నిరీక్షితే కేలివనం ప్రవిశ్య, క్ర మేలకః కంటకజాలమేవ.
అంటే ఒంటె ఉద్యానవనంలోకి పోయినా ముండ్లచెట్ల కోసమే వెతుకుతుంది. అక్కడ సువాసననందించే ఎన్ని పుష్పరాజాలున్నా, మధుర ఫలాలున్నా వదిలి ముండ్లకోసమే దాని వెతుకులాట. అలాగే బీఆర్ఎస్ ప్రస్థానం విషయంలో సానుకూలతలున్నా రాతకృష్ణుడు అవేవీ చూడబోడు. ఎక్కడే ప్రతికూలత ఉందనేదే ఆయన పెన్నుకు ముఖ్యం.. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగుతున్నపుడైనా.. ఇపుడైనా.. ఇదే వైఖరి.
ఆయన పత్రికలో వేసిన వార్తలు, రాసిన పలుకుల్లో ఇదే ప్రస్ఫుటమవుతుంది. తెలంగాణలో సోదిలోకి లేకుండా పోయిన టీడీపీ నిద్రాణమై ఉన్న తన ఓటుబ్యాంకును తట్టిలేపి పొత్తులతో రేపటి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించగలదన్న సుందర దృశ్యాన్ని… ఆంధ్రలో అధికార ప్రాప్తినీ చూడగలిగిన రాతకృష్ణుడు.. బీఆర్ఎస్ విషయంలో మాత్రం ‘అబ్బే రాష్ట్రం కూడా దాటదు’ అనేశాడు. ఏపీలో చోటెక్కడుందీ? ఇతర రాష్ర్టాల్లో ఛాన్స్ ఎక్కడుంది? అని పెదవీ విరిచాడు.
‘కేసీఆర్ మహా అయితే రాష్ట్ర సరిహద్దుల్లోని రాష్ర్టాల్లో కొన్ని సీట్లకు పోటీ చేయవచ్చు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకే చోటులేదు. కేసీఆర్ పార్టీకేం ఉంటుంది’ అంటాడు రాతకృష్ణుడు.
‘తమిళనాడులో అడుగుపెట్టే సాహసం చేయడం లేదు. ఒడిశాలో నవీన్ బలంగా ఉన్నారు. బీజేపీయే ఫెయిలైంది. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. ఇవే ఇలా ఉంటే ఉత్తరాదిలో చాన్స్ దొరుకుతుందా? దళితబంధు, ఉచిత విద్యుత్ అన్నంతమాత్రాన ఉత్తరాది ప్రజలు జిందాబాద్ అంటారా?..’ ఇవీ రాతకృష్ణుడి నిష్టూరాలు. అయితే ఏపీ రాజకీయాలను ఏ అంశం శాసిస్తుందో అందరికీ తెలుసు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కర్ణాటకలో దేవెగౌడ పార్టీ అండగా ఉంటుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ పరేడ్ గ్రౌండ్ సభకు వస్తున్నారు. ఒడిశాలో నవీన్ బీజేపీకి శత్రువే తప్ప బీఆర్ఎస్కు కాదు. అంతేకాదు విదర్భ ప్రాంతంలో గతంలో పట్టున్న బీజేపీ ఇటివలి స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది.
