బీఆర్ఎస్ మునుగోడులో గెలిచేందుకు వీలుగా, కాంగ్రెస్ అభ్యర్థికి రూ.25 కోట్లు ఇచ్చిందని, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇంతకాలానికి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. మునుగోడు సంగతి ఏమో కానీ, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను గెలిపించేందుకు బీజేపీతో టీపీసీసీ కుమ్మక్కై బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపిందనే ఆరోపణ మాత్రం అప్పట్లో బలంగా వినిపించింది. మరి అక్కడ బీజేపీ తరపున తాను గెలవడానికి కాంగ్రెస్ అభ్యర్థికి ఎంత సమర్పించుకోవాల్సి వచ్చిందో కూడా ఈటల రాజేందర్ చెప్పి ఉంటే ప్రజలకు తెలిసేది.
తెలంగాణలో పాలకపక్షం బీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చీకట్లో చేతులు కలుపుతారనే ఆరోపణ తొలి నుంచీ ఉంది. ఒకరంటే ఒకరికి పడనట్టు, బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, లోలోన వీరి మధ్య లోపాయికారి సంబంధాలు బాగానే ఉన్నాయని అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. కానీ, ఈ విషయంలో తెలంగాణ బీజేపీతో పోలిస్తే కర్ణాటక బీజేపీనే బెటరని చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ ప్రచారకర్తల జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి కూడా స్థానం కల్పించారు. దీనిపై కర్ణాటక బీజేపీ వెంటనే స్పందిస్తూ.. ‘ఓటుకు నోటు కేసు’ నిందితుడితో ఇక్కడ ప్రచారమా? హవ్వా ! అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది.
జాతీయ పార్టీల ఢిల్లీ నేతలకు రాష్ట్ర నేతలు వంగి వంగి దండాలు పెట్టడం, విందులు, వినోదాలకు పిలవడం, రాచ మర్యాదలు చేయడం పరిపాటే. ఈ కల్చర్ కాంగ్రెస్లోనే కాస్త ఎక్కువ. ఈ సకల మర్యాదలు చేసేవారేమీ అమాయకులు కాదు. అధిష్ఠానం వద్ద పలుకుబడిని ఉపయోగించి, రేపటి రోజున ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తారేమోనన్న ముందుచూపు అంతే. కానీ, ఆ ఢిల్లీ నాయకులకు అధిష్ఠానం వద్ద ఎంతమేరకు పలుకుబడి ఉందనేది వీరు తెలుసుకుంటే మంచిది. ఏఐసీసీ కార్యదర్శి హోదాలో బోసురాజు అనే నేత ఒకరు తెలంగాణకు పరిశీలకునిగా చాలాకాలంగా ఉన్నారు.
అధిష్ఠానం వద్ద ఈయనకు పలుకుబడి ఉండే ఉంటుందనే అంచనాతో రాష్ట్ర నేతల నుంచి సకల మర్యాదలు అందుకునేవారు. ఇతరులకు టికెట్ ఇప్పించే సత్తా ఈయనకు ఉందో లేదో తెలియదు కానీ, తాజాగా కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోసురాజుకే టికెట్ దక్కలేదు. మహబూబ్నగర్కు సరిహద్దులో ఉన్న రాయిచూర్కు చెందిన బోసురాజు, అక్కడ కాంగ్రెస్ ప్రముఖుడైనప్పటికీ, ఆయనను కాదని ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ కేటాయించింది పార్టీ. కనీసం తన కుమారుడికైనా టికెట్ ఇవ్వమని ఆయన ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. రాయిచూర్ మైనారి టీ నేతలు ప్రియదర్శిని ఖర్గే ద్వారా పైరవీలు చేసి టికెట్ తెచ్చుకున్నారట. ప్రియదర్శిని ఎవరంటే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూతురు. కొస మెరుపు ఏమిటంటే, ఢిల్లీ నుంచి వచ్చారని సాగిలపడనవసరం లేదని కాంగ్రెస్ స్థానిక నాయకులు అనుకుంటున్నారిప్పుడు.
– వెల్జాల