తప్పులు చేయటం, దిద్దుబాట్లు చేయటంతోనే కాంగ్రెస్ సర్కార్ కాలం గడిపేస్తున్నది. బడుగు, బలహీన వర్గాల పిల్లల ఫీజుల విషయమై ఒకడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్న నిర్లక్ష్యవైఖరే ఇందుకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యా ఫీజు రీయింబర్స్మెంట్పై గత ఏప్రిల్లో జీవో నం.7ను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల ఆధార్ లింక్డ్ ఖాతాల్లోకి సర్కార్ ఫీజు సొమ్ము వేస్తుంది, ఆ తర్వాత విద్యార్థులు కాలేజీలకు ఆ సొమ్ముతో కాలేజీ ఫీజులు కట్టాలి అనేది ఆ జీవోలో సూచించింది. అయితే సదరు డీబీటీ అమలుపై తలాతోకా లేకుండా జారీచేసిన మార్గదర్శకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
వాటిలో నిర్దిష్టమైన సమయ ప్రణాళిక లేకపోవటమే పెద్ద సమస్య. బకాయిలు దండిగా పోగుపడటం, ఆలస్యంగా నిధులు విడుదల అవుతుండటమే అందుకు కారణం. విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు కాలేజీలకు సర్కార్ పరోక్షంగా స్వేచ్ఛనివ్వడం ‘తాంబూలాలిచ్చేశాం..తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉన్నది. దీంతో విద్యార్థులు, కళాశాలల ప్రతినిధులు, పౌర సమాజ సంస్థల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనాలోచిత నిర్ణయం ఫలితంగా చదువులు డోలాయమానంలో పడటం సహజంగానే ఆందోళనకు దారితీసింది. మరోవైపు ఈ అంశంపై దాఖలైన కేసును విచారించిన హైకోర్టు, కాలప్రణాళిక లేకుండా జారీచేసిన డీబీటీ మార్గదర్శకాలపై సర్కార్కు అక్షింతలు వేసింది. సర్కార్ అనాలోచిత పనితీరుకు ఈ వ్యవహారం అద్దం పట్టింది.
హైకోర్టు సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు రావటంతో ప్రభుత్వం జీవో 7ను రద్దు చేస్తూ జీవో 8, నూతన మార్గదర్శకాలపై జీవో 9ని తాజాగా విడుదల చేసింది. ఈ రెండు జీవోలను గుట్టుచప్పుడు కాకుండా తేవటం పలు అనుమానాలకు దారితీసింది. జారీచేసిన వెంటనే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టకపోవటమే అందుకు కారణం. ఈనెల 6వ తేదీన జీవో జారీచేస్తే 9వ తేదీవరకు వాటిల్లోని అంశాలు బయటకు రాకపోవటం విశేషం. కొత్త మార్గదర్శకాల్లో ఫీజు సొమ్ము విడుదలపై కాలపరిమితి చేర్చినప్పటికీ మడతపేచీలు చాలానే ఉన్నాయి. గడువు ప్రకారం వారంలోగా ఖాతాలో పడిన సొమ్ముతో ఫీజులు చెల్లించని విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగిస్తామని షరతు విధించటం గమనార్హం.
సవాలక్ష నిబంధనలు చేర్చి ఏ చిన్న తప్పు జరిగినా ఆర్ఆర్ యాక్టు కింద రికవరీ చేస్తామని, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని బెదిరించటం అర్థరహితం. అవకతవకలకు పాల్పడిన కాలేజీలపై చర్యలు తీసుకుంటామనే నిబంధన లేకపోవటం ఏమిటి? సర్కార్ విధించిన ఆంక్షల ప్రకారం పత్రాలు సమర్పించటం పేదింటి పిల్లలకు కష్టసాధ్యమే. ఆదాయ ధ్రువీకరణ వంటి అంశాల్లో ఉన్న చిక్కులు తెలియనివికావు. ఎక్కడ ఏ చిన్న తప్పు దొర్లినా రికవరీ చర్యలు తప్పవని హెచ్చరించటం విద్యార్థులను నిరంతరం ఆందోళనకు గురిచేయటమే.
ఫీజు విషయంలో కాలేజీలే విద్యార్థి అర్హతను నిర్ధారించుకోవాలని, అందుకు ఓ నోడల్ ఆఫీసర్ను నియమించుకోవాలని అంటూనే, తప్పు చేసే కాలేజీల గురించి ఒక్క మాట లేకుండా ఇలా విద్యార్థులను బెదరగొట్టటం సమంజసం కాదు. రెండేండ్లుగా బకాయిల్లో ఒక్క రూపాయి చెల్లించని ప్రభుత్వం ఏడాది కాలానికి అయ్యే ఫీజును మూడు విడతల్లో కాకుండా ఒకే విడతలో చెల్లిస్తానని అంటున్నది. వాయిదాల్లో చెల్లించలేక చతికిలబడుతున్న ప్రభుత్వం ఏకమొత్తంగా ఎలా చెల్లించగలదనేది ప్రశ్న. ఈ తప్పటడుగుల పరంపర బడుగుల పిల్లల చదువుల పట్ల సర్కార్ అనాసక్తిని, నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నదని చెప్పక తప్పదు.