అలా కాదు.. అసలు దక్షిణాది వారిని ఉత్తరాది వారు ప్రధానిగా అంగీకరించరని రాతకృష్ణ తీర్మానించేశాడు. పీవీ ఒక మినహాయింపు మాత్రమేనన్నాడు. మరి దేవెగౌడ ఎక్కడివారో మరిచినట్టున్నాడు. దక్షిణాది అనేదే అనర్హత అయితే ఆయన ప్రధానిగా ఎలా కొనసాగినట్టు? అంతేకాకుండా ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పనులకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో కార్మికులు, కూలీలు వస్తున్నారు. వారికి చేతినిండా పనులు దొరుకుతున్నాయి. నెలల తరబడి ఇక్కడ ఉంటున్నవారు ఈ రాష్ట్రంలో పేదలు, వృద్ధులు, గర్భిణులకు ప్రభుత్వం ఏం చేస్తున్నదో తమ రాష్ర్టాలకు మోసుకుపోరా? కరెంటే లేని గ్రామాల్లో బతికేవారు ఇక్కడి 24 గంటల కరెంటును గొప్పగా చెప్పరా? వైద్యశాలలే లేని తమ రాష్ట్రంతో పోల్చి ఇక్కడ గర్భిణులకు కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి పథకాలను గమనించి అక్కడ చెప్పరా? పంటపొలాల్లో పనులు చేసేవారు రైతుబంధు, రైతు బీమా గురించి తెలుసుకోరా? వీళ్లంతా బీఆర్ఎస్కు ప్రచారకులు కారా? కాలేరా? అంతెందుకు.. కరోనా సమయంలో ఇక్కడ పనిచేసే ఉత్తరాది కార్మికులకు రైలు టిక్కెట్టిచ్చి భోజనం, నీళ్ల బాటిల్ ఇచ్చి సగౌరవంగా సాగనంపిన వైనం ఉత్తరాది రాష్ట్రాలకు చేరలేదా? ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మోదీని ఎన్నుకోవడానికి సంకోచించని ఉత్తరాది ప్రజలు తమకు, దేశానికి మేలు జరుగుతుందని భావించిన పక్షంలో తెలంగాణ నుంచి వచ్చిన కేసీఆర్ను ఎన్నుకోవడానికి ఎందుకు సంకోచిస్తారు?
ఆఖరుగా ఇవన్నీ కాదు.. ‘తెలంగాణ లో కేసీఆర్ బాగా బలహీనపడ్డారు. ముఖ్యంగా నిన్నటిదాక కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్న ఉత్తర తెలంగాణ లో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి’ అని రాసుకున్నాడు.
చాలా విచిత్రం. నిన్నగాక మొన్ననే కదా అదే ఉత్తర తెలంగాణలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న ‘కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ’ (సెస్) ఎన్నికల్లో బీఆర్ఎస్ 15 సీట్లకు గాను 15 సీట్లూ గెలుచుకున్నది. అందునా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అదే మొదటి ఎన్నిక. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క సీటూ గెలవకపోగా కాంగ్రెస్ సోదిలోకి కూడా లేదు. మరి ఏ ఫలితం ఆధారంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు? మనకు తెలియదు. వాస్తవానికి ఇప్పటికిపుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఇదే ప్రాంతంలోని ఏ ఒక్క బీజేపీ ఎంపీ బయటపడే అవకాశమే లేదని, అందుకే వాళ్లు సురక్షిత అసెంబ్లీ సీట్ల వేటలో పడ్డారనేది అసలు నిజం.
అధికార వైధవ్యం అనుభవిస్తున్న చంద్రబాబుకు మారుమనువు ఉందో లేదో తెలియని నిరంతర వేదనలో రాతకృష్ణ క్రుంగి కృశించి పోతున్నట్టు కనిపిస్తున్నది. అందుకే ప్రతి అంశంలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి పైకెత్తే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇంతకీ ఆంధ్రలో చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఉన్న మాటేమిటి అంటే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆఖరికి వైఎస్సార్సీపీ కూడా. అసలు బాబును పట్టించుకోవద్దని జగన్ ఆదేశాలున్నాయంటున్నారు. బాబు ను బాగా తగ్గించేందుకే పవన్ను టార్గెట్ చేసి, రెచ్చగొట్టి అతన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారన్న భావన ఉన్నది. మొదట్లో బాబు పర్యటనలను అక్కడక్కడా అడ్డుకున్నా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ప్రజలు కూడా బాబు, జగన్ పాలనను పోల్చుకుంటున్నారు. బాబు పది వేలిచ్చి లక్షాధికారులను చేశానని చెప్పుకొన్నారు. జగన్ వివిధ రూపాల్లో అంతకన్నా ఎక్కువ ఇచ్చినా చెప్పుకోవడం లేదనేది ప్రజావాక్యం. