దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. సీమాంధ్ర వలస పాలకుల వివక్ష, దోపిడి మూలంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలకు నిలయంగా మారింది. ఉమ్మడి పాలనలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెట్టాయి. కాటికి దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలోంచే తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల కోసం మొత్తంగా సీమాంధ్ర వలస పాలకుల దోపిడీ వివక్షలు, అణచివేతలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారు. సీమాంధ్ర పాలన నుంచి విముక్తి పొందారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ , ఉద్యమ నేత కేసీఆర్ పాలనలో దేశానికే అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది.
రాష్ట్రసాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమ పార్టీగా నాటి బీఆర్ఎస్ సహజంగానే ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు అధికారం చేపట్టింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో స్వీయ పాలన అంటే ఎలా ఉంటుందో అడుగడుగునా ప్రజలకు అనుభవంలోకి తెస్తున్నది. ఈసడింపులకు, వెక్కిరింతలకు గురైన తెలంగాణ పండుగలను తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలుగా గుర్తించి వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. బోనాలు, బతుకమ్మ మొదలు అనేక పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్నది. కరువుతో అల్లాడుతున్న తెలంగాణలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు సాగునీరందించి తెలంగాణ మాగాణాన్ని పైరుపచ్చలతో అలరారే విధంగా చేసింది కేసీఆర్ సర్కార్. దేశానికి రైతులే వెన్నెముక అని చెప్పటం కాదు, చేతలలో చూపటానికి రైతుబంధు పథకంతో రైతులను ఆదుకొన్నది. ఇంకా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీబంధు, ఆసరా, వృద్ధాప్య పింఛన్లు, చేతి వృ త్తుల అభివృద్ధికి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ పల్లెసీమల్లో సిరులు పంచుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్లతో ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి మాటమీద నిలబడే ప్రభుత్వంగా చాటుకున్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే పనిగా పెట్టుకొని దేశ సంపదను ప్రైవేటు పరం చేస్తుంటే.., తెలంగాణలో కేసీఆర్ ఇన్నాళ్లు కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి ప్రజల ప్రభుత్వం ఎలా ఉండాలో చూపించారు. ప్రజా రవాణా పట్ల ప్రభుత్వ బాధ్యతను నెరవేరుస్తున్నది.
ఒకప్పుడు బుక్కెడు బువ్వకు నకనకలాడిన తెలంగాణ ఇవాళ అన్నపూర్ణగా దేశానికే ధాన్యాగారంగా మారింది. అభివృద్ధి సంక్షేమంలో ఇవ్వాళ దేశంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధించింది. తెలంగాణమంతా సస్యశ్యామలమై వరి దిగుబడిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. చేతి, కుల వృత్తుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పథకాలతో గ్రామసీమలన్నీ సుఖసంతోషాలతో శోభిల్లుతున్నాయి. ఐటీ పారిశ్రామిక రంగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి తెలంగాణ యువత పురోగమిస్తున్నది. మొత్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విపక్షాలు అటు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా సాధించింది ఏమున్నది అంటే చెప్పుకోవటానికి ఏమీ లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిపోయాయి. ఎనలేని త్యాగాలతో సాధించుకున్న స్వరాజ్యంలో అనేక ఉన్నతాశయాలు, లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. అందులో పేదరిక నిర్మూలన, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో స్వావలంబన దేశంగా తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో అనేక పథకాలకు రూపకల్పన చేసుకున్నాం. దళిత బహుజన , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి కృషి చేయటమే కాదు, 1947తర్వాత పదేండ్ల కాలంలోనే రిజర్వేషన్లు అవసరం లేని సమాజంగా తీర్చిదిద్దాలని చెప్పుకొన్నాం. దీనికోసం ప్రణాళికలు రచించుకొన్నాం. ఒక్కో పంచవర్షప్రణాళికలో ఒక్కో రంగానికి ప్రాధాన్యమిచ్చి దేశాన్ని సమగ్రాభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఆరాటపడ్డాం. కానీ చెప్పుకొన్న ఏ ఆశయం నెరవేరలేదు. జాతీయోద్యమ కాలంలో కన్న కలలన్నీ కల్లలై పోయాయి.
దేశ ప్రజలు తరతరాలుగా అనుభవిస్తున్న సమస్యలతోపాటు స్వయం పాలనలో పేదరిక నిర్మూలన జరుగక పోగా మరింత పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. కానీ తెలంగాణలో కేసీఆర్ పాలనా విధానాలతో.. అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే అవార్డుల్లో 30శాతం తెలంగాణకు రావటమే తార్కాణం. వీటన్నింటికీ తలమానికంగా చెప్పుకోవాల్సింది… ఇవ్వాళ తెలంగాణ దేశానికే ఆర్థిక వనరుగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. తలసరి ఆదాయంలోనూ, ఎన్ఎస్డీపీలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలవటం గమనార్హం. దేశంలో డబ్బు ఐదు ఏండ్లలో సాధించని అభివృద్ధిని, తెలంగాణ తొమ్మిదేండ్లలోనే చేసి చూపింది. అయినా కొంతమంది తమ ఓట్ల రాజకీయం కోసం కేసీఆర్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. వారికి ప్రజలు అదనుచూసి కర్రు కాల్చి వాతపెట్టక మానరు.
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో అద్భుత ఫలితాలను సాధించింది. ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ప్రస్తుత ధరల ప్రకారం….తెలంగాణలో పర్కాపిటల్ ఇన్కమ్..2022-23 సంవత్సరంలో రూ.3,08,732లుగా ఉన్నది. అదే కర్ణాటకలో రూ. 3,01,673, హర్యానాలో రూ.2,96,685గా ఉన్నది. ఈ విధంగా తలసరి ఆదాయంలో, ఎన్ఎస్ డీపీలో.. దేశంలో పెద్దవి, ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొంటున్న గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందుండటం కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పాలనకు నిదర్శనం.అందుకే బంగారు తెలంగాణను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మూడోసారి పట్టంగట్టి అక్కున చేర్చుకుంటారనటంలో సందేహం లేదు.
(బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు)