చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉండటంతో తెల్లారేదాకా ఇల్లిల్లూ తిరిగి వెళ్లిపోయేదని నమ్మేవాళ్లు.
ఇటీవల అచ్చంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకూ ఇదే అనుభవం ఎదురైంది. తన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ‘సేవ్ తెలంగాణ’ కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు ఆమె ఫోన్ చేశారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ (తెలంగాణ జనసమితి) కార్యాలయాలకు స్వయంగా వెళ్లి కలిశారు.
‘మావి పెద్ద పార్టీలు కావడంతో మాకే బీ టీమ్లు ఉన్నాయి. మీదేమో బీ టీమాయే. ఎక్కడైనా బీటీమ్లకు ఏ టీ మ్లు ఉంటాయా? అని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు షర్మిల మొహం మీదనే ప్రశ్నించాయి. ఇక సీపీఐ, టీజేఎస్లు అయితే, మళ్లీ రండి చెబుతామని అన్నాయి. ఇదేంది మేడమ్.. మన పరిస్థితి ‘ఓ స్త్రీ రేపు రా’ అన్న ట్టు ఉందని ‘జై షర్మిలక్క’ బ్యాచ్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే ‘పాదాల మీద నడిచే.. పాదయాత్ర’కు బయలుదేరింది.
– వెల్జాల