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభకు వేలాదిమంది అనూహ్యంగా తరలివచ్చారని రాతకృష్ణ రాసుకున్నాడు. తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశంకు ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్లో ని పలు నియోజకవర్గాల్లో గణనీయంగా ఓట్లు ఉన్నాయట. వాళ్లే లేకపోతే మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కోల్పోయేదట. ఆయనే రాసుకున్నాడు. ఇంత కూ చంద్రబాబు సభ ఎందుకు పెట్టారట? ఆయన మాటల్లోనే చెప్పాలంటే బీజేపీ పొత్తు కోసం. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా టీడీపీలో చేరతారట. టీడీపీ ఓటర్లు ఓట్లేస్తారట. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అన్న నమ్మకం ఉన్నా బీజేపీలో చేరలేని నాయకులూ ఇక టీడీపీ తీవ్రంగా బలపడిపోతున్నది కాబట్టి పోలోమంటూ బాబుతో చేరిపోతారట. అంతేకాదు వైఎస్ షర్మిలకు క్రైస్తవుల మద్దతు, ప్రవీణ్కుమార్కు దళితుల మద్దతు ఉన్నందున వీళ్లనూ కలిపేసుకుంటే ఇక బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం.. పొత్తు పెట్టుకోండ్రా అని చెప్తున్నాడు. కాకపోతే టీడీపీ ఓటైర్లెనా నాయకులైనా 90 సీట్లను గెలిచిన బీఆర్ఎస్ను వదిలి.. ఖమ్మం, హైదరాబాద్ కలిపి 15 సీట్లలో మాత్రమే బలమున్న.. పైగా కచ్చితంగా గెలుస్తుందో లేదో తెలియని టీడీపీని; అసెంబ్లీ లో మూడు సీట్లున్న… తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతుందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్న బీజేపీని నమ్మి పోలోమంటూ టీడీపీలో చేరిపోతారా? తెలంగాణలో మోదీకి, బాబుకు ఉన్న ఫేస్ వాల్యూ ఎంతో ఆ మాత్రం తెలియని రాజకీయ అజ్ఞానులున్నారా?
వుల్లీవన సమూహేషూ జోరీగః కోకిలాయతే!!
అని ఓ వ్యంగ్యోక్తి. అంటే ఉల్లితోటలో జోరీగే కోకిల అన్నట్టు. పాపం చంద్రబాబు పక్కన ఉన్నది ఇలాంటి రాజకీయ విశ్లేషకులే.
అదేంటో ఆ మధ్య మోదీతో ఏకాంత సంభాషణ జరిపిన తర్వాత రాతకృష్ణుడి రాతల తీరే మారిపోయింది. అంతదాక మోదీ బీజేపీ అంటే అంతంత మాత్రంగానే ఉన్న ఆసక్తి హఠాత్తుగా ఆకాశమంత ఎదిగింది. మోదీ ఇపుడు విరాట్ స్వరూపంలాగా కనిపిస్తున్నాడు.
ఆయన తాజా పలుకు చూడండి. మోదీపాలనపై ప్రజలకు ఇంకా మొహం మెత్తలేదట. ఎవరివో తెలియవు గానీ ఒకరి అంచనాల ప్రకారం 2024లో మోదీయే విజయం సాధిస్తారట. ఈడీలు బోడీలను ఉసిగొలిపే విమర్శ తప్ప మరేమీ మరక లేదట. మతతత్వం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజలు పట్టించుకోవడం లేదట. ఇంకా చాలా చెప్పారు. కేసీఆర్ను వేధిస్తున్నాడు గనుక మోదీ చాలా అందంగా ఆయనకు కనిపించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? నిన్నగాక మొన్న జరిగిన రైతు ఉద్యమాల మాటేమిటి? వారు అనుకూలంగా ఉన్నారా? పెరుగుతున్న ధరల మీద ప్రజల వ్యతిరేకత కనపడటం లేదా? మతతత్వం గురించి ప్రజలకు ఎక్కడం లేదనేదే నిజమైతే.. ముస్లింలు, క్రిస్టియన్ల వంటి మైనారిటీలను చేరదీయాలని స్వయంగా