స్వాతంత్య్రానంతరం ఏడున్నర దశాబ్దాలలో వైద్య విద్యలో ఎన్నడూ, ఎక్కడా జరుగని అద్భుతాన్ని తెలంగాణలో ఆవిష్కరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్య విద్యలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులే ప్రబల నిదర్శనం. నేడు ఏకకాలంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభిస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తున్నది.
తెలంగాణ విద్యార్థులకు వైద్యవిద్యను చేరువ చేయాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ గారు నేడు జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను నెలకొల్పే మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈ లక్ష్యసాధనలో భాగంగా దశాబ్దకాలంలోనే 21 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అద్భుతమైన పరివర్తన సాధించింది. దానికి కొనసాగింపుగా వైద్య విద్యలోనూ తెలంగాణను దేశంలోకెల్లా అగ్రగామిగా నిలిపింది.
నిజాం పాలనా కాలంలోనే 1856లో ఉస్మానియా మెడికల్ కాలేజీ, 1954లో గాంధీ ఆసుపత్రి ఏర్పాటయ్యాయి. వరంగల్లో రీజినల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్లో పంటలు అమ్మడానికి వచ్చిన రైతుల నుంచి లెవీగా తీసుకున్న విరాళాలతో 1959లో కాకతీయ మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఆ తర్వాత అది ప్రభుత్వ కళాశాలగా మారింది. అంటే తెలంగాణలో ఏర్పాటైన 3 మెడికల్ కాలేజీల విషయంలో గత ప్రభుత్వాల పాత్ర శూన్యం. తెలంగాణ ఉద్యమం దెబ్బకు భయపడిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు 2008లో ఆదిలాబాద్లో, 2013లో నిజామాబాద్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి.
ఆరు దశాబ్దాల పాలనలో ఆనాటి పాలకులు కేవలం రెండే రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, స్వరాష్ట్రం సాధించుకున్న దశాబ్దకాలంలోనే సీఎం కేసీఆర్ గారు జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ చొప్పున కొత్తగా 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇది చరిత్ర ఎరుగని అద్భుతం.
2016-17 విద్యాసంవత్సరంలో మహబూబ్నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, 2018-19 విద్యాసంవత్సరంలో నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరంలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత 2023-24 విద్యా సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నది.
మనం ఎక్కడైతే వివక్షకు గురయ్యామో, ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోకుండా అష్టకష్టాలు పడ్డామో, ఎక్కడైతే వైద్యవిద్య అందని ద్రాక్షగా మారి ఆపసోపాలు పడ్డామో.. అదే గడ్డమీద.. స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో ఏకంగా 34 మెడికల్ కాలేజీలను కలిగిఉండే స్థాయికి చేరుకోబోతుండటం మనందరికీ గర్వకారణం. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా రాష్ట్ర సొంత నిధులతో ఒకే ఏడాదిలో ఇంత పెద్దసంఖ్యలో మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం దేశంలో ఇంకెక్కడా జరగలేదు. దేశ వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకకాలంలో నేడు 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించడం కూడా ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిన ఘనత.
ఇదే క్రమంలో వచ్చే ఏడాది 2024-25 విద్యాసంవత్సరం నుంచి మరో 8 జిల్లాల్లో (అనగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి) కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 29 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం సంపూర్ణంగా సాకారమవుతుంది.
2014నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. ఇవాళ మొత్తం 26 మెడికల్ కాలేజీలతో కలిపి ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య 3790కి చేరింది. వచ్చే ఏడాది ప్రారంభించే మెడికల్ కాలేజీలతో మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి.
స్థానికులకే విద్య, ఉద్యోగావకాశాలు దక్కాలనే లక్ష్యంతోనే తెలంగాణ పోరాటం జరిగింది. అదే స్ఫూర్తితో కొత్త మెడికల్ కాలేజీలలో 95 శాతం తెలంగాణ విద్యార్థులకే లభించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సరైందేనని ఇటీవలే హైకోర్టు సైతం సమర్థ్ధించింది. గతంలో 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల మన తెలంగాణ విద్యార్థులకు మరో 520 సీట్లు దక్కాయి. దీంతో పాటు ఎంబీబీఎస్ బీ-క్యాటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు మరో 1300 ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల తెలంగాణ విద్యార్థులకు మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినకొద్దీ ఈ సీట్లసంఖ్య మరింత పెరుగనుంది. అలాగే, ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవడం వల్ల గతేడాది 2,09,646 ర్యాంకు వచ్చిన ఎస్టీ విద్యార్థికి కూడా ఎంబీబీఎస్ సీటు లభించింది.
నేడు ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్ల అవకాశాలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2022-23లో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం కావడం గమనార్హం. పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించడం వల్ల, సాధించిన రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ గారు ఉండటం వల్లనే నేడు జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కల సాకారమైందన్నది కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. ఇవాళ ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి ఏటా దాదాపు పదివేల మంది విద్యార్థులను తయారుచేసే స్థాయికి మన రాష్ట్రం చేరుకోవడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాదు.. ఉక్కు సంకల్పంతో దశాబ్దకాలంలోనే దానిని సాకారం చేసి చూపించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతోపాటు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్నది. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా స్పెషాలిటీ వైద్యసేవలు పేద ప్రజలకు చేరువ చేశారు. తెలంగాణ విద్యార్థులకు వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చారు.
లక్షలు పోసినా దొరకని సీట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పేదింటి బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ పట్టా పొందే అవకాశం కల్పించారు. మెడికల్ సీట్లను అనేకరెట్లు పెంచడం ద్వారా దేశంలో తెల్లకోటు విప్లవం తీసుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ ఉండడం వల్లే ఇవాళ మనం ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నామన్నది అక్షర సత్యం.
ఇది సీఎం కేసీఆర్ విజయం..
ఇది తెలంగాణ ప్రజల విజయం..
ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం..
– తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర వైద్యారోగ్యశాఖామాత్యులు