తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నాం. ఇక మిగిలింది నియామకాలే.
వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచే నియామకాల ప్రక్రియ షురువైంది. ఇప్పటికే దాదాపు 1,33, 942 ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఉద్యోగ నియామకాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు, ఐటీ రంగాల్లో కూడా మన రాష్ట్రం ఉద్యోగాల కల్పనలో అగ్రస్థానంలో ఉన్నది. మన రాష్ట్ర యువతకే కాకుండా దేశంలోని మిగతా రాష్ర్టాల యువతకూ మన రాష్ట్రంలో కొలువులు ఇచ్చేస్థాయికి ఈ రోజు తెలంగాణ ఎదిగింది. ఇది దేశానికే గర్వకారణం.
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారీ ఉద్యోగాల ప్రకటన దేశంలోనే మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించింది. 80,039 ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తామని 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించటం నిరుద్యోగ యువత, ఆయా కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగుల మొహాల్లో వెలుగులు నిండాయి. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. విద్యార్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి సిద్ధమవుతుండటం హర్షణీయం.
నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే ఈ మార్చి 9న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నిరుద్యోగుల జీవితాలనే మార్చ బోతున్నది. చరిత్రలో ఈ సంఘటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంలోనే స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అటెండర్ స్థాయి పోస్టు నుంచి మొదలుకొని ఆర్డీవో పోస్ట్ వరకు స్థానికులకే దక్కే అవకాశం నూతనంగా సాధించిన రాష్ట్రపతి ఉత్తర్వులతో వచ్చింది. ఐదు శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అందులో కూడా స్థానికులు పోటీ పడే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఈ నియామకాలతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న సిబ్బంది కొరత తీరుతుంది. తద్వారా పౌర సేవలు త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా పనిభారం తగ్గుతుంది. రిక్రూట్మెంట్ వయోపరిమితి అన్ని కేటగిరీల వారికి పదేండ్లు పెంచడంతో యువత ఎక్కువమంది పోటీ పడే అవకాశం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వయస్సు దాటి పోయిందని బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో ప్రకటించడంతో నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు లభిస్తాయని భరోసా కల్పించినట్లయింది.
ఈ ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వంపై ఏటా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉన్నది. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని భారం అనుకోవడం లేదు. సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియామకాలకు సంబంధించిన కార్యాచరణను వెంటనే మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరలో నియామకాలను పూర్తిచేస్తే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన ‘మన ఉద్యోగాలు మనకే’ అనే నినాదం నిజం అవుతుందనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: టీఎన్జీఓ యూనియన్ అసోసియేట్ అధ్యక్షులు, హన్మకొండ)
– పుల్లూరు వేణుగోపాల్
97010 47002