వర్షాలతో, వడగండ్లతో పంటలు దెబ్బతిని ఆవేదనలో ఉన్న అన్నదాతలను స్వయంగా ఓదార్చటానికి వెళ్లిన కేసీఆర్.. ఒక్కో ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని ప్రకటించటం అన్నదాతల పట్ల ఆయనకున్న నిబద్ధతకు మరో నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రకటనతో లక్షలాది మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు ఊరట లభించింది. ఎన్నో ఆటంకాలు, సమస్యల మధ్య తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని ఒక దారికి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాజెక్టులు కడుతుంటే కేసులు, దుష్ప్రచారాలు, కేంద్రం నుంచి అనుమతుల విషయంలో, రుణాల మంజూరు విషయంలో కొర్రీలు.. ఇటువంటి కడగండ్లను ఎన్నింటినో దాటుకొని సాగును పటిష్ఠపరిచింది ప్రభుత్వం. దండుగనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దింది. రైతులకు ఇంతటి ప్రాధాన్యం ఇస్తున్నది కాబట్టే, నేడు వారు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి ఆసరాగా నిలిచారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ముఖ్యమంత్రి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వాలు, పార్టీలు రాజకీయాలకతీతంగా వ్యవహరించటం సర్వసాధారణం. కానీ, మోదీ హయాంలో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను కూడా రాజకీయ కోణంలో చూడటం అనే విపరీతం చోటుచేసుకున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు విపత్తులను ఎదుర్కొంటున్నప్పుడు కూడా చేయూతనివ్వటానికి కేంద్రానికి మనసు రావటం లేదు. గతంలో హైదరాబాద్ వరదల సమయంలో చూశాం. భారీవర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటలు మునిగిపోయినప్పుడు చూశాం. రాష్ట్రం నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని నివేదికలు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. కాబట్టే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కేంద్రానికి ఎటువంటి అర్జీలు పంపబోమని, వారికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రైతులను ఆదుకుంటామని, తగిన సహాయక చర్యలు చేపడుతామని ప్రకటించి, కేంద్రం నిర్వాకంపై తనదైన నిరసన ప్రకటించారు.
ప్రకృతి విపత్తులు మానవ నియంత్రణలో ఉండవు. ఇప్పుడున్న శాస్త్రసాంకేతిక విజ్ఞానం స్థాయి మేరకు విపత్తులను ఒక మేరకు ముందస్తుగానే అంచనా వేయటం, నష్టాలను గణనీయంగా తగ్గించుకోవడమే మన ముందున్న మార్గం. రాళ్లవాన రూపంలో ఊహించని సమస్య ఎదురైన ఈ తరుణంలో రైతన్నలు ధైర్యంగా ఉండాలి. రాష్ట్రప్రభుత్వం వారి వెన్నంటే ఉందన్న భరోసాను కలిగి ఉండాలి. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, నీటి తీరువాలు లేకుండా కాల్వల నుంచి సాగునీరు, రైతువేదికల ద్వారా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతును రాజును చేసింది. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం పదుల ఎకరాలున్న ఆసాములు సైతం అరిగోసలు పడ్డారు. నేడు ఒకట్రెండు ఎకరాల రైతులు కూడా పెరిగిన భూమి విలువతో, పంట ఉత్పత్తులతో ధీమాగా ఉన్నారు. ఈ మార్పు ఇప్పుడు యావత్ దేశానికీ కావాలి. ఢిల్లీలో ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ చారిత్రక అవసరం.