మోదీయే పార్టీ శ్రేణులను ఎందుకు ఆదేశించినట్టు? అసలు ఉత్తర భారతంలో బీజేపీ గెలుస్తామని ధీమాగా చెప్పే పరిస్థితి ఉందా? నిన్నగాక మొన్న ప్రధాని నియోజకవర్గంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఏం చెప్పింది? రైతు రాష్ట్రం పంజాబ్ ఎన్నికల ఫలితం ఏం చెప్పింది? ఆప్ సర్కారు ను ముప్పుతిప్పలు పెట్టి సాధించిందేమిటి? ఒకటిగా ఉన్నా నాలుగు ముక్కలుగా ఉన్నా.. ఢిల్లీ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఎగిరిన బీజేపీ జెండా ఈసారి సోదిలోకి లేకుండా పోవడం ఏ సంకేతం ఇస్తున్నది.? సాక్షాత్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత రాష్ట్రం అందునా అధికారంలో ఉన్న రాష్ట్రం హిమాచల్లో ఫలితం ఏమిటి? తేజస్వీ యాదవ్ విజృంభించినపుడు నితీశ్ పొత్తు ఉన్నా అత్తెసరు ఫలితాలతో గెలిచిన బీహార్లో ఇపుడు ఉన్న నితీష్ జారిపోయాడు. ఇక మిగిలిన పతారా ఎంత? బలమెంత? బెంగాల్లో బెబ్బులిని ఎదురించి సీట్లు సాధించే స్థితి ఉన్నదా? ఉప ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయి? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారును పడగొట్టి అధికారంలోకి వచ్చారు తప్ప అది వాస్తవ బలం కాదు గదా? రాజస్థాన్ సరేసరి. కాంగ్రెస్ చెక్కుచెదరడం లేదు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చగలిగారు తప్ప ఎన్నికల్లో గెలువగలరా? ఇటీవలి నాగపూర్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? కేరళలో ఉన్న ఒక్క సీటూ పోయింది. తమిళ రాజకీయం సంగతి తెలిసిందే. ఏపీలో డబ్బులు మీడియాలో చోటు ఇవ్వగలవు తప్ప సొంతంగా ఒక్క సీటైనా గెలిచే స్థితి ఉందా? మరి బీజేపీకి ఎక్కడ బలమున్నట్టు? మోదీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి కచ్చితంగా రాగలడని చెప్పేదెలా? పక్కదేశాల సరిహద్దుల్లో ‘యుద్ధ’ మేఘాలు సృష్టించి ఎన్నికలు గెలవడం ప్రతిసారీ వీలు కాదు.
బీజేపీ అంత బలంగానే ఉంటే, ఎపుడో కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా పేద ప్రజలకు ఇచ్చిన ఉచిత బియ్యం వితరణను కరోనా పోయి ఏడాదులు గడుస్తున్నా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నట్టు?
ఆరు నెలలకే ముగించాల్సిన పథకాన్ని ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నపుడల్లా కొనసాగింపు ఉత్తర్వులు ఎందుకు ఇస్తున్నట్టు? వాస్తవానికి ‘బఫర్ స్టాక్ కింద పెట్టుకున్న ఆహార పదార్థాలు అయిపోతున్నాయి మొర్రో’ అంటూ ఎఫ్సీఐ గోల పెడుతున్నా వినకుండా మళ్లీ రెండు నెలల కిందట కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చారు. ఎం దుకు? ఈ ఏడు అనేక రాష్ర్టాల్లో ఎన్నికలున్నాయి. వచ్చే ఏడు పార్లమెంటు ఎన్నికలు. అవి ముగిసేదాక ఈ పథకం కొనసాగడం తథ్యం. చమురు ధరల పెరుగుదల కారణంగా మార్కెట్లో అన్నిరకాల ఆహారపదార్థాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. వంటగ్యాస్ ధరా పెరిగింది. సామాన్యుడు నోట్లో ముద్ద పెట్టుకున్నపుడల్లా ఈ ధరల పెరుగుదలను తిట్టుకుంటున్నాడు. ఈ వ్యతిరేకతను అదుపుచేసే నష్ట నివారణ చర్య ఈ రేషన్ వితరణ. ఇదీ బీజేపీ పరిస్థితి.
బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలవాలని రాతకృష్ణుడు సూచిస్తాడు. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష వేదిక ఏమిటని ఆయన ప్రశ్న. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతుంది.
