రాష్ట్రంలో కళ్ల ముందు ప్రగతి కనిపిస్తున్నది. సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉంటున్నారు. రాజ్యాంగబద్ద పాలన నడుస్తోంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్నది. దేశాభివృద్ధిని వదిలేసి తెలంగాణపై విషం చిమ్ముతోంది. ఇందుకు సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడానికి కూడా ఆ పార్టీ సిద్ధపడింది. కానీ తెలంగాణ సమాజం ఇలాంటి రాజకీయాలను హర్షించదని ఆ పార్టీ గుర్తుంచుకోవాలి.
ప్రతి పక్ష పార్టీలు రాష్ట్ర పరిపాలనలో ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తే హుందాగా ఉంటుంది. కానీ బీజేపీ నాయకులు మాత్రం రాష్ర్టానికి, రాజకీయాలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. దేశంలో పాలనను గాలికి వదిలేసి తెలంగాణలో ఏదో జరిగిపోతోందని అవాకులు చవాకులు పేలుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ సారథ్యంలో తమ ఆకాంక్షలు నెరవేర్చుకుంటున్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో 28 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నాం. 1950లో దేశ జీడీపీలో వ్యవ సాయ రంగం వాటా 59 శాతం ఉంటే 2019 నాటికి అది 14 శాతానికి పడిపోయింది. ఇది వ్యవసాయ రంగం పట్ల కేంద్ర పాలకుల చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. కానీ కేసీఆర్ మాత్రం వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. సాగునీరు, వ్యవసాయ రంగంలో కేసీఆర్ ముందుచూపు వల్ల నేడు తెలంగాణ భారత దేశానికి అన్నపూర్ణగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీరు అందిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి ప్రగతి అస్సలు కనిపించదు.
రైతుల ఆత్మహత్యలను ఎందుకు ఆపడం లేదని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తే, వారు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం తప్పుడు నివేదికలు సమర్పించింది. కానీ రైతు విలువ తెలిసిన కేసీఆర్ పంటలకు నాణ్యమైన నిరంత ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.10 వేల రూపాయలు రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు రైతులు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నారు. దళితుల పక్షపాతి అయిన కేసీఆర్ ఆర్థిక పరిపుష్టి ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని తలంచి ఏటా మండలానికి పది దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు.
2014లో తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష. ఈ రోజు అది రూ.2,78,500కు పెరిగింది. మన కంటే పెద్ద రాష్ర్టాలు ఇన్నేండ్లలో సాధించలేనిది… క్రమశిక్షణతో మనం సాధించుకున్నాం. అవినీతి రహితంగా పాలన నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో ఇదంతా ఎట్లా సాధ్యమవుతున్నదని దేశమే నివ్వెర పోతున్నది. తెలంగాణలో విదేశీ, స్వదేశీ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి.
2014లో తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1 లక్ష. ఈ రోజు అది రూ.2,78,500కు పెరిగింది. మన కంటే పెద్ద రాష్ర్టాలు ఇన్ని ఏండ్లలో సాధించలేనిది… క్రమశిక్షణతో మనం సాధించుకున్నాం. అవినీతి రహితంగా పాలన నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో ఇదంతా ఎట్లా సాధ్యమవుతున్నదని దేశమే నివ్వెర పోతున్నది. తెలంగాణలో విదేశీ, స్వదేశీ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ ఈ ఎనిమిదేండ్లలో యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించింది. అణగారిన వర్గాల పిల్లల కోసం 969 సంక్షేమ పాఠశాలలు ప్రారంభించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాల రైతు నాయకులు కొనియాడడం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. వివిధ రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ పట్నాలు, పల్లెల్లో అమలవుతున్న అభివృద్ధిని చూసి అభినందించి వెళుతున్నారు. తమ రాష్ర్టాల్లో ఇలాంటి కార్యక్రమాలనే అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ బీజేపీకి ఎందుకు కనిపించడం లేదు?
కేసీఆర్ కుటుంబంపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అర్ధ రహితం. కేటీఆర్, కవిత ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో సామాన్య కార్యకర్తల్లా పాల్గొని తమ పోరాట పటిమతో, నాయకత్వ లక్షణాలతో జనం మెచ్చిన నాయకులు అయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనలో భాగస్వాములై తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతిభ, స్వయం కృషి ఆధారంగా నాయకులైన వారిని కుటుంబ పాలనతో విమర్శించడం చౌకబారుతనం.
ఇదే సమయంలో కేంద్రంలో బీజేపీ పాలనను పరిశీలిస్తే ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా, సంతృప్తిగా లేరు. అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. అవినీతి పెరిగిపోయింది. నిరుద్యోగం తాండవిస్తోంది. మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. రూపాయి రోజురోజూకీ పతనం అవుతున్నది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పేదలు మరింత పేదలవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రైతాంగం తమ వ్యూహాన్ని సమీక్షించుకోవాలి. కార్మికులు తమ సంక్షేమం కోరే వారితో కలిసి ముందుకు సాగాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న మోదీ ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధపడాలి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు వస్తున్న కేసీఆర్తో అన్ని వర్గాల ప్రజలు జత కట్టాలి. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయ-ఆర్థిక ప్రణాళికలను బలపరచాలి.
(వ్యాసకర్త: జిల్లా అధ్యక్షులు, తెలంగాణ వికాస సమితి, రాజన్న సిరిసిల్ల జిల్లా)
ఫణి రాజారావు రామినేని: 94400 52555