ఎన్నాళ్లుగానో శీతల గిడ్డంగిలో పడున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధి సందేహాస్పదంగానే ఉన్నది. చట్టసభల్లో మహిళ లకు 33 శాతం రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కావని అనిపిస్తున్నది. అమలు కాని, ఆచరణలో సాధ్యం కాని మహిళా బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు, అందునా కొత్త సభావేదిక సాక్షిగా తొలి బిల్లు ప్రవేశపెట్టి అపహాస్యం చేశారనిపిస్తుంది. మహిళా బిల్లు వెనుక అనేక పోరాటాలు, ఆందోళనల నేపథ్యం ఉన్నా ఉభయ సభల ఆమోదం, కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం మేధావులు, ప్రజాప్రతినిధులు, బుద్ధిజీవులు బీజేపీ సర్కారు చిత్తశుద్ధిని అనుమానించాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే ఈ బిల్లు కాలయాపన బిల్లే తప్ప మరోటి కాదనిపిస్తున్నది.
Women’s Reservation Bill | చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తీరు చూస్తుంటే ఈ తతంగమంతా దేనికని అనిపించక మానదు. గతంలో కాంగ్రెస్ రాజ్యసభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి తాత్సారం చేసినట్టే ఇప్పుడు బీజేపీ కూడా కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా మళ్లీ అదే బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టి యావత్ మహిళలోకాన్ని బురిడీ కొట్టించిందా? మహిళా బిల్లును ఆచరణాత్మకంగా అమలు చేయాలనుకున్నప్పుడు 2029లో అమలు చేస్తామని చెప్పడం కాలయాపన కాదా? మహిళా బిల్లు అమలు పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఉభయ సభల సాక్షిగా విమర్శలు గుప్పించినా ఆ పార్టీ కూడా తక్షణం అమలుకు అంతగా ఆసక్తి కనబరచకపోవడం విడ్డూరమే. అంటే కాంగ్రెస్ చేసిన పనే బీజేపీ చేస్తున్నది. డీలిమిటేషన్, ఓబీసీ రిజర్వేషన్లు, కులగణన ఇత్యాది అంశాల సాకు చెబుతున్నప్పుడు, మరి పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ముందుగా ఆ బిల్లును ఎందుకు చేపట్టలేకపోయింది. ఎన్నికల ముందే ఎందుకు తెచ్చారు? ఒకవేళ మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తక్షణం అమలు చేయడం లేదన్నది చర్చించాల్సిన అంశం. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పార్లమెంట్ భవనంలో తొలి బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం తీరు మహిళా బిల్లు విషయంలో ఓ స్త్రీ రేపు రా అనే సామెతనే గుర్తు చేస్తున్నది. బీజేపీకి నిజంగా బిల్లుపై ఆసక్తి ఉంటే పైలట్ ప్రాజెక్టుగానైనా ఈ దఫా ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉండింది. డీలిమిటేషన్, బీసీ గర్జన, కులగణన అడ్డంకులుగా ఉన్నవని భావిస్తే ఉన్నపళంగా ప్రత్యేక సమావేశంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఉదయిస్తున్నది. కులమత సహిత సమాజంలో అణచివేతకు గురై ఎదుగుదలకు నోచుకోని కులాల మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించగలిగే రీతిలో ప్రయత్నాలుండాలి. ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదు. వెనుకబడిన తరగతులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం మెరుగవ్వాలనే ఆలోచన ఇప్పటి తక్షణావసరం. ఇందుకోసం జనాభాలెక్కల్లో భాగంగా బీసీ జనగణనను చేపట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలకోసం నిర్దేశించిన వివరాలను దామాషాగా తీసుకొని చట్టసభల్లో అమలు చేయొచ్చు. ఆ ఆలోచన మహిళా రిజర్వేషన్ బిల్లు సభలో ప్రవేశ పెట్టిన పార్టీలకు లేదు. ఏండ్లతరబడి కనీస ప్రస్తావనకు నోచుకోని ఈ సమస్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఉద్యమ నేపథ్యంలో ముందుకొచ్చింది.
నిజానికి ఆ బిల్లు కోసం కొన్నేండ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ పోరాట తత్వం, రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి పోరాట పటిమను అందిపుచ్చుకుని చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తెలంగాణ వీరవనితగా ఎమ్మెల్సీ కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేపథ్యంతో చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమె ప్రధాన పోరాట అస్త్రంగా ఎంచుకున్నారు.
ఆమె పార్లమెంట్లో అడుగిడిన మొదటి రోజు నుండే మహిళా బిల్లు కోసం గళం విప్పుతూ వస్తున్నారు. దీని కోసం ఉద్యమ కార్యాచరణ అమలు చేశారు. దేశంలోని పలువురు మేధావులకు పోస్టుకార్డులు రాయడంతో పాటు కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, మిస్డ్ కాల్స్ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం దేశాన్ని ఒక్కటి చేసినట్టే, దేశ రాజకీయాల మద్దతు కూడగట్టినట్టే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశంలోని కోట్లాది మహిళల పక్షాన ఆమె ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టారు. బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కోరారు. అందుకోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని, అందరూ ఒక్క మాటపై నిలబడి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తేవాలని ఆమె ఆయా పార్టీలను అభ్యర్థించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విజయం సాధించారు. ఒక సహజసిద్ధమైన డిమాండ్ కోసం ఆమె పోరాడిన తీరును అభినందించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యమిస్తేనే ఉప్పెన…విప్లవిస్తేనే విజయం అన్న శ్రీశ్రీ మాటలను ఎమ్మెల్సీ కవిత నిజం చేశారు. ఏదైనా తెగించి కొట్లాడితే తప్ప ఫలితాలుండవని క్షేత్రస్థాయి అనుభవాలతో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె కొంగు నడుముకు చుట్టి దేశంలోని మహిళలోకానికి ఆదర్శంగా నిలిచారు.
మొత్తానికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చట్టసభల వరకు బిల్లులను తీసుకొచ్చి ఆమోదింప చేసుకున్నా అమలుపై మాత్రం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మహిళా బిల్లు ఉభయ సభల వరకూ వచ్చినా, దాన్ని చిత్తశుద్ధితో అమలుపరిచేవారు లేకపోవడం విచారకరం. అందుకే ఎమ్మెల్సీ కవిత మరోపోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. బిల్లు కోసం ఎలాంటి ఉద్యమాలు చేశారో, దాని అమలు కోసం అంతే స్థాయిలో ఒత్తిడి, పోరాటాలు కూడా కవిత వల్లే సాధ్యం.
– వెంకట్ గుంటిపల్లి 94949 41001