పార్టీలో సీనియర్లు తనకు అడుగడుగునా మోకాలడ్డుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు ఆయన వర్గీయులు వాపోవడం తెలిసిందే. కానీ, ఆయనా తక్కువ తిన్లేదని ఆ పార్టీ నేతలు ఇటీవల గుర్రుగా ఉన్నారు. తన ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ఖరారు కాకుండానే రేవంత్రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని అంతర్గత వేదికపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాది తిరక్కుండానే 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం, ఇంటి నిర్మాణానికి ఉచితంగా రూ. 5 లక్షలు, బెల్టుషాపుల రద్దు అని ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. వీటికి ఐఏసీసి ఆమోదం లేదని, అసలు ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీనే ఏర్పాటు చేయలేదు. అలాంటప్పుడు ఆయన ఒక్కరే ఇవ్వబోయే హామీలను ఎలా ఖరారు చేస్తారు? ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో నిలదీయనున్నట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం.