కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం. సంకేతంలో ఉన్న ఎరుపు రంగు యువ చైతన్యానికి నిదర్శనం. నీలం రంగు సమాజ సేవకు యువత సిద్ధంగా ఉన్నారనే విషయానికి సంకేతం.
దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకం. వారి శక్తియుక్తులకు సామాజిక స్పృహ, దేశ భక్తి తోడైతే సరైన మార్గంలో పయనిస్తారు. దేశాభివృద్ధికీ సహకరిస్తారు. ఈ ఉద్దేశంతోనే జాతీయ సేవా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని అనేక కళాశాలల్లో అమలవుతున్న ఈ పథకం యువతను సమాజ సేవకులుగా తీర్చిదిద్దుతూ దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నది.
కళాశాలల విద్యార్థులను నిరుపేదల కష్ట సుఖాలతో పాలు పంచుకునేలా చేసే లక్ష్యంతో జాతిపిత మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24న జాతీయ సేవా పథకాన్ని భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఒక వైపు విద్య వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే మరొక వైపు సంఘ సేవకు విద్యార్థులు సమయం కేటాయించే కార్యక్రమమే జాతీయ సేవా పథకం. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసేవారు ఎన్ఎస్ఎస్లో వలంటీర్లుగా చేరతారు. యుక్త వయస్సులోనే విద్యార్థులకు సేవా భావం పరిచయం చేయడం వల్ల వారి భవిష్యత్తులకు, దేశ భవిష్యత్తుకు సరైన పునాదులు వేసినట్లవుతుంది. ఈ పథకంలో సభ్యులుగా ఉన్న విద్యార్థులు తమ కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్యపర్చడంలో ఎనలేని కృషి చేస్తుంటారు.
‘నా కోసం కాదు నీ కోసమే’ అనే నినాదంతో దేశానికి, సమాజానికి సేవలందించడమే ఎన్ఎస్ఎస్ వలంటీర్ల లక్ష్యం. యువతలో సామాజిక చైతన్యం కల్పిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభమైన తొలి నాళ్ల నుంచి నేటి వరకు అనేక మంది విద్యార్థులను ఆకర్షిస్తూ ఉన్నది. వారిని సమాజ సేవకులుగా, భావి నాయకులుగా తీర్చిదిద్దుతున్నది. ఎన్ఎస్ఎస్లో చేరిన విద్యార్థుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయి. ఈ పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తరచూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపుతారు. ఎన్ఎస్ఎస్ యూనిట్లు తమ ప్రణాళికలో భాగం గా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తాయి. ఆయా గ్రామాల్లో వారం రోజులు పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తాయి. విద్యార్థులు(వలంటీర్లు) రోజూ ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవలందిస్తారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. తాగునీటి వనరులను ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో కలిసి క్లోరినేషన్ చేస్తారు. గ్రామీణులకు అవసరమైన ఆరోగ్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తారు.
ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందిస్తారు. పౌరులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు సహకరిస్తారు. వారికి ఓటు విలువను తెలియజేస్తారు. ఉన్నత లక్ష్యాలు, సమాజానికి మేలు చేసే వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఓటర్లకు తెలియజేస్తారు. ప్రజలకు చదువు విలువను తెలియజేసి, అక్షరాస్యతను పెంపొందిస్తారు. ఇటీవల కాలంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్వయంగా రక్త దానం చేస్తున్నారు. ప్రజలకు సామాజిక విలువలను తెలియజేస్తున్నారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి.
(వ్యాసకర్త : ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి, సిద్ధార్థ డిగ్రీ, పీజీ కళాశాల, నల్లగొండ)
నరేష్ జాటోత్ : 82478 87267