పార్టీ శ్రేణులను ముందుకునడిపే సామర్థ్యం రాహుల్కు లేదని ఎపుడో తేలిపోయింది. కేం ద్రంలో అధికారం కావాలంటే ప్రాంతీ య పార్టీలను కలుపుకొనిపోవాలి. ఆ దిశగా రాహుల్ ఎవరికైనా స్నేహహస్తం చాచిన దాఖలా ఉం దా? వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్నికలను వదిలేసి సమయం కాని సమయంలో జోడో యాత్ర చేపట్టి ఏం సాధించినట్టు? పోనీ ఈ యాత్రతో పార్టీలో పునరుత్తేజం ఏమైనా వచ్చిం దా? ఒక పెద్ద పార్టీ నేత పాదయాత్ర జరిపితే దాని తాలూకు రాజకీయ ప్రకంపనలు ఎలా ఉండాలి? ఇన్ని రోజుల నుంచి ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఏం లాభం? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఒక్క నినాదమైనా ఇచ్చారా? ప్రత్యర్థులను కంగారు పెట్టే ఒక్క భీషణ విమర్శ అయినా ఆయన నోట పలికారా? రాజకీయాల్లో నినాదాలే పార్టీలను విజయతీరాలకు చేర్చేది. ఇందిరా గాంధీ గరీబీ హఠావో నినాదం.. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం. మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం. టీఆర్ఎస్ ‘ఔర్ ఏక్ ఢక్కా తెలంగాణ పక్కా’ నినాదాలు ప్రజల్లోకి ఎలా దూసుకుపోయాయో చూశాం.. అలాంటి నినాదాలు లేవు. కొత్త విధానాల ప్రకటనలూ లేవు. నడిచి నడిచి పిక్కలు పీక్కుపోవడం తప్ప పార్టీకి ఆ నేతలకు ఒరిగిందేమిటి? ఆ పార్టీతోక పట్టుకొని ఎన్నికల గోదారి ఈదాలనడం ఏమిటి?
కాంగ్రెస్, బీజేపీలు పేరుకే జాతీయ పార్టీలు. వాటిల్లో జాతీయభావన శూన్యం. జాతీయ భావన అంటే దేశం-దేశంలోని ప్రజలు, ప్రాంతాలపై సమదృష్టి కలిగి ఉండటం.జాతి మొత్తాన్ని ఏకతాటిమీద ముందుకు నడిపించడం.
దేశ సహజ వనరుల వినియోగం మీద, దేశ సంపద పరిరక్షణ మీద, దేశాన్ని భవిష్యత్తుకు సిద్ధపరచడం మీద సరైన వ్యూహం, దార్శనికత కలిగి ఉండటం. వేల వేల ఏండ్లనాడే ప్రపంచమంతా కొనియాడిన భారతజాతి సం స్కృతిని, అపురూపమైన ఆధ్యాత్మిక సంపదను, వారసత్వ విలువలను పరిరక్షించడం.. భవిష్యత్ తరాలకు భద్రంగా అందించడం. పతనమైన జాతి ప్రతిష్ఠను శిఖరాగ్రం మీద పునఃప్రతిష్టించడం. దేశానికి జీవగర్ర అయిన గ్రామసీమలు పాడిపంటలతో అలరారే దిశగా బాటలు వేయడం. మట్టిలో బంగారం పండించే రైతును దేశ ప్రథమశ్రేణి పౌరుడిగా తీర్చిదిద్దడం. ఎక్కడో పోగొట్టుకున్న భారతీయ సనాతన నైతికవర్తనను, ధర్మాచరణను జాతిజీవనంలో భాగం చేయడం. ఇందులో ఏ ఒక్క లక్షణమూ ఆ రెండు పార్టీలకు లేదు. వారి ఎజెండాలో ఇలాంటి అంశాలూ లేవు. తెలంగాణలో కేసీఆర్ సర్వమత సమదృష్టికి, సహజవనరుల సద్వినియోగానికి, సంస్కృ తి సంప్రదాయాల పరిరక్షణకు, గ్రామసీమల పునరుజ్జీవానికి ఏం చేశారో దేశం ముందు ఉన్న ది. రాతకృష్ణ అహం అంగీకరించకపోవచ్చు కానీ, ఇదే బీఆర్ఎస్ బలం. తెలంగాణ ప్రతిష్ఠను ఉన్నత స్థానంలో నిలిపిన కేసీఆర్ రేపు దేశ ప్రతిష్ఠను శిఖారాగ్రంలో నిలపుతారనే భావనే ఆ పార్టీ ప్రస్థానానికి ఇంధనం.
