దేశంలోని అనేక ప్రాంతాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వట్టిపోయిన ప్రాజెక్టులతో, ఎండిన పంటలతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణ అన్ని కాలాల్లో నిండైన జలాశయాలతో కళకళలాడుతున్నది. పంటలకు భరోసా ఏర్పడింది. నివాస గృహాలకూ నల్లాల ద్వారా పుష్కలంగా తాగునీరు అందుతున్నది. నీటిగోసకు శాశ్వతంగా తెరపడటం తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన నికర విజయంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇది ఊహకు కూడా అందని విషయం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజల, పంటల దూపను తీర్చిన ఘనకీర్తిని కేసీఆర్ ప్రభుత్వం దక్కించుకున్నది. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలకూ, తెలంగాణకూ మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దేశంలో 717 జిల్లాలుంటే అందులో 221 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. గత 15 ఏండ్లలో సుమారు 100 జిల్లాలు తొమ్మిదేండ్లు కరువును ఎదుర్కొన్నాయి. నీటి ఎద్దడి అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది.
గత పాతికేండ్లుగా భారత్లో కరువు ప్రభావిత ప్రాంతం 57 శాతం పెరిగిందని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) నివేదిక వెల్లడించింది. మన పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీల్లోనూ పలు ప్రాంతాలు కరువుకు గురికావడం ఆందోళనకరం. ప్రస్తుతం దేశంలోని 80 శాతం రిజర్వాయర్లలో నీటినిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర జల సంఘం నివేదిక తెలియజేస్తున్నది. కేంద్రానికి కరువు నివేదికలు, కరువు సాయానికి అభ్యర్థనలు యథావిథిగా జరిగిపోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జల సంరక్షణకు ‘జలదృశ్యం’ పూర్తిగా మారిపోయింది. సమర్థమైన నీటి యాజమాన్యం వల్ల గత ఎనిమిదేండ్లలో జిల్లా కాదు కదా కనీసం ఒక మండలం కూడా కరువు బారిన పడలేదు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం, చిన్నాపెద్దా ప్రాజెక్టులు పూర్తిచేసి కాలువలతో అనుసంధానించడం, హరితహారం ద్వారా అడవులు పెంచడమనే బహుముఖ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేసిన ఫలితంగా ఎండాకాలంలోనూ మత్తళ్లు దుంకాయి మన రాష్ట్రంలో.
తెలంగాణ అభివృద్ధికి నీటి వనరులను మళ్లించడంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఇప్పటికీ శరపరంపరగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా దేశంలోని ‘సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం’పై కేంద్ర జల్శక్తి శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో రాష్ర్టానికి చెందిన సాత్నాల, కోయిల్సాగర్ ప్రాజెక్టులు ప్రథమ స్థానం లో నిలవడమే ఇందుకు ఉదాహరణ. ప్రాజెక్టుల పరిపూర్తి మాత్రమే కాకుండా వాటిని సమర్థంగా నిర్వహించడంపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడమే ఈ గుర్తింపును తెచ్చిపెట్టింది. నదుల వెంబడి నాగరికత అభివృద్ధి చెందిందని చెప్పుకొంటారు. కానీ, ఇప్పటి కాలంలో నాగరికత ఎక్కడుంటే నదులు అక్కడికే పరుగులు తీయాల్సి ఉంటుంది. అలా మళ్లించగలిగినప్పుడే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కేసీఆర్ లాంటి దార్శనిక నేత మాత్రమే నీటి బిందువు కోసం మట్టి కన్న స్వప్నాన్ని సాకారం చేయగలరు. జల సమృద్ధిని సాధించిపెట్టి ప్రజలకు గట్టి భరోసా ఇవ్వగలరు. ఇందుకు మన జలచరిత్రే సాక్షి.