రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి ఆమోదం కోసం పంపిన నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ను తిప్పి పంపుతూ గవర్నర్ చేసిన రాతపూర్వక వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలను కించపరచడమే తప్ప మరొటి కాదు. డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ను, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయలేను అంటూ… ఒక విద్యాధికుడు, ఒక వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి గురించి బహిరంగ లేఖ రాస్తూ గవర్నర్ వాడిన భాష ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల గురించి ఆమెకున్న వివక్షాపూరిత ధోరణికి అద్దం పడుతున్నది. సమాజంలో ఎన్నో కష్టాలను అనుభవించి పైకెదుగుతున్న నిమ్న వర్గాలను ఆదరించాల్సిన ఒక గవర్నర్ వారి పేర్లను తిరస్కరిస్తూ, వారి పరువుకు నష్టం కలిగే విధంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వారికి లేని గుణగణాలను ఆపాదిస్తూ కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కార లేఖ రాయడాన్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్బండ కులాలు తీవ్రంగా ఖంఢిస్తున్నాయి.
గవర్నర్ హోదాలో ఉంటూ నిమ్నకులాలకు చెందిన బిడ్డల గురించి అంత ఘోరంగా వ్యవహరించడం అంటే స్వయానా రాజ్యాంగ రచయిత అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తిని, బోధించు..సమీకరించు..పోరాడు అంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేసేందుకు ఇచ్చిన నినాద స్ఫూర్తిని రాజ్భవన్ సాక్షిగా అవమానించినట్టే. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్గా పనిచేస్తున్న మాజీ తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షురాలిని కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాం. రాజకీయ పార్టీలు అంటే మీ అభిప్రాయంలో ఏమిటి? పార్లమెంటరీ పంథాను అనుసరించి సాగే ప్రజాస్వామిక పాలనకు రాజకీయ పార్టీలే మూల స్తంభాలు అనే కనీస సోయి గవర్నర్ స్థానంలో కూర్చున్న మీకు లేకపోవడం శోచనీయం. ‘పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ’ అని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని మీరు అపహాస్యం చేయదలిచారా? దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ రాష్ట్రంగా మారినా అవన్నీ చేసింది రాజకీయ పార్టీలేననే సంగతి మీకు తెలియకపోవడం సామాజిక, రాజకీయ అవగాహన రాహిత్యమే తప్ప మరొకటి కాదు. రాజనీతిని అనుసరించి రాజకీయ పార్టీలను వేదికగా చేసుకుని సామాజిక సేవ చేస్తూ రాజకీయ అధికారంలో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ బడుగు బలహీన వర్గాలు ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతూ మందిలో కలుస్తున్నాము. అలాంటి దశలో బాధ్యత కలిగిన గవర్నర్గా మీరు రాసిన లేఖ మమ్మల్నందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒక గవర్నర్గా మీరు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ వాడిన పదాల్లో ముఖ్యంగా… inappropriate అనే పదాన్ని వాడే ముందు మీరు మీ గురించి ఆలోచించుకోవాలని ఎందుకనిపించలేదు? ఇతరులను వేలెత్తి చూపేముందు మీవైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నవనే సంగతిని ఎందుకు మరిచిపోయారు? మీకు అంతగా రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాటిని అనుసరించడంలో మీ నిజాయితీని నిరూపించుకోవాలని అనిపించలేదా? ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న మీకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని కట్టబెడుతున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకొన్నారు? మీరు ఈ రోజు లేఖలో గుర్తు చేసిన రాజ్యాంగ నిబంధనలు, ఆర్టికల్ 171 గట్రా మీకెందుకు ఆనాడు గుర్తుకు రాలేదు? రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ ఫక్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్న మీకు, గవర్నర్ పదవిని స్వీకరించడానికి మనసు ఎట్లా ఒప్పింది? మీకు అప్పుడీ నైతికత యాదికి రాలేదా?
మీరు రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చి చేస్తున్న కుళ్లు రాజకీయ విన్యాసాలను ప్రపంచం ముక్కున వేలేసుకొని చూస్తున్న విషయంపై మీకెవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వట్లేదా? ఇలాంటి పరిస్థితుల్లో మీకున్న అనర్హత, మీరే గవర్నర్ పదవికి inappropriate అనే విషయం మీకు గుర్తుకు రాలేదా? మీ నైతికత ఏమైందని ప్రశ్నిస్తున్న జనాలకు ముందు సమాధానం చెప్పండి. మీరు ఉటంకిస్తున్న చట్టాలు, నిబంధనలు మీరు ప్రతిరోజూ ఉల్లంఘిస్తున్న పరిస్థితులు కనిపిస్తూనే వున్నాయి. మీలాంటి రాజకీయ నాయకులు గవర్నర్లుగా పనికిరారనే సర్కారియా కమిషన్ సిఫారసుల సంగతి మీకేమైనా తెలుసా? ఇటువంటి అనేక నిబంధనలను తుంగలో తొక్కి నైతిక నీతి సూత్రాలను గాలికి వదిలి ఒక రాజకీయ పార్టీకి అనుబంధ spokes person మాదిరిగా పనిచేస్తున్న మీరు మా గిరిజన ఎంబీసీ బిడ్డలను అనర్హులుగా ముద్ర వేయడం మీ వివక్షతాపూరిత ధోరణికి నిదర్శనం. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో గిరిజన బిడ్డడైన కుర్రా సత్యనారాయణను, బీసీ బిడ్డ దాసోజు శ్రవణ్ల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, పరువుకు నష్టం కలిగించే విధంగా వాడిన పదజాలాన్ని, అభ్యంతరకరమైన భాషను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కొన్ని సామాజిక వర్గాలు తిరస్కరించిన మిమ్మల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు కూడా తిరస్కరించడం ఖాయం. రాజ్భవన్లో ఉంటూ రాజకీయాలు చేస్తున్న మీపై తీసుకొనే న్యాయపర చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం.
ఇట్లు : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల నేతలు, ప్రజాస్వామిక వాదులు, మేధావి వర్గాలు