‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా బాలికల విద్యాలయాలను నిర్వహిస్తున్నది. వాటిల్లో అన్నీ సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నది. అక్కడ చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో డాక్టర్లుగా ఇంజినీర్లుగా చేరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించారు. బడీడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులను ఒప్పించి, సర్కార్ బడిలో చేర్పించడం, నాణ్యమైన విద్య అందించడం డ్రాపౌట్లను తగ్గించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ బడుల ప్రత్యేకతను వివరిస్తూ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించి విద్యార్థులను సర్కారు బడుల్లో చేర్పించడంలో విద్యాశాఖ విజయవంతమైంది. ఈ విద్యా సంవత్సరంలో బడిబాట ద్వారా 1,14,257 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరగా వారిలో 31,205 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చినవారే కావడం విశేషం.
రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రారంభమైంది. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో పాటు మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు సాధించడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ చేయూతనందించడంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు, ఏడో తరగతుల విద్యార్థులకు ఆరు, 8 వ తరగతికి ఏడు, 9,10 తరగతుల విద్యార్థులకు 14 నోట్ పుస్తకాలను ఉచితంగా అందించారు. ఈ నిర్ణయం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 26,074 మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు, 194 మాడల్ స్కూల్స్, 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, 31 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 51 సెంట్రల్ బడులు, 161 మదర్సాలు, 1002 సంక్షేమ గురుకులాలున్నాయి.11,637 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటన్నింటిలో దాదాపుగా 60. 77,073 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ బడుల్లో 30,93,368 (50.90శాతం), ప్రైవేటులో 29,83,705 (49.09 శాతం) ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్తున్నట్టుగా చిత్తశుద్ధి, సంకల్పసిద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. 2022 మార్చి 9న సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మన ఊరు మనబడి పథకంలో మొదటి విడత 35 శాతం బడులను ఆధునీకరించింది. టాయిలెట్స్ నిర్వహణ, తాగునీరు, డిజిటల్ విద్య, కిచెన్ వంటి 12 అంశాల్లో సౌకర్యాలు కల్పించింది.
నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేసే ప్రయత్నంలో మొదటి విడుతలో 9123 బడులను ఎంపిక చేసి బడ్జెట్లో వాటికి రూ.3497 కోట్లు కేటాయించింది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) నిధులకు కూడా చాలా జిల్లాల్లో పాఠశాలలను ఎంపిక చేసి ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన ఊరు మనబడి పథకంలో మొదటి విడుతలో పూర్తయిన 1000 పాఠశాలలను జూన్ 20న విద్యా దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దానికోసం రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ, పర్యవేక్షణాధికారులను, నియమించింది. త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలను కూడా ప్రభుత్వం భర్తీ చేయనున్నది. తద్వారా పభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందనున్నది.
పాకాల శంకర్ గౌడ్: 98483 77734