కేసీఆర్ ఏదిచేసినా రాతకృష్ణకు అందులో తప్పే కనపడుతుంది. ఆ మధ్య ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముందే వీడియోల ప్రదర్శన కారణంగా సీబీఐకి ఆ కేసును బదిలీ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. అప్పటిదాక కేసీఆర్ ఈ కేసు ఆధారంగా ఎక్కడ ఎదిగిపోతాడోనని బిక్కుబిక్కుమని చూస్తున్న రాతకృష్ణుడు ఎగిరి గంతేశాడు.కేసీఆర్ కథ అడ్డం తిరిగిదంటూ ఆ వారం పలుకులో పులకరించిపోయాడు. ఇక కేసు కేసీఆర్ చేతిలోంచి పోయిందని సంబురాలు చేసుకున్నాడు. సీబీఐయే కేసీఆర్ను విచారించే అవకాశముందన్నాడు. వీడియోలు బయటపెట్టడం కేసీఆర్ తప్పిదమని తీర్మానించాడు. కేసీఆర్ తనకుతాను గండరగండడని అనుకుంటాడని.. అందుకే ఏదో చేద్దామనుకొని ఏదో చేసి దెబ్బతిన్నాడని.. అన్నాడు. కేసీఆర్లోని వ్యూహకర్తను అంగుళం మేర కూడా అర్థం చేసుకోని అజ్ఞానం అది. వాస్తవానికి ఎమ్మెల్యేలకు ఎర కేసులో క్లయిమాక్స్కు చేరుతుందని, ఢిల్లీ పెద్దలు కోర్టు బోనులో దోషులుగా నిలుచుంటారని.. వారికి కఠిన శిక్షలేవో పడతాయని కేసీఆర్ ఊహించారని భావించలేం. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయాల్లో వివిధ వ్యవస్థలను కేంద్రం కుప్పగూల్చిన పరిస్థితిలో అలాంటి సీనుకు అవకాశమే లేదు. దేశంలో అన్ని వ్యవస్థలనూ గుప్పిట పట్టి శాసిస్తున్న వ్యక్తిని ఏదో చేయగలిగిన స్థాయిలో మన అధికార విభాగాలున్నాయా? లేదా? అనే విషయం కేసీఆర్కు తెలియదా? ఇక్కడ కళ్లముందు పాతిక కేసుల్లో జీవితకాలపు బెయిళ్ల మీద చంద్రబాబే కాలరెగరేసుకొని తిరుగుతుంటే దేశ రాజకీయాలను శాసించే శక్తులను శిక్షించడం సాధ్యమవుతుందా? ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి కేసు క్లయిమాక్స్కు వచ్చినా అప్పటిదాకా నిందితులు ఇలాగే ఉంటారా? మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణంలో డజన్ల కొద్దీ సాక్షులు అనుమానాస్పద స్థితిలో దుర్మరణాల పాలై కేసు వీగిపోయిన వైనం చూశాం కదా!. ఇది తెలుసు కాబట్టే.. కేసీఆర్ ముందే వీడియోలను ప్రపంచానికి అందించారు. అన్ని న్యాయస్థానాలకు.. పత్రికా సంస్థలకు.. మేధావులకు ఎందుకు పంపి ఉంటారో ఆలోచన ఉన్నవారికి అర్థమవుతుంది. తద్వారా ఈ కేసులో కేసీఆర్ యుద్ధానికి ముందే విజయం సాధించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను బీజేపీ ఎంత నీతిబాహ్యంగా అమలుచేస్తున్నది ప్రపంచం కళ్లముందు పెట్టారు. బీజేపీ నైతికతను చావుదెబ్బ తీశారు. ఎప్పటికీ చెరుపుకోలేని మచ్చను రుద్దారు. ఇపుడు ఆ కేసు నిందితులలో