తెలంగాణ నుంచి 1913లో బండారు శ్రీనివాసరావు ‘హితబోధిని’ అనే పత్రిక నడిపారు. ఆయనే 1910లో ‘ఆశాదోషం’అనే చారిత్రక నవలను రచించాడు. పాలమూరు జిల్లాలోని కోయిల్కొండ దుర్గాన్ని కుతుబ్షాహీలు జయించటం దీనిలోని ఇతివృత్తం. సరళ గ్రాంథికంలో చక్కటి పాత్ర చిత్రణలతో అది మనకు లభిస్తున్నది. తెలంగాణలో నవలా లక్షణాలతో కూడిన మొదటి రచన ‘ఆశాదోషం’అనే చెప్పాలి.
సోమరాజు రామానుజరావు (1896-1934) కథలు, నాటకాలే గాక నవలలు కూడా రచించాడు. ఆయన ఖమ్మం జిల్లాలో జమీందారు కుటుంబానికి చెందినవాడు. ఆయన రాసిన ‘స్వతంత్ర రథం’ అనే నాటకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వం నుంచి అరెస్టు వారెంటు రాగా రంగూన్కు పోయి అక్కడే 38వ ఏట చనిపోయాడు. రామానుజరావు 1914లో ‘జగన్మోహిని’ అనే చారిత్రక నవలను ప్రచురించాడు. ఈ నవల సరళమైన భాషలో ఉంది. ఆయన నవలలు చదివించేవిగా ఉండేవి. 1916లో ‘హైమావతి’ అనే సాంఘిక నవలను రచించాడు. అదే ఏడాది మరో నవల కూడా ప్రచురింపబడింది. ‘దోమడ యుద్ధం’అనే చారిత్రక నవల 1921లో ప్రచురింపబడింది. ఇంకా ‘శిశుహత్య’, ‘వనదుర్గము’, ‘తపోవనము’, ‘జపమాలిక’, ‘రక్తజ్వాల’, ‘కరుణ’ మొదలైన 21 నవలలను సోమరాజు రామానుజరావు రచించాడు.
ఒద్దిరాజు సోదరుల్లో ఒకరైన సీతా రామచంద్రారావు (1887-1956) ‘రుద్రమదేవి’ అనే చారిత్రక నవలను రచించి 1918లో ప్రచురించాడు. 1922లో అది పునర్ముద్రణ పొందింది. తర్వాత కాలంలో ఆయన ‘శౌర్యశకి’, ‘భ్రమర’, ‘బ్రాహ్మణ సాహసం’, ‘వరాహముద్ర’ వంటి చారిత్రక నవలలను.. ‘స్త్రీ సాహసము’, ‘ముక్త వలస’ అనే సామాజిక నవలలను రచించాడు.
ఒద్దిరాజు రాఘవ రంగారావు (1894-1973) ‘వీరావేశం’, ‘వరాహముద్ర’ అనే చారిత్రక నవలలను రచించా డు. సురవరం ప్రతాపరెడ్డి 1917లో ‘శుద్ధాంత కాంత’ అనే నవలను రచించాడు. ఆ తర్వాత ‘ఆరె వీరులు’ అనే చారిత్రక నవలను రచించాడు. 1922లో శేషభట్టరు వేంకట రామానుజాచార్యులు ‘ప్రాకృత దాంపత్యం’ అనే పేరుతో ప్రకృతిలో ఉన్న చెట్లు, చేమలే పాత్రలుగా నవల ను రచించాడు. శేషాద్రి రమణ కవులు ‘వసుంధర’ చారిత్రక నవలను 1922లో ప్రచురించారు. దేవులపల్లి వేంకట చలపతిరావు 1929లో ‘కొండపల్లి ముట్టడి’ అనే చారిత్రక నవలను రచించాడు. కోకల సీతారామశర్మ ‘పావని’ నవలను, బెల్లంకొండ నరసింహాచార్యులు ‘చీనా సుందరి’ అనే నవలను 1925లో ప్రచురించారు.
చాట్రాతి లక్ష్మీనరసమాంబ రచించిన ‘అనురాగ విపాకము’ అనే నవలను 1924లో ‘విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల’ వారు ప్రచురించారు. ఆమె స్త్రీ విద్యకోసం కృషి చేశారు. స్త్రీ చైతన్యాన్ని బోధిస్తూ ఈ నవల రాశారు. 1923లో చిల్లర శ్రీనివాసరావు ‘శ్రీధర విజయ ము’, ఊటుకూరి సత్యనారాయణరావు ‘శశికళ’, వనం నర్సింహారావు ‘పద్మినీ బాయి’ నవలలను 1923లో ప్రచురించారు. ‘శ్రీధర విజయము’ అనేది అపరాధ పరిశోధక నవల.
1927లో టేకుమళ్ల నరసింహం ‘రాధమ్మ’ అనే నవలలో కళావంతుల జీవితాన్ని చిత్రించారు. వేశ్యావృత్తి నిర్మూలన కోసం ఈ నవల రాయబడింది. ఆవునూరు వేణుగోపాలరావు ‘జొహరా బాయి’ నవల రాశాడు. భాగవతం సీతారామశర్మ ‘పశ్చాత్తాపం’, ‘పుష్పవతి’, ‘ఈశ్వర సంకల్పం’ నవలలను రచించాడు. అంబటి లక్ష్మీ నరసింహరాజు ‘శాంతాబాయి’ అనే నవల రాశాడు. 1920వ దశకంలో విరివిగా నవలలు వచ్చాయి. వీటిలో అధికం చారిత్రక నవలలు.
– ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606