ప్రజల తీర్పు, అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం రాజకీయ పార్టీల విధి, బాధ్యత. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్పై ఈ బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిపక్ష పాత్రను పోషించాలన్న జనాదేశాన్ని సమర్థంగా అమలు చేస్తున్నది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడం, ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఎప్పటికప్పుడు గుర్తుచేయడం, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం ప్రతిపక్షాల కర్తవ్యం. ఇది కూడా ఒకవిధంగా ప్రజలు ఇచ్చిన అధికారమే.
కాంగ్రెస్ కన్నా కాస్త తక్కువ ఓట్లు సంపాదించి అధికారానికి దూరమైనప్పటికీ, ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే పవర్ను మాత్రం ప్రజల ద్వారా పొందింది బీఆర్ఎస్. ఆ ప్రజాబలాన్ని చూసుకొనే.. కాంగ్రెస్ సర్కార్ను నిలదీయగలుగుతున్నది. సమర్థవంతమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అలాంటి సందర్భంలోనే వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేస్తాయి. ప్రగతి కూడా సాధ్యపడుతుంది.
బీఆర్ఎస్ విషయానికి వస్తే.. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలందరూ ప్రతిపక్ష పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. ఉద్యమ పార్టీకి ఇలాంటి విధులు కొత్తేమీ కాదు. ఈ విషయంలో సీనియర్ నేత హరీశ్రావు పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. దాదాపు పాతికేండ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వంలోనూ, విపక్షంలోనూ చిత్తశుద్ధితో పని చేసిన అనుభవం ఇప్పుడు అక్కరకు వస్తున్నది. ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశతో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం, కేసీఆర్ సర్కార్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం, ప్రభుత్వ పెద్దలు చెప్పే విషయాల్లో వాస్తవాలెంత? అవాస్తవాలెంత? అన్న విషయాన్ని విడమర్చి ప్రజలకు చెప్పడం, ప్రభుత్వ హామీలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తూ విపక్ష నేత ఎలా వ్యవహరించాలో రుజువు చేస్తున్నారు హరీశ్రావు. ఎక్కడా వ్యక్తిగత విమర్శలు, దూషణల జోలికి పోకుండా ప్రజల సమస్యలపైనే మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీలో చర్చకు వచ్చిన మూడు అంశాలను పరిశీలిస్తే.. విపక్షంగా బీఆర్ఎస్ పనితీరు ఏమిటో అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మించడమే వృథా అని, గతంలో ప్రతిపాదించిన విధంగా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే బాగుండేదని పదేపదే కాంగ్రెస్ వాదించింది. అయితే ఆ వాదనను హరీశ్రావు బలంగా తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో అరటి పండు వలిచినట్టు విడమర్చి చెప్పారు హరీశ్రావు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలోని దాదాపు మూడు వేల ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఇందుకు అక్కడి కాంగ్రెస్ పార్టీగానీ, బీజేపీగానీ ఒప్పుకోలేదు. పైగా ఉద్యమాలు చేశాయి. పోనీ, దీనిపై తెలంగాణకు చెందిన ఆయా పార్టీల నాయకులు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారా? అంటే అదీలేదు. ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చడం తప్ప మరో మార్గమే లేదు. అందుకే ముంపు తక్కువగా ఉండే కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించాల్సి వచ్చింది. ముంపు విస్తీర్ణం తగ్గేలా తుమ్మిడిహట్టి వద్దనే ప్రాజెక్టు కడితే.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. తద్వారా చేవెళ్ల వరకు నీరు పారించి, గోదావరి-కృష్ణా ఆయకట్టులను అనుసంధానం చేయాలన్న లక్ష్యం నెరవేరదు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికీ తాగునీరు లభించదు. గోదావరి జలాల తరలింపు అంతర్రాష్ట్ర వివాదం కాకూడదన్న ఉద్దేశంతోనే ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేయాల్సి వచ్చింది. అంతే తప్ప మరో ఉద్దేశమే లేదు. అంతర్రాష్ట్ర జల వివాదమా? అధిక వ్యయమా? దేనివైపు మొగ్గు చూపాలన్న ధర్మ సందేహం తలెత్తినప్పుడు దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా సహజంగానే రెండో దానికి అంగీకారం తెలుపుతారు. ఇది ప్రజానీకంతో పాటు పార్టీ శ్రేణులకూ బోధపడింది.