ఎవరి పేరు వినిపించినా కొనుగోళ్ల అంశమే గుర్తుకువచ్చేలా చేశారు. ఇంతకుమించిన శిక్ష ఒక రాజకీయ పార్టీకి ఏముంటుంది? దీన్ని మించిన శిక్ష ఏ న్యాయస్థానమైనా ఏం విధిస్తుంది? ఈ కేసు తర్వాత రాష్ర్టాలను పడగొట్టే కార్యక్రమాలు నిలిచిపోవడం దేనికి తార్కాణం? టచ్లో ఉన్నారు.. ఏక్నాథ్ షిండేలున్నారు వంటి దబాయింపు డైలాగులు నిలిచిపోవడం దేనికి సంకేతం? ఇవన్నీ మరిచి కేసీఆర్ బోల్తాపడ్డాడంటూ సినీ ఫక్కీలో తెగ సంబురపడిపోవడం వెర్రితనం. బోల్తా పడటం కాదు.. దేశంలో బీజేపీని సై అంటే సై అని ఎదుర్కొనే దమ్మున్న ఏకైక నాయకుడిగా కేసీఆర్ ఈ కేసుతో ఎదిగిపోయారు. దేశ రాజకీయాల్లో ఇవాళ మోదీని వ్యతిరేకించే ప్రతిపక్ష నాయకుల జాబితాలో మొదటి పేరు కేసీఆర్కు దక్కింది. రాజకీయాల్లో యుద్ధాలుంటాయి. అవసరమైతే పోరాటాలు చేస్తారు. జైళ్లకు కూడా వెళ్తారు. వారికే జనం జై కొడతారు. యధాతథవాదులకు అంగుష్టమాత్రపు ఆలోచనాపరులకు ఇది అర్థం కాదు.
ఆంధ్రాకూ కేసీఆరే ఆశాకిరణం అంటే రాతకృష్ణకు బాదేసింది. ఆ మధ్య కొత్తపలుకులో తన బాధనంతా బాదుకున్నాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పనీ?’ అన్నారట. ఇపుడు కేసీఆర్ ఇతర రాష్టాలకు వెళ్తే ఇదే ప్రశ్న రాదా? అంటాడు. ఏపీకి కేసీఆర్ ఆశాకిరణం ఎలా అంటారన్నది ఆయన అభ్యంతరం. ఆంధ్రవాళ్లు రాక్షసులన్న కేసీఆర్ను వాళ్లు ఎలా ఆదరిస్తారనీ అడిగేశాడు.
కరెక్టే అపుడపుడూ మనసులోని పక్షపాతం నగ్నంగానే బయటపడుతుంది. కానీ రాతకృష్ణ తెలుసుకోవాల్సిందేమంటే చంద్రబాబు ప్రాంతేతరుడైనంత మాత్రాన్నే తెలంగాణ ప్రజలు ఆయనను వ్యతిరేకించలేదు. రాజీనామాలు చేయించి.. బస్సులు పంపించి డబ్బులు కుమ్మరించి, కృత్రిమ ఉద్యమాలకు తెరదీసి వచ్చిన తెలంగాణను ఆపే ప్రయత్నం చేసినందుకు వ్యతిరేకించారు. తెలంగాణ ఇవ్వాలని తానే పార్టీలో తీర్మానం చేసి, తీరా ఇచ్చాక అర్ధరాత్రి ఎలా ఇస్తారు? అంటూ వంకరమాటలు మాట్లాడినందుకు వ్యతిరేకించారు. వందలాది మంది యువత బలిదానాలకు పరోక్ష కారకుడైనందుకు వ్యతిరేకించారు. వచ్చిన తెలంగాణలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో, నోట్లతో ఓట్లు కొనుగోలు కేసులో వాయిస్తో సహా అడ్డంగా దొరికిపోయి, దబాయించినందుకు వ్యతిరేకించారు. రాతకృష్ణ గడుసుతనం ఏమిటంటే ఇవన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు పొట్టోన్ని పొడుగోడు కొడితే.. అంటూ తెలంగాణ సామెత రాశాడు. కానీ పోశమ్మతల్లి ఒక దేవత. మంచి పక్కన నిలబడుతుంది తప్ప రాక్షసి మూకలకు మేలు చేయదు.
– సవాల్ రెడ్డి