బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వ బడుల్లో బ్లాక్ బోర్డుల బదులు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల బడులలో 13,983 ప్యానెల్స్ ఏర్పాటుచేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు అధికంగా ఉన్న బడులలో పాఠశాలకు మూడు చొప్పున, సంఖ్య తక్కువగా ఉన్నచోట ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్యానెల్స్ ఉపయోగించి 8,9,10 తరగతుల విద్యార్థులకు బోధన చేయనున్నారు.
ప్రయోజనాలు: ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మినీ కంప్యూటర్ వలె పనిచేస్తాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ప్రపంచవ్యాప్తంగా తరగతి గది బోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇంటర్నెట్ నుంచి వివిధ అంశాలు సేకరించి బోధించవచ్చు. అనుభవజ్ఞులు, నిష్ణాతులైన వారి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బోధన జరుపవచ్చు. టీచర్లు వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించి, క్రోఢీకరించి పాఠ్యాంశాలు తయారుచేసుకోవచ్చు.
విద్యార్థులు పూర్తిస్థాయిలో బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వాములవుతారు. ప్రయోగశాలలో నిర్వహించే ప్రయోగాలను వీక్షించడం ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందుతారు. సాధారణ బ్లాక్ బోర్డు మీద బోధించలేని ఎన్నో అంశాలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా వివరించవచ్చు. ఇవన్నీ విద్యార్థుల్లో ఉత్సుకతను, ఊహాశక్తిని పెంపొందిస్తాయి.
వీటిలో అతి తక్కువ నీలికాంతిని వినియోగించడం వల్ల కండ్లపై కూడా ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ప్యానల్ 75 ఇంచులతో భారీ పరిమాణంలో ఉండటం వల్ల తరగతి గదిలో అందరూ స్పష్టంగా చూడవచ్చు. కంటిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. మామూలు సమయంలో వీటిని సాధారణ గ్రీన్బోర్డుగా కూడా వినియోగించవచ్చు. ప్యానెళ్లను సేకరించడం మాత్రమే కాకుండా బోధనలకు అవసరమైన డిజిటల్ పాఠ్యాంశాలు రూపొందించడంపై కూడా పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది.
దీనికోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) సహకారంతో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్ఈఆర్టీ) కలిసి పనిచేస్తున్నది. డిజిటల్ విద్యాబోధన విద్యార్థులలో ఆసక్తిని, ఉపాధ్యాయులలో ఉత్సాహాన్ని పెంపొందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే విద్యా సంవత్సరం తెలంగాణ ప్రభుత్వ బడులకు డిజిటల్ సొబగులు దిద్దబోతున్నది. దీంతో తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలనే ఉత్సా హం కనబరుస్తున్నారు. ఇది శుభసూచకం.
-డాక్టర్ ఏ.వేణుగోపాల్ రెడ్డి