Election Commission | ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. ప్రజల తీర్పును నిక్కచ్చిగా నమోదు చేసి ఫలితాలను వెల్లడించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థ ను నడిపే పెద్దల ఎంపిక విషయంలో మోదీ ప్రభుత్వం చేసిన మార్పుచేర్పులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలురైన వారిని ఎంపిక చేసేందుకే ఈ ఏర్పాటు చేసిందని, ఈ చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం లాంటిదని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సందేహాలు తొలగించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం కొన్ని దిద్దుబాటు చర్యలు సూచించినా మోదీ సర్కారు వాటికి గండికొట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత, పోలైన ఓట్ల శాతం ప్రకటించేందుకు చాలా సమయం తీసుకోవటం, ముందస్తు లెక్కకు, తుదకు తేల్చిన లెక్కకు మధ్య అంతరం ఎక్కువగా ఉండటం అనేక అనుమానాలకు తావివ్వడం సహజమే.
మొదటి విడత పోలింగ్ ముగిసిన 11 రోజులకు, రెండో విడత ముగిసిన 4 రోజులకు తుది శాతాన్ని వెల్లడించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో, అదీ ఈవీఎంలతో నిర్వహించే ఎన్నికల్లో ఇంత జాప్యం అవసరమా? అనేది అసలు ప్రశ్న. ఏప్రిల్ 19 సాయంత్రం 60 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రకటించిన ఈసీ ఏప్రిల్ 30న విడుదల చేసిన ప్రకటనలో 66.14 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. రెండు విడతల్లోనూ కొంచెం అటూఇటుగా సుమారు 6 శాతం తేడా రావడం గమనార్హం. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ ఎత్తిచూపింది ఈ తేడానే. కొన్ని నియోజకవర్గాల్లో 5 నుంచి 10 శాతం ఓట్లు పెరిగాయి. ఏకంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్లో 7.52 శాతం పెరగడం విశేషం.
ఈ అదనపు ఓట్లు ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయని శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ నిలదీస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం రెండు రోజుల్లోనే పురుషులు, మహిళలవారీ లెక్కలతో సహా యావత్తు పోలింగ్ సమాచారాన్ని వెల్లడించిన ఈసీ ఈసారి ఇంతగా జాప్యం చేయడంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నికల శాతం పెరగడం అనేది సాధారణ విషయం కాదని గత మూడున్నర దశాబ్దాలుగా ఎన్నికల విశ్లేషకునిగా వ్యవహరిస్తున్న రాజకీయ పరిశీలకుడు యోగేంద్ర యాదవ్ చెప్తున్నారు.
సవరించిన లెక్కలను కూడా ఈసీ తన వెబ్సైట్లో పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఇలాంటి అనుమానాలు పారదర్శకతకు గొడ్డలిపెట్టు వంటివి. ఇటీవలి కాలం వరకు ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఈవీఎంల)పై వివాదం కొనసాగింది. నిరాధారమైన అపనమ్మకాలు వద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఆ వివాదం సందేహాస్పదంగానే కొలిక్కి వచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం పోలింగ్ శాతంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘం మీదే ఉంటుంది. ప్రజలు వేసిన పవిత్రమైన ఓటుపై అనుమానాల నీడలు పడటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విశ్వవ్యాప్తంగా మన్ననలు అందుకునే మన దేశానికి ఇలాంటి వ్యవహారాలు అంతగా శోభించవు.
ప్రధాని మోదీ తన పదేండ్ల పాలనలోఅబద్ధాలను వ్యాప్తి చేశారే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పైగా దేశ సంపదలైన ఎల్ఐసీ, పోర్టులు, విమానాశ్రయాలను అమ్మేశారు. అబద్ధాల తయారీదారు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ మోదీయే.
– తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత