తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం హైదరాబాద్ వేదికగా సంచార జాతుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. నేడు పలు రాజకీయ పార్టీలు సంచార జాతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మానవతాదృష్టితో సంచార జాతుల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అణగారిన జీవితాలతో బతుకీడుస్తున్న సంచార జాతి ప్రజల జీవన స్థితిగతులను పరిశీలించిన కేసీఆర్ వారి ఆర్థికాభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు.
సంచార జాతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో ఈ నెల 24 నుంచి 26 వరకూ సంచార జాతుల జాతీయ సదస్సు జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంచార జాతుల ప్రతినిధులు ఈ సదస్సు లో చర్చలు జరుపుతున్నారు. తద్వారా ఒక ప్రణాళికతో కూడిన నివేదికకు రూపకల్పన చేయనున్నారు. సదస్సు లో వివిధ రాష్ర్టాల సంచార జాతుల సమస్యలపైన చర్చలు జరుగుతు న్నాయి. అనంతరం, ‘డీఎన్టీ డిక్లరేషన్-హైదరాబాద్’ పేరుతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను ప్రతినిధులు అందజేయనున్నారు.
2006లో కాంగ్రెస్ ప్రభుత్వం, 2015లో బీజేపీ ప్రభుత్వం వేర్వేరుగా సంచారజాతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం జాతీయ కమిషన్లను వేశాయి. కమిషన్లు వేసి ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపో వడం విచారకరం. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక తప్పని సరి పరిస్థితుల్లో వారు ఉద్యమ బాట పట్టారు. సంచారజాతి ప్రజ లు నేడు దేశ జనాభాలో దాదాపుగా 12 నుంచి 15 శాతంగా ఉన్నారు. ఆ సంఖ్య నాలుగైదు రాష్ర్టాల జనాభాతో సమానం. అయినా సంచార జాతుల అభివృద్ధికి వేసిన జాతీయ కమిషన్ సిఫారసు లను కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం బాధాకరం. నేటికీ దేశంలోని సంచార జాతి ప్రజలు సాంఘిక దురాచారాలకు గురవుతున్నారు. సామాజిక, సాంఘిక స్థిరత్వం లేక, ఎలాంటి రాజ్యాంగపరమైన హక్కులకు నోచుకోలేకపోతున్నారు. వారికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందడం లేదు. సామాజిక భద్రత కరువై, ప్రాథమిక అవసరాలు కూడా తీరక దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
ఈ జాతి పిల్లలకు విద్య, ఆరోగ్యం, కనీస వసతులు కూడా ఉండటం లేదు. తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పిల్లలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. సంచార జాతుల స్థితిగతులపై అధ్యయనానికి 2006లో కేంద్ర ప్రభుత్వం 2006లో బాలకృష్ణ రేణుకే కమిషన్, 2015లో భీకురాంజీ ఇదాటె కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్లు అనేక విషయాలను సేకరించి కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికలు ఇలా ఉన్నాయి.
ఈ జాతీయ సదస్సులో పలు డిమాండ్ల సాధనకు శాంతియుత పోరాటానికి సంచార జాతులు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సంచారజాతుల జనాభా వివరాలను సేకరించాలి. వారికి ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు అందించాలి. అందరికీ కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. స్థిర నివాసాలు ఏర్పాటు చేసి కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 10 రిజర్వేషన్లు కల్పించాలి. ఉపాధి కోసం కుటీర, చిన్నపరిశ్రమలను ఏర్పాటు చేసి, ఆర్థిక సహా యం గ్రాంట్గా అందించాలి. బడ్జెట్లో సబ్ప్లాన్ రూపొందించి, నిధులు కేటాయించాలి. ఆర్థిక, అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలి. బీసీ జాబితా కులాల నుంచి సంచారజాతి కులాలను వేరుచేసి ప్రత్యేక క్యాటగిరీగా ప్రకటించాలి.
శ్రీనివాస్ తిపిరిశెట్టి: 99494 26536
(వ్యాసకర్త: సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)