కాంగ్రెస్ సర్కార్ చెప్పిన మరో అసత్యం మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం గురించి. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీయే కట్టిందని హస్తం సర్కార్ చెప్పుకొచ్చింది. అది నిజం కాదని అసెంబ్లీ సాక్షిగా హరీశ్రావు నిరూపించారు. మానేరు ప్రాజెక్టులపై ఆనకట్టలు నిర్మించడమన్నది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనుల్లో అంతర్భాగంగా ప్రతిపాదించారు. అప్పర్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులను నిర్మించినా మధ్యలోని మిడ్ మానేరు ప్రాజెక్టును ఉమ్మడి ప్రభుత్వాలన్నీ మరిచిపోయాయి. తెలంగాణ సిద్ధించి కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కరువు నేల పచ్చగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో ఎన్ని అవాస్తవాలు ఉన్నాయో ప్రజలకు విడమర్చి చెప్పారు హరీశ్రావు.
కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పక్షాన అడ్డుకోవడంలో హరీశ్రావు కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్ సర్కారే వీటిని కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదన చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాదనను ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారు. ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేశారు. సాగునీటి రంగంపై ఎంతగానో ప్రభావితం చేసే ఈ నిర్ణయం విపక్ష విజయమేనని చెప్పకతప్పదు.
అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు పదేపదే చెప్తూనే ఆ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తున్నారు. అందులో ఒకటి.. ముఖ్యమంత్రే స్వయంగా ప్రతిరోజూ ప్రజాభవన్కు వెళ్లి వినతులు స్వీకరించడం. ఈ మాట స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. వాస్తవానికైతే తీరికలేని పనుల దృష్ట్యా ప్రతి రోజూ ముఖ్యమంత్రి ప్రజలను కలవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు కాబట్టి దాన్ని అమలు చేయకతప్పదు. దాన్నే హరీశ్రావు ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి వెళ్లకతప్పలేదు.
ప్రజల వ్యక్తిగత సమస్యలు, సామూహిక సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్కు స్పష్టమైన విధానం ఉంది. అదే అధికార వికేంద్రీకరణ. సమస్యల పరిష్కారంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే చిన్న జిల్లాలు, చిన్న మండలాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్. ఏ సమస్యను, ఎవరు పరిష్కరించాలో దిశానిర్దేశం చేసింది. ఉదాహరణకు ఎవరికైనా రేషన్కార్డు కావాల్సి వస్తే దాన్ని మండల స్థాయిలోనే పరిష్కరించాలి. ఇందుకు వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితర ఎందరో ప్రజాప్రతినిధులు ఉన్నారు.
వారితో పాటు అదే స్థాయిలో అధికార యంత్రాంగం కూడా ఉంది. పార్లమెంట్ సభ్యులనో, ఎమ్మెల్యేలనో, ఇతర ప్రముఖులనో కలిసి వినతిపత్రాలను సమర్పించే వెసులుబాటు కూడా ప్రజలకు ఉంది. ఆ వినతిపత్రాలను వారు సంబంధిత అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించే సంప్రదాయం కూడా ఉంది. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ఎక్కడికక్కడ ఏదో ఒక విధమైన వ్యవస్థ ఉండనే ఉంది. వీటన్నింటి ద్వారా పని కానప్పుడు మాత్రమే హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇవ్వాలి.
ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఏమిటన్నది ఇంకా తెలియడం లేదు. ప్రజాభవన్లో ఇచ్చిన వినతిపత్రాల్లో ఎన్నింటిని పరిష్కరించారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇచ్చిన హామీల్లో ఇదే సరళమైనది. వ్యవస్థాగతంగా చిన్నచిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే చాలు. పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదు. ఇలాంటి చిన్న హామీలు కూడా అమలు కాకపోవడంపైనే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నించింది. అధికారంలో లేనంత మాత్రాన బీఆర్ఎస్ ప్రజాబలం లేని పార్టీ ఏమీ కాదు. ప్రజల గొంతుకగా మారి ప్రభుత్వ తప్పులను గట్టిగా ప్రశ్నించేటంతటి శక్తిని బీఆర్ఎస్ పొందింది. ఆ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుకు సాగుతున్నది.