కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే బుర్రలో అక్షరాలు మొలవవు. బడులలో మధ్యాహ్న భోజన పథకానికి దారితీసింది ఈ సూత్రమే. అల్పాదాయ వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసే భోజన సమస్య పరిష్కరిస్తేనే చదువులు సజావుగా సాగుతాయి. లేకపోతే డ్రాపౌట్లు, బాలకార్మిక వ్యవస్థ లాంటి అనాచారాలకు దారి ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు పకడ్బందీగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని మొక్కుబడిగా దొడ్డుబొడ్డు బియ్యంతో, నీళ్లచారుతో ‘మిధ్యాహ్న, అధ్వాన్న భోజన పథకం’గా మార్చిన సంగతి తెలిసిందే.
కానీ సీఎం కేసీఆర్ సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెట్టాలని ఆదేశించడం చిన్నారుల పట్ల ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నది. అయితే అంతటితో సరిపెట్టకుండా మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం బడిపిల్లలకు అందుబాటులోకి వచ్చింది. కానీ అంబటాల్ల దాకా ఆగుతారా పిల్లలు? ఇంటిదగ్గర ఏమైనా తిని వస్తే ఫరవా లేదు. కానీ ఏమీ తినని పిల్లల సంగతేమిటి? ఉదయం పూట టిఫిన్ చేయకుండా బడికి వచ్చే పిల్లలకు ధ్యాసంతా ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా? అనేదాని మీదే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం అల్పాహారం తీసుకోకుండానే బడికి వచ్చే పిల్లలు కనీసం 30 శాతం వరకు ఉంటారు. మరోవైపు పోషకాహార లోపం, రక్తహీనత సమస్య పిల్లలను వేధిస్తుండటం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది.
ఈ పరిస్థితులన్నిటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అల్పాహారం అందజేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో అల్పాహారం పథకం విజయవంతంగా నడుస్తున్నట్టు తెలుసుకొని అధికారుల బృందాన్ని అధ్యయనం నిమిత్తం ఆ రాష్ర్టానికి పంపారు. పథకం అమలవుతున్న విధివిధానాలపై ఇటీవలే ఆ బృందం సీఎంకు నివేదిక సమర్పించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే అల్పాహారం పెడుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ఒకరికి పెట్టి మరొకరికి పెట్టనట్టవుతుందని సీఎం కేసీఆర్ ఆలోచించడం గమనార్హం. ఎందుకంటే చాలాచోట్ల ప్రాథమిక, హైస్కూల్ తరగతులు ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. కొన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహారం ఇచ్చి మిగతా పిల్లలను వదిలేయడం సబబు కాదని భావించి 1 నుంచి 10వ తరగతి వరకు పిల్లలందరికి దీన్ని అమలుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం ముదావాహం.
రాష్ట్రంలో ఉన్న 28 వేల పాఠశాలల్లోని సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం కావడం ప్రశంసనీయం. అల్పాహారం కింద అందించే ఆహార పదార్థాల్లో పులిహోరా, పొంగల్, సేమియా, కిచిడీ, ఉప్మా వంటివి ఉన్నాయి. వీటికి తోడుగా పల్లీచట్నీ, సాంబార్ వంటివి ఇస్తారు. అల్పాహారం ప్రారంభించినప్పటికీ గుడ్డు, రాగిజావ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించడం సర్కారు పెద్ద మనసుకు నిదర్శనం. దీనికి ముఖ్యమంత్రి అల్పాహార పథకంగా నామకరణం చేయడం సముచితంగా ఉన్నది. అక్టోబర్ 6 నుంచి ప్రవేశపెడుతున్న ఈ పథకం చిన్నారుల సంక్షేమంలో మరో ముందడుగు అవుతుందనడంలో సందేహం లేదు.