September 17 | నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ర్టాన్ని విడిపించాలని భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య జరిపింది. కానీ ఆ తర్వాత నాలుగేండ్లు సైనిక పాలనలో, 62 ఏండ్లు వలస పాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే ప్రజలకు వలస పాలన, దోపిడి నుంచి అసలైన విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని సంఘ్ పరివారం సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరపాలనుకోవడం అర్థ రహితం. ఆ రోజును తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా జరపడమే ఏ కోణంలో చూసినా సముచితం.
సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని సంఘ్ పరివారం చాలా ఏండ్లుగా గోల చేస్తున్నది. అదే నైజమైతే సైనిక చర్య అనంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్గా ఎందుకు నియమించింది? హైదరాబాద్ సంస్థాన విలీనం విషయంపై నిర్ణయాలు తీసుకున్నది అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. ఆ సమయంలో ఆయన వద్ద హోం సెక్రటరీగా పనిచేసిన వీపీ మీనన్ తాను రాసిన ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అన్నారే తప్ప లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అనలేదు. హైదరాబాద్ మీద జరిగింది సైనిక చర్య అయినా దాన్ని పోలీస్ యాక్షన్ అన్నారు. ఇది విలీనమా లేదా సమైక్యతనా అన్న విషయంలో భారత ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉన్నది. హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్యను భారత ప్రభుత్వం విలీన దృష్టితో చూసింది కాబట్టే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ చేసి జైల్లో పెట్టకుండా రాజ్ప్రముఖ్గా నియమించడానికి సంకోచించలేదు. విచిత్రమేమంటే నాటి పోరాటంలో ఎలాంటి పాత్ర, భాగస్వామ్యం లేని సంఘ్ పరివారం మాత్రం ఇవాళ విమోచన పేరుతో గోల గోల చేస్తున్నాది. పైగా అందుకు పటేల్ బొమ్మను వాడుకోవడం విడ్డూరం.
నిజాం పాలనలో ప్రజలు రాచరిక నిరంకుశత్వానికి, ఫ్యూడల్ దోపిడికి, పీడనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఫ్యూడల్ దోపిడి, పీడన నుంచి విముక్తి కావాలని, రజాకార్ల ఆగడాలు అంతం కావాలని నాడు పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు నాయకులు కోరుకున్నారు. అయితే పోలీస్ యాక్షన్ తర్వాత రజాకార్ల ఆగడాలు ఆగి రాష్ట్ర విలీనం జరిగినా భూస్వామ్య దోపిడి, పీడన నుంచి విముక్తి రాలేదు. నిజానికి సాయుధ రైతాంగ పోరాటం వల్ల విముక్తమైన వేలాది గ్రామాలు తిరిగి దొరల వశమయ్యాయి. గ్రామాలు వదలి వెళ్లిన దొరలు, భూస్వాములకు సైనిక చర్య తిరిగి అధికారం కట్ట బెట్టింది. సైనిక చర్య భూస్వామ్య దోపిడి, పీడన నుంచి విముక్తి ఇచ్చి ఉంటే 1970, 80 దశకాల్లో తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలు వచ్చి ఉండేవి కావు. సైనిక చర్య భూస్వామ్య వ్యవస్థను స్థిరపరిస్తే, రైతాంగ ఉద్యమాలు తెలంగాణలో భూస్వామ్య దోపిడిని, పీడనను బలహీనపరిచాయి. అందువల్ల సెప్టెంబర్ 17 సైనిక చర్యను విముక్తి అన్న పదంతో వర్ణించడం వీలు కాదు.
సైనిక చర్య తర్వాత తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు అంతకు ముందు పడిన బాధల కంటే ఎక్కువే. కమ్యూనిస్టుల ఏరివేత పేరున రైతాంగాన్ని, రజాకార్ల ఏరివేత పేరున అమాయక ముస్లింలను భారత సైన్యం ఊచకోత కోసింది. నాడు నామ్ కె వాస్తేగా వెల్లోడి అనే సివిల్ సర్వీస్ అధికారిని హైదరాబాద్ ప్రధానమంత్రిగా భారత ప్రభుత్వం నియమించినా పాలనా వ్యవహారాలన్నీ భారత సైన్యం నియంత్రణలోనే ఉండేవి. అది మిలిటరీ పాలనే తప్ప సివిల్ పాలన కాదు. మిలిటరీ పాలనలో తెలంగాణలో ఈ ఊచకోత నాలుగేండ్లు కొనసాగింది. ఆఖరికి ఏమైంది? 1956లో రాష్ర్టాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్ రాష్ర్టాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలన్న ఫజల్ అలీ కమిషన్ సిఫారసులకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి తెలంగాణను పరాధీనం చేసింది భారత ప్రభుత్వం. 60 ఏండ్ల వలస పాలనలో మగ్గిపోయి తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారు. దానికి భూమిక కల్పించింది సెప్టెంబర్ 17. ఇది విముక్తి దినం ఎట్లా అవుతుంది? రెండు దశల్లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర సాధనా ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2న స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు వలస పాలన నుంచి, దోపిడి నుంచి అసలైన విముక్తి లభించింది. 2014 జూన్ 2నే తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా, సంపూర్ణంగా భారత యూనియన్లో భాగమైంది తప్ప 17 సెప్టెంబర్, 1948న కాదు. స్వరాష్ట్రంగా తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అనేక ప్రగతి సూచికల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది. కాబట్టి 17 సెప్టెంబర్ను తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా జరపడం ఏ కోణంలో చూసినా సముచితమైనది.
-శ్రీధర్రావు దేశ